Azadi Ka Amrit Mahotsav: గాంధీ మెచ్చిన నినాద ధీరుడు

author img

By

Published : Sep 14, 2021, 7:36 AM IST

Azadi Ka Amrit Mahotsav
గాంధీ మెచ్చిన నినాద ధీరుడు ()

భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపి.. బ్రిటిష్‌వారిని ఇరకాటంలో పెట్టిన ఈ నినాదాల సృష్టికర్త యూసుఫ్‌ మెహర్‌ అలీ. కుటుంబ సభ్యులు వద్దంటున్నా వినకుండా భార్దా హైస్కూల్‌లో చదువు కాగానే స్వాతంత్య్రోద్యమంలో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమానికి ఆ పేరు సూచించింది కూడా ఈయనే.

సైమన్‌ గో బ్యాక్‌, క్విట్‌ ఇండియా- నాడే కాదు నేటికీ నిలబడ్డ నినాదాలు! భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపి.. బ్రిటిష్‌వారిని ఇరకాటంలో పెట్టిన ఈ నినాదాల సృష్టికర్త యూసుఫ్‌ మెహర్‌ అలీ!

1903లో ముంబయిలోని అత్యంత సంపన్న వాణిజ్య కుటుంబంలో పుట్టారు యూసుఫ్‌. బ్రిటిష్‌ వారితో సౌమ్యంగా ఉండే ఆయన కుటుంబం జాతీయోద్యమానికి దూరంగా ఉండేది. కుటుంబ సభ్యులు వద్దంటున్నా వినకుండా భార్దా హైస్కూల్‌లో చదువు కాగానే స్వాతంత్య్రోద్యమంలో చేరారు యూసుఫ్‌.

కూలీలుగా వెళ్లి 'సైమన్‌ గోబ్యాక్‌'

ప్రభుత్వ కళాశాలలో న్యాయశాస్త్రం చదువుతుండగా.. 1928లో బ్రిటిష్‌ ఎంపీలతో కూడిన సైమన్‌ కమిషన్‌ భారత్‌కు వచ్చింది. భారత్‌లో రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటైన ఈ కమిషన్‌లో భారతీయులు లేరు. దీంతో ఈ కమిషన్‌ను వ్యతిరేకించాలని భారత నాయకులు నిర్ణయించారు. అప్పటికే ముంబయి యూత్‌లీగ్‌ను స్థాపించిన యూసుఫ్‌ అలీ తన స్నేహితులతో కలసి కూలీల్లా తయారై ముంబయి పోర్టుకు వెళ్లి సైమన్‌ కమిషన్‌కు నిరసన తెలిపారు. అక్కడే తొలిసారిగా 'సైమన్‌ గోబ్యాక్‌' అంటూ నినాదం రాసిన బ్యానర్లు ప్రదర్శించారు. అలా యూసుఫ్‌ తయారు చేసిన సైమన్‌ గోబ్యాక్‌ నినాదం గాంధీజీ సహా అందరి నోళ్లలో మారుమోగింది. 1934లో జయప్రకాశ్‌ నారాయణ్‌, అశోక్‌ మెహతా, నరేంద్ర దేవ్‌, అచ్యుత్‌ పట్వర్ధన్‌, మినూ మసానిలతో కలసి యూసుఫ్‌ కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని స్థాపించారు. 1942లో ముంబయి మేయర్‌గా ఘనవిజయం సాధించారు. యువ మేయర్‌గానే కాకుండా పనిలోనూ చరిత్ర సృష్టించారు యూసుఫ్‌. దస్త్రాలను వెంటవెంటనే క్లియర్‌ చేయటంతో పాటు బ్రిటిష్‌వారికి అప్పటిదాకా భద్రత కోసం ఏడాదికి రూ.24లక్షలు కట్టే సంప్రదాయానికి అడ్వేడకట్ట వేశారు.

మార్మోగిన 'క్విట్‌ ఇండియా'

1942 జులై 14న వార్దాలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పూర్ణ స్వరాజ్యం కోసం డిమాండ్‌ చేయాలని నిర్ణయించింది. సమావేశానంతరం తన సన్నిహితులతో సమావేశమైన గాంధీజీ దీనికి మంచి నినాదం సూచించాలన్నారు. గెటౌట్‌, విత్‌డ్రా అంటూ ఏవేవో వచ్చాయి. అవేవీ గాంధీజీకి నచ్చలేదు. యూసుఫ్‌- 'క్విట్‌ ఇండియా' అని సూచించటం... గాంధీజీ వెంటనే మెచ్చుకొని సరే అనేయటం జరిగిపోయింది. అలా క్విట్‌ ఇండియా పేరు మార్మోగిపోయింది. ఉద్యమం ఆరంభం కాగానే గాంధీతో పాటు నేతలందరినీ అరెస్టు చేసిన బ్రిటిష్‌ ప్రభుత్వం యూసుఫ్‌నూ జైల్లో పెట్టింది. ఈ సందర్భంగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రత్యేక వైద్యానికి తీసుకెళ్లటానికి జైలు అధికారులు సిద్ధంకాగా... తన వెంట జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ప్రత్యేక వైద్యం అందిస్తానంటేనే తానూ వస్తానన్నారు. దీనికి తెల్లవారు నో అన్నారు. తానూ వైద్యం నిరాకరించారు యూసుఫ్‌. ప్రాణానికి ఇబ్బంది కలగకున్నా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. స్వాతంత్య్రానంతరం 1950 జులై2న 47వ ఏట యూసుఫ్‌ తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: ఆ అంతిమయాత్ర లాహోర్‌ నుంచి కోల్‌కతా దాకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.