ETV Bharat / bharat

YSRCP Government Scams: మీరా స్కీమ్​ల్లో స్కామ్​ల గురించి మాట్లాడేది.. మీ లెక్క ఓ సారి చూస్తారా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 8:42 AM IST

Updated : Sep 22, 2023, 9:51 AM IST

YSRCP Government Scams: వైసీపీ నాయకుల్లా.. సహస్ర బాహువులతో సహజ వనరుల్ని చెరబడుతూ, రాష్ట్రాన్ని గుల్ల చేయడాన్ని కదా స్కాం అంటారు? మరి జగనేంటి.. గత ప్రభుత్వం నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడాన్ని స్కాం అంటున్నారు! వేలమందికి ఉద్యోగాలు కల్పించిన మంచి కార్యక్రమాన్ని కుంభకోణం అంటారేంటి? సీమెన్స్‌ వంటి బహుళజాతి కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చి.. ప్రభుత్వం 10 శాతం నిధులు వెచ్చిస్తూ, 90 శాతం ఆ కంపెనీతో పెట్టించడాన్ని దోపిడీ అంటారేంటి? నైపుణ్య కేంద్రాలలో వసతులు, వాటిలో శిక్షణ పొందినవారు కళ్లముందే కనిపిస్తున్నా.. దాన్ని కుంభకోణం అంటారేంటి? ఇవీ ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్ని వేధిస్తున్న ప్రశ్నలు.

ysrcp government scams
ysrcp government scams

YSRCP Government Scams: మీరా స్కీమ్​ల్లో స్కామ్​ల గురించి మాట్లాడేది.. మీ లెక్క ఓ సారి చూస్తారా..?

YSRCP Government Scams: అసలు దోపిడీ అంటే ఏంటో తెలుసా..? గత ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చిన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చేసి, దివాలా తీసిన కార్పొరేట్‌ సంస్థను తెర ముందు పెట్టి.. ఎడాపెడా దోచేయడమే.

  • కుంభకోణం అంటే ఏంటో తెలుసా?.. మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాసిరకం బ్రాండ్‌లతో మద్యపాన ప్రియుల ఆరోగ్యాన్ని.. ధరలు పెంచేసి వారి డబ్బును కొల్లగొడుతూ, అస్మదీయుల కంపెనీల నుంచే మద్యం కొంటూ వేల కోట్లు దిగమింగడమే.
  • కొల్లగొట్టడం అంటే ఏంటో తెలుసా?.. లాభసాటిగా ఉన్న గనులను నయానో, భయానో ప్రభుత్వ పెద్దల గుప్పిట్లోకి తెచ్చుకోవడం అదే విధంగా ఏజెన్సీలోని లేటరైట్, బాక్సైట్‌ సహా విలువైన ఖనిజాల్ని కొల్లగొట్టి కోట్లు దండుకోవడం. కొండలు, గుట్టలు, చెరువులు (Illegal Soil Mining in AP) అన్న తేడా లేకుండా, ఎక్కడ మట్టి కనపడినా వైసీపీ నాయకులు ఎగబడి కొల్లగొట్టేయడమే.
  • సంక్షేమం మాటున మింగేయడం అంటే ఏంటో తెలుసా?.. పేదలకు సెంటు పట్టాలు ఇవ్వడానికి భూసేకరణ, చదును చేసే పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేయడమే.
  • లూటీ అంటే ఏంటో తెలుసా?.. అవసరం లేకపోయినా వ్యవసాయ మోటార్లకు, గృహావసరాలకు స్మార్ట్‌ మీటర్ల పేరుతో వేల కోట్ల కాంట్రాక్ట్‌ను అడ్డదారిలో అస్మదీయులకు దోచిపెట్టడం..! వారి నుంచి ప్రభుత్వ పెద్దలు కోట్లు దండుకోవడం.
  • స్వాహా చేయడం అంటే ఏంటో తెలుసా?.. కాంట్రాక్టులన్నింటినీ ప్రభుత్వ పెద్దల కోటగిరీలోని వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టడం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించేందుకు 20 శాతం చొప్పున కమీషన్లు కొట్టేయడం.
  • సహజ వనరుల్ని చెరబట్టడం అంటే తెలుసా?.. విశాఖ సహా వివిధ ప్రాంతాల్లోని రూ.కోట్ల విలువైన భూముల్ని అడ్డగోలుగా కొట్టేయడం. మడ అడవుల్ని నాశనం చేయడం.
  • అక్రమం అంటే ఏంటో తెలుసా?.. రేషన్‌ బియ్యం దొంగ రవాణా చేయడం, రాష్ట్రంలోని పోర్టుల్ని, సెజ్‌ల్ని అస్మదీయులపరం చేయడం. టీడీఆర్‌ బాండ్‌ల పేరుతో చేతివాటం ప్రదర్శించడం. ఎసైన్డ్‌ భూముల్ని కొట్టేయడం.. ఇవీ కుంభకోణాలంటే.

Skill Development Program vs Smart Meters Project: స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఐతే.. స్మార్ట్ మీటర్లతో ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

వాటిని పరిచయం చేసింది ఎవరో..: అసలు షెల్‌ కంపెనీలకు ఆద్యుడు, ‘క్విడ్‌ ప్రోకో’ వంటి పదాల్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిందే జగన్‌ కదా!.. అనే చర్చ ప్రజల్లో విస్తృతంగా సాగుతోంది. తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవిని అడ్డుపెట్టుకుని జగన్‌ వేల కోట్లు దోచుకున్నట్లుగా వచ్చిన అభియోగాలు, సీబీఐ, ఈడీ ఆయనపై నమోదు చేసిన కేసులు, వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు సాగిస్తున్న దోపిడీపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.

వెనకేసుకున్నదెంత?: దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్‌.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేంటి? ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానాన్ని తీసుకొచ్చి, మొత్తం వ్యాపారాన్ని అస్మదీయులకు అప్పగించి కోట్లు కొల్లగొడుతోంది వాస్తవం కాదా? ప్రభుత్వ పెద్దలకు కమీషన్‌ ముట్టచెబుతున్న కంపెనీల నుంచే ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొంటోంది నిజం కాదా? కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలకు ఏటా కోట్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ లెక్కన వెనకేసుకున్నదెంత?

మరి ఇది స్కాం కాదా: ఏపీఎస్‌బీసీఎల్‌ వద్ద సుమారు 100 కంపెనీలు నమోదు చేసుకోగా... వాటిలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు, కమీషన్లు చెల్లిస్తున్న 16 కంపెనీలకే మద్యం కొనుగోళ్లు ఆర్డర్లు ఇవ్వడాన్ని కుంభకోణం అనరా? రాయలసీమలోని ఒక దివంగత నేతకు చెందిన మద్యం కంపెనీని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో నెంబర్‌ 2గా చక్రం తిప్పుతున్న నాయకుడి కుమారుడు స్వాధీనం చేసుకోవడం, ఆ కంపెనీకే ఏపీఎస్‌బీసీఎల్‌ రెండేళ్లలో 18 వందల63 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం కొనడానికి ఆర్డరివ్వడం స్కాం కాదా?

Illegal mining: ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు.. ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి

ఏ స్థాయిలో మింగేస్తున్నారు: మద్యం నిషేధిస్తామనే హామీని తుంగలో తొక్కి, నాసిరకం బ్రాండ్‌లు మాత్రమే దొరికేలా చేసి, ధరలు విపరీతంగా పెంచేయడం ప్రజల్ని దోచుకోవడం కాదా? ఇది కదా స్కాం అంటే! ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం వ్యాపారాన్ని కొందరు రాజకీయ నాయకులు, అధికారులు సిండికేట్‌గా ఏర్పడి తమ ఆధీనంలోకి తెచ్చుకుని, మూడేళ్లలో 2 వేల కోట్ల లబ్ధి పొందారని ఈడీ తేల్చింది. 800 దుకాణాలున్న ఛత్తీస్‌గఢ్‌లోనే అంత పెద్ద కుంభకోణం జరిగితే, 2,934 దుకాణాలున్న ఏపీలో, మద్యం వ్యాపారం మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీపా నాయకులు, వారి అస్మదీయులు ఏ స్థాయిలో మింగేస్తూ ఉండాలి?.

ఇది కుంభకోణం కాదా?: గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా దొరికిన ఇసుకనూ అధికార పార్టీ నాయకులు దిగమింగడం కుంభకోణం కాదా? వైసీపీ భాషలో దాన్ని ప్రజాసేవ అంటారా? క్షేత్రస్థాయి నాయకుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు.. ఈ దోపిడీలో భాగస్వాములే. జేపీ పవర్‌ వెంచర్స్‌ అనే దివాలా తీసిన, NCLTకి వెళ్లిన ఉత్తరాది కంపెనీని తెరపైకి తెచ్చి.. రాష్ట్రంలోని మొత్తం ఇసుక వ్యాపారాన్ని ఆ సంస్థకు కట్టబెడుతున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన, చెన్నైకు చెందిన వివాదాస్పద వ్యాపారికి సంబంధించిన టర్న్‌కీ అనే సంస్థని ఉపగుత్తేదారుగా రంగంలోకి దించారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌లు, డిజిటల్‌ చెల్లింపులు, కంప్యూటరైజ్డ్‌ బిల్లులు లేవు. ఎంత తవ్వుతున్నారో, ఎంత అమ్ముతున్నారో లెక్కల్లేవు. అప్పటి వరకు జరిగిన దోపిడీ ఒక లెక్క. గత ఏడాది ఆగస్టు నుంచి టర్న్‌కీని తప్పించి.. ఇసుక వ్యాపారాన్ని జిల్లాల వారీగా వైసీపీ నేతల ఆధ్వర్యంలోని సిండికేట్‌ల చేతుల్లో పెట్టినప్పటి నుంచి జరుగుతున్న దోపిడీ మరో లెక్క. జిల్లాలలోని సిండికేట్‌ల నుంచి ఏటా సుమారు 1,800 కోట్ల రూపాయలు వసూలు చేసి, ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయలు చెల్లించి, మిగతా రూ.1,035 కోట్లను ప్రభుత్వ పెద్దలకు కప్పం కడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిండికేట్‌లు తవ్వుకుని, అమ్ముకుని, కొల్లగొట్టేది దీనికి అదనం. పర్యావరణ అనుమతుల్లేకుండా, ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్నీ బేఖాతరు చేసి ఇష్టానుసారం దోచేయడాన్ని ఏమంటారు?.

మద్య నిషేధం ఊసే లేదు.. కొత్త మద్యం విధానంలో కొత్త షాపులు

స్మార్ట్​గా దోచుకున్నారుగా..?: రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసింది చాలదా? ఎవరడిగారు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని? రాష్ట్రంలోని 18 లక్షల 58 వేల వ్యవసాయ మోటార్లకు రూ.6,888.03 కోట్లతో స్మార్ట్‌ మీటర్లు కార్యక్రమం అతి పెద్ద కుంభకోణం కాదా? ఆ భారం మోయాల్సింది రాష్ట్ర ప్రజలు కాదా? ఒక్కో మీటర్, అనుబంధ పరికరాలు, నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 37 వేల72 రూపాయలు. ఉత్తర్‌ప్రదేశ్‌ గృహావసరాలకు స్మార్ట్‌ మీటర్లకు అదానీ సంస్థ 10 వేలు చొప్పున కోట్‌ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విశ్వేశ్వర్‌రెడ్డికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీకి ఒక్కో మీటర్‌కు 37 వేలు రూపాయల చొప్పున చెల్లించేలా మొత్తం కాంట్రాక్టు కట్టబెట్టడం దోపిడీ కాదా? గృహ అవసరాలకు తొలిదశలో 27.98 లక్షల మీటర్లను ఏర్పాటు చేసేందుకు రూ.3,130 కోట్ల కాంట్రాక్టును మరో సంస్థ అదానీకి కట్టబెట్టడాన్ని ఏమంటారు?

గనుల శాఖను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చేసి దోచుకుంటోంది ఎవరు? లాభసాటిగా ఉన్న గనులన్నింటినీ... అధికారికంగా, అనధికారికంగా ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి తీసుకున్నారు. సీనరేజీ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా అసలు ఉందా? ఇప్పటికే 7 జిల్లాల్లో సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలన్నీ మీ అస్మదీయులవి కాదా?

అసలైన దోపిడీ ఇది కదా?: గతంలో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన కంపెనీలు వాటిలో ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గనుల వ్యాపారంలో ఉన్నవారిని వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలు బెదిరించి గుప్పిట్లో పెట్టుకున్నారు. గనులపై దాడులు చేయించి, కోట్ల రూపాయల్లో జరిమానాలు విధించారు. ముఖ్యంగా తెదేపా నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా దాడులు జరిగాయి. కొందరు భయపడి అధికార పార్టీలో చేరిపోయారు. కొందరు కాళ్లబేరానికి వచ్చారు. అప్పుడు వాళ్ల దగ్గర అధిక మొత్తంలో దండుకుని తక్కువ జరిమానాలతో సరిపెట్టారు. దారికి రానివారిని ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనులు, తిరుపతి జిల్లాలో సిలికా శాండ్, ఉత్తరాంధ్రలో క్వారీలు.. ఇలా అది ఎడతెగని జాబితా. అసలైన దోపిడీ ఇది కదా?.

Visakha YCP Leaders Focus on Assigned Lands: విశాఖ అసైన్డ్ భూములపై వైసీపీ నేతల కన్ను.. బెదిరించి ఒప్పందాలు

మట్టి బకాసురులు: ఎక్కడ మట్టి కనపడినా బకాసురుల్లా మింగేస్తున్న వైసీపీ నాయకులు ఈ నాలుగేళ్లలో సుమారు 6 వేల కోట్లకుపై దోచేశారని అంచనా. ప్రభుత్వ పెద్దలు ఇసుక, గనులు, మద్యంలో ‘దోచుకో, పంచుకో, తినుకో’ స్కీంను గంపగుత్తగా అమలుచేస్తున్నారే.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువస్థాయి నేతలు మట్టి దోపిడీని రీటెయిల్‌గానే అమలు చేస్తున్నారు. కొల్లగొట్టిన మట్టిని రహదారుల నిర్మాణానికి, స్థిరాస్తి వెంచర్లలోని స్థలాల చదునుకు, ఇటుక బట్టీలకు విక్రయిస్తూ భారీగానే సొమ్ము గడిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అనుమతి ఉండాల్సిందే: నియోజకవర్గంలో ఎక్కడ తట్టెడు మట్టి తవ్వాలన్నా వైసీపీ ఎమ్మెల్యే అనుమతి ఉండాల్సిందే. ఎమ్మెల్యే లేనిచోట పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. వారు తమ అనుయాయులకు ప్రాంతాల వారీగా మట్టి తవ్వకాలను పంచేసి, వాటాలను తీసుకుంటున్నారు. చివరకు పోలవరం కుడి, ఎడమ కాల్వల గట్లను, విశాఖలోని వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల్నీ తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు.

వేల కోట్ల టెండర్లు వారికే: ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరుతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టడాన్ని ఏమంటారు జగన్‌? పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్, గోదావరి డ్రెడ్జింగ్‌ పనులు, గాలేరు-నగరిలో మెజార్టీ పనులు.. ఇవన్నీ దక్కించుకున్నది అస్మదీయ కంపెనీలు కాదా? వేల కోట్ల టెండర్లు వారికే దక్కడంలో మాయాజాలం లేదా?.

Assigned Lands Allotment: వైసీపీ గోల్​మాల్​​.. ఎసైన్డ్ భూముల కేటాయింపులో సొంత పార్టీ నేతలకు పంచేందుకు యత్నం

అదో భారీ కుంభకోణం: పేదలకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భారీ ఎత్తున చేసిన భూసేకరణలో వైసీపీ నాయకులు ప్రదర్శించిన చేతివాటం... రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి. సుమారు 23 వేల ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించగా... అక్కడున్న వాస్తవ ధరకంటే ఎక్కువ మొత్తానికి ప్రభుత్వంతో ఆ భూమిని కొనిపించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు కీలకంగా వ్యవహరించారు. రైతులతో ముందే అవగాహన కుదుర్చుకుని వాటాలు పంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లాలో అధికారుల ఒత్తిడికి తలొగ్గనందుకు కలెక్టర్‌నే బదిలీ చేయించారు. రాజమహేంద్రవరంలో ఆవ భూముల్ని, కాకినాడ, మచిలీపట్నం తీరాల్లో మడ అడవుల్ని కొట్టేసి.. భారీ కుంభకోణానికి తెగబడ్డారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ఊదరగొడుతున్న వైసీపీ నాయకులు.. దాని మాటేమోగానీ విశాఖలోని భూముల్ని మాత్రం ఎడాపెడా దోచేశారు. దసపల్లా భూములు, రామానాయుడు స్టూడియో భూములు, గతంలో ఎన్‌సీసీ తదితర ప్రాజెక్టుల కోసం కేటాయించిన భూములు, చివరకు చర్చిలకు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూముల్ని వారి పరం చేసుకున్నారు. వాటిని ఆక్రమించుకుని చేస్తున్న ప్రతి ప్రాజెక్టులోనూ ప్రభుత్వ పెద్దలకు వాటాలున్నాయన్న ఆరోపణలున్నాయి. దీన్ని కదా దోపిడీ అంటారన్న ప్రశ్న వినిపిస్తోంది.

SMART METERS : మీటర్లూ అయిన వాళ్లకే.. ప్రశ్నిస్తే దాడులు.. గిట్టని వాళ్లని పనులంటూ దోపిడీ

Last Updated : Sep 22, 2023, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.