ETV Bharat / bharat

ఐఫోన్​ కోసం కొరియర్ బాయ్​ హత్య.. గోనెసంచిలో చుట్టి 4 రోజులు బాత్​ రూమ్​లో.. తర్వాత..

author img

By

Published : Feb 20, 2023, 11:47 AM IST

youth killed courier boy for iPhone in karnataka
ఐఫోన్​ కోసం కొరియర్ బాయ్​ను చంపిన యువకుడు

ఐఫోన్ కోసం కొరియర్​ బాయ్​ను కత్తితో పొడిచి హత్య చేశాడో యువకుడు. తర్వాత మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు బాత్​రూమ్​లో దాచాడు. అనంతరం గోనెసంచిలో చుట్టి రైల్వే ట్రాక్​పై దహనం చేశాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటక హాసన్​లో జరిగింది.

కర్ణాటక హాసన్​లో ఓ యువకుడు ఐఫోన్​ కోసం కొరియర్​ బాయ్​ను కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి నాలుగు రోజులపాటు బాత్​ రూమ్​లో ఉంచాడు. అనంతరం డెడ్​బాడీని రైల్వే ట్రాక్​పై పడేసి, కాల్చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం..
అరసీకెరె తాలూకా శివార్లలోని కొప్పలు రైల్వే గేట్​ సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఓ పెట్రోలు బంకులోని సీసీటీవీలో కెమెరాల్లో ఓ వ్యక్తి బైక్​పై బ్యాగును తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది.

అరసీకెరె హలే కల్లనాయకన్ హళ్లి గ్రామానికి చెందిన నిందితుడు హేమంత్​ దత్తా(20) అనే యువకుడు ఆన్​లైన్​లో సెకండ్​ హ్యాండ్​ ఐఫోన్​ను ఆర్డర్​ చేసుకున్నాడు. ఫిబ్రవరి 7న ఆర్డర్​ను డెలివరీ చేసేందుకు హేమంత్ నాయక్​(23) అనే వ్యక్తి హేమంత్ దత్తా ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో నా దగ్గర అంత డబ్బు లేదని హేమంత్ దత్తా అన్నాడు. డబ్బులు ఇవ్వకముందే ఐఫోన్​ బాక్స్​ను తెరిచి చూపించాలని హేమంత్​ దత్తా డెలివరీ బాయ్​ హేమంత్ నాయక్​ను కోరాడు. డబ్బులు చెల్లించకుండా బాక్స్​ను తెరవనని డెలివరీ బాయ్​ ఖరాఖండిగా చెప్పాడు.

కోపోద్రిక్తుడైన నిందితుడు హేమంత్ దత్తా.. నా స్నేహితుడు డబ్బులు తెస్తున్నాడు కాసేపు ఆగమన్నాడు. డెలివరీ బాయ్​ను ఇంట్లోకి పిలిచి కూర్చోమని చెప్పాడు. ఇంట్లో కూర్చున్న డెలివరీ బాయ్​ను​ వెనుక నుంచి వచ్చి నిందితుడు హేమంత్ దత్తా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తర్వాత డెలివరీ బాయ్​ మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి నాలుగు రోజుల పాటు బాత్​రూమ్​లో​నే ఉంచాడు. అనంతరం మృతదేహాన్ని నిందితుడు ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి బైక్​పై తీసుకెళ్లి అంచేకొప్పలు సమీపంలోని రైల్వే ట్రాక్​పై దహనం చేశాడు.

నిందితుడు హేమంత్​​ అరసీకెరె నగరం సమీపంలోని ఓ పెట్రోల్​ బంక్​లో పెట్రోల్​ పోయించుకుని వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి హేమంత్ నాయక్​ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఫుటేజీతో పాటు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.