ETV Bharat / bharat

యువకుడి హత్య.. 12 ముక్కలుగా నరికి, పాలిథీన్​ కవర్లలో కుక్కి..

author img

By

Published : May 18, 2023, 2:12 PM IST

Updated : May 18, 2023, 3:07 PM IST

young-man-murdered-in-odisha-dead-body-chopped-into-12-pieces
ఒడిశాలో యువకుడు హత్య

ఒడిశాలో ఓ యువకుడిని హత్య చేసి.. 12 ముక్కలుగా నరికారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ తరువాత శరీర భాగాలను పాలిథీన్ కవర్లలో కుక్కారు. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయారు. బోలింగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు పెళ్లికి నిరాకరించిందని బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ దారుణం జరిగింది.

ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అతడి మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికారు. మృతుడి శరీర భాగాలను అతడు నివాసం ఉంటున్న ఇంట్లోనే.. పాలిథీన్​ కవర్లలో కుక్కి పారిపోయారు. ఒడిశాలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని రింకు మెహర్​గా​ పోలీసులు గుర్తించారు. బుధవారం దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోలింగర్ జిల్లాలోని సలేపలి ప్రాంతంలో రింకు హత్యకు గురయ్యాడు. రింకు తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి.. సలేపలిలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. 20 రోజుల క్రితం రింక్​ తన తల్లిదండ్రులను దారుణంగా కొట్టాడు. దీంతో వారు విషమ పరిస్థితుల్లో స్థానిక ఆసుపత్రిలో చేరారు. రింకు​ తమ్ముడు కూడా తల్లిదండ్రులకు సహాయంగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. దీంతో రింకు ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. బుధవారం రింకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. అనంతరం తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.

పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. రింకు శరీర భాగాలు 7 సంచుల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే యువకుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నిందితులు నరికి ఉంటారని వారు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వారు తెలిపారు.

బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వ్యక్తి
తనతో పెళ్లికి నిరాకరించిందని బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర్​ప్రదేశ్​లోని కాస్‌గంజ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పేరు నీరజ్​. పాటియాలీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా ఆటో డ్రైవర్​. బాధిత బాలిక ఇంటిపక్కనే నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని.. బాలికపై నీరజ్​ తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో బాలికకు ఆమె తండ్రి మరొక వ్యక్తితో వివాహం నిశ్చయించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన నీరజ్​.. బాలికపై హత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే బాధితురాలిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అనంతరం పరిస్థితి విషమించడం వల్ల.. ఆమెను అలీగఢ్​ మెడికల్​ కాలేజ్​కి తీసుకెళ్లారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని వారు వెల్లడించారు. వీలైనంత త్వరగా అతడ్ని పట్టుకుంటామని పేర్కొన్నారు.

Last Updated :May 18, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.