ETV Bharat / bharat

యూపీలో 'పతంగి' ఎగిరేనా? కాల్పుల ప్రభావం ఉంటుందా?

author img

By

Published : Feb 7, 2022, 7:24 PM IST

Updated : Feb 7, 2022, 7:38 PM IST

Will MIM party win in Uttar Pradesh assembly elections?
యూపీలో 'పతంగి' ఎగిరేనా?

AIMIM Factor in UP: సమకాలీన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న నేత.. మజ్లిస్ పార్టీ సారథి అసదుద్దీన్ ఒవైసీ. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. భాజపాకు సవాల్​ విసరాలని ఊవిళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు నిరాకరించడం వల్ల ఆయన ఏ పార్టీలతో కలిసి బరిలోకి దిగుతున్నారు? ఒవైసీ ప్రచారాస్త్రాలు ఏంటి? ఎంఐఎం అధినేత కారుపై జరిగిన కాల్పుల ప్రభావం ఎన్నికలపై ఉంటుందా?

AIMIM Factor in UP: అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష ఎస్పీతో పాటు ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పక్షం ఏఐఎంఐఎం. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ.. యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

''ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల సవాల్​ను మేము స్వీకరిస్తున్నాం. శక్తిమేరకు పోరాడుతాం''.. జనవరి 8న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ను ఈసీ ప్రకటించిన వెంటనే.. ఒవైసీ ఇలా ట్వీట్​ చేశారు.

ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నా ఒవైసీ మాత్రం.. ఉత్తర్​ప్రదేశ్​పై దృష్టంతా పెట్టారు. రాష్ట్రంలో బలమైన ముస్లిం ఓటు బ్యాంకు ఉంటడం.. దేశంలోనే జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం కావడం.. ప్రధానంగా చిరకాల ప్రత్యర్థి భాజపాను ఇక్కడ గద్దె దింపి.. తద్వారా 2024 ఎన్నికల్లో కాషాయపార్టీని బలహీనపరచాలన్న లక్ష్యమే దీని వెనుక ఉన్న కారణం.

అందుకే ఎన్నికలు షెడ్యూల్​ ప్రకటించిన నాటి నుంచి పొత్తులు, ఎత్తుల వ్యూహాల్లో నిమగ్నమయ్యారు అసద్​. మరోవైపు పార్లమెంట్​ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాళ్లకు చక్రాలు కట్టుకొని యూపీ- దిల్లీ మధ్య తిరుగుతున్నారు.

పొత్తులు ఎత్తులు..

uttar-pradesh-assembly-elections
కూటమి నేతలతో ఒవైసీ

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకొని ముందుకెళ్తున్నారు ఒవైసీ. భారత్ ముక్తి మోర్చా అధినేత బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వంతో ఐదు పార్టీలతో కలిసి 'భాగీదారీ పరివర్తన్​ మోర్చా' కూటమిగా యూపీ బరిలోకి దిగుతున్నారు. 100 స్థానాల్లో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించిన ఎంఐఎం అధినేత.. ప్రస్తుతానికి 66స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే అందులో ఎక్కువ శాతం ముస్లింలే ఉన్నారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రావడం వల్ల.. అదే ఉత్సాహంతో యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని అనుకున్నారు ఒవైసీ. ఈ క్రమంలో ఎస్పీతో కానీ.. బీఎస్పీతో కానీ పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకున్నప్పటికీ.. ఆ చర్చలు ముందుకు సాగలేదు. దీంతో చిన్న పార్టీలతో కలిసి జట్టు కట్టారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు..

అయితే ప్రచారంలో వినూత్నంగా ముందుకెళ్తున్నారు ఒవైసీ. యూపీ ఎన్నికల్లో కొత్తగా ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రతిపాదనను ఆయన ముందటేసుకున్నారు. తమ కూటమి గెలిస్తే.. ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు.. మరొకరు దళిత వర్గానికి చెందిన వారు సీఎం అవుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంలను కూడా అదే స్థాయిలో వెనుకబడిన సామాజిక వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించారు.

ఎవరికి మైనస్​ అవుతుంది?

యూపీ ఎన్నికల్లో ఒవైసీ ముస్లింల రాజకీయ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతున్నారు. 20శాతం జనాభా ఉన్న ముస్లింల ప్రాధాన్యంపై ప్రచారం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇన్నాళ్లు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని.. బానిసలుగా చూశాయంటూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా '80-20' అనే ఫార్ములాతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్​తో ముస్లింలు ఏ కొద్ది శాతం మంది అయినా.. ఓవైసీ వైపు మొగ్గినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెనుమార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 18జిల్లాల్లోని 140కుపైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే సామర్థ్యం ముస్లింలకు ఉంది.

ఒకవేళ అదే జరిగితే.. ఇందులో ఎక్కువగా నష్టపోయేది సమాజ్​వాదీ పార్టీయే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాల్పులకు రాజకీయ ప్రాధాన్యం..

uttar-pradesh-assembly-elections
బుల్లెట్లు తగిలిన ఒవైసీ కారు

ఈ నెల 3న ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీ వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఒవైసీ కారుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది రాజకీయంగా చర్చకు దారి తీసింది. పార్లమెంట్​లో కూడా చర్చకు వచ్చింది. దీంతో ఈ కాల్పుల అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

గాంధీని చంపిన వాళ్లే తనపై దాడి చేశారంటూ ఒవైసీ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. . ఈ క్రమంలో ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుంటే.. ఎంఐఎంకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆయన దాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నట్లు మరికొందరు వాదిస్తున్నారు.

హిందువులకు సీట్లు..

ఎంఐఎం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా ముద్రపడింది. అయితే ఒవైసీ గతంలో కంటే భిన్నంగా ఈసారి ముందుకెళ్తున్నారు. పోటీ చేస్తామన్న 100సీట్లలో ఇప్పటికే 66స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే అందులో ఎనిమిది మంది హిందువులు కూడా ఉన్నారు. దళితులకూ సీట్లు కేటాయించారు.

ప్రముఖ నేత పండిత్ మన్మోహన్ ఝా సాహిబాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బుద్ధిస్టు అయిన వికాస్ శ్రీవాస్తవను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు ఒవైసీ.

2017 ఎన్నికల్లో..

2017లో జరిగిన యూపీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 38 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు భారత్ ముక్తి మోర్చా, ఎస్​బీఎస్​పీ, ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీతో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు ఒవైసీ. వ్యూహాత్మకంగా 100 సీట్లపై గురిపెట్టారు.

ఈ ప్రచారాస్త్రాలతో..

యూపీలో ముస్లింలపై జరగుతున్న దాడులను ప్రముఖంగా ముందుకు తీసుకెళ్తోంది ఎంఐఎం. ముజఫర్‌నగర్‌లో ముస్లింపై జరిగిన దాడిపై విచారణ జరిపి న్యాయం చేయడంలో అప్పుడు ఎస్పీ సర్కారు, ఇప్పుడు భాజపా సర్కారు విఫలమయ్యాయనే విమర్శను బలంగా వినిపిస్తోంది.

అలాగే ఉన్నావ్​ ఘటన, రైతుల ఉద్యమం, లఖింపుర్​ ఘటనలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు ఒవైసీ. ముఖ్యంగా ముస్లింలకు రాజ్యాధికారం అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు.

సీఏఏ ఘర్షణలపై బలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు హైదరాబాద్​ ఎంపీ. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఒవైసీపై కాల్పుల ఘటన నేపథ్యంలో జడ్​ కేటగిరీ భద్రత కల్పిస్తామని.. దీనికి ఒవైసీ ఒప్పుకోవాలని పార్లమెంటు వేదికగా అమిత్ షా కోరారు. అయినా ఒవైసీ ఒప్పుకోలేదు. సీఏఏ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 22మంది కంటే తన జీవితం విలువైందేం కాదని తనదైన శైలిలో స్పందించారు.

Last Updated :Feb 7, 2022, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.