ETV Bharat / bharat

లవర్​తో కలిసి భర్తను హత్య చేసిన మహిళ.. ప్రేమించిందని యువతిని చంపిన సోదరులు

author img

By

Published : Dec 9, 2022, 10:43 AM IST

Updated : Dec 9, 2022, 11:36 AM IST

wife killed husband with lover in east delhi
wife killed husband with lover in east delhi

ఓ మహిళ తన లవర్​తో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం సహజ మరణంగా చిత్రీకరించింది. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కైంది. నిందితులిద్దరూ అరెస్టయ్యారు. తూర్పు దిల్లీలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను తన కుమారుడితో కలిసి హత్య చేశాడు ఓ వ్యక్తి. కర్ణాటకలో ఈ దారుణం జరిగింది.

వారిద్దరూ రోజువారి కూలీలు... అలా పనిలో పరిచయం చిగురించి.. వివాహేతర సంబంధంగా మారింది. కానీ ఆ మహిళకు ఇదివరకే పెళ్లై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రియుడితో కలిసుండాలంటే భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది ఆ మహిళ. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం మృతుడిది సహజ మరణం అని అందరిని ఇరువురూ నమ్మించారు. ఈ కేసును పోలీసులు కూడా ఛేదించలేక పోయారు. కానీ, చివరికి పట్టుబడ్డారు. ఇంతకీ పోలీసులకు ఎలా చిక్కారంటే..

ఇదీ జరిగింది..
తూర్పు దిల్లీలోని మండవాలి ప్రాంతంలో సురేశ్(40)​.. భార్య హేమ, కుమారుడు నిశాంత్​తో ఉంటున్నాడు. హేమ ఇదివరకు రోజు కూలీగా పని చేస్తుండేది. అలా పనిచేసే సమయంలో సచిన్​ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఉండాలంటే ఎలాగైనా హేమ భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్​ వేశారు. అనుకున్న ప్రకారమే.. ఓరోజు సురేశ్​కు బలవంతంగా మద్యం తాగించారు. అతడు అపస్మారక స్థితిలోకి జారుకున్నాక.. చున్నీ, కర్టేన్ల సహాయంతో అతడిని కట్టేసి కొట్టారు. అతడు చనిపోయాడని నిర్ధరణ చేసుకునే వరకు.. తలపై, కడుపులో మళ్లీ మళ్లీ కొట్టారు. చనిపోయిన తర్వాత సృహ కోల్పోయాడని సురేశ్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు సురేశ్​ చనిపోయాడని ధ్రువీకరించారు. ఇలా నిందితులిద్దరూ బాధితుడిది సహజ మరణంగా చిత్రీకరించారు.

పోస్టు మార్టంతో నిజం వెలుగులోకి..
డిసెంబర్​ 7న సురేశ్​ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అతడి భార్య హేమ, సోదరుడు దీపక్​కు అప్పగించారు. అయితే పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మృతదేహం తల, మెడ, ఛాతిపై దెబ్బలు ఉన్నాయని.. చనిపోవడానికి కారణం కొట్టడమే అని వైద్యులు తెలిపారు. పోలీసులు వెంటనే హత్య కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్యను, బంధువులను విచారించారు. వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. కానీ, వారికి ఎలాంటి క్లూ లభించలేదు.

పొంతన కుదరక పట్టుబడ్డారు..
విచారణ ఇంకా కొనసాగించగా.. మృతుడి భార్య వాంగ్మూలానికి పొంతన కుదరడం లేదని పోలీసులు గ్రహించారు. మృతుడి కుమారుడితో పాటు మరో స్థానికుడు కూడా హేమపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సచిన్​, హేమను విచారించారు. అనంతరం వారు నేరాన్ని అంగీకరించారు. తామిద్దరం రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు.. కలిసి జీవించాలనుకున్నట్లు.. ఒప్పుకున్నారు. అందుకే సురేశ్​ను చంపడానికి పథకం రచించినట్లు చెప్పారు.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మహిళ హత్య..
కర్ణాటకలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. తండ్రి, కుమారుడు కలిసి ఓ మహిళను హతమార్చారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీతా భట్​(64) కుమటా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కుంజళ్లి అనే ప్రాంతలో నివసిస్తోంది.

ఆమె భర్త విశ్వేశ్వర్​ భట్​, కుమారుడు మధుకర్​ భట్​ ఎప్పుడూ మద్యం సేవించి.. ఇంట్లో గొడవ చేసేవారు. అలాగే మంగళవారం కూడా పూటుగా తాగి వచ్చారు. అనంతరం మళ్లీ తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గీత భట్​తో గొడవకు దిగారు. డబ్బులు ఇవ్వడానికి గీతా భట్​ నిరాకరించడడం వల్ల కోపోద్రిక్తులైన తండ్రి, కుమారుడు.. ఆమెను కర్రతో బాది హతమార్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

యువతిని చంపిన సోదరులు..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ప్రేమించిందనే కారణంగా ఓ యువతి(22)ని ఆమె సోదరులు హతమార్చారు. ఈ ఘటన గోరఖ్​పుర్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషీనగర్​ జిల్లాలోని సింగపట్టి ప్రాంతంలో ఓ యువతి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన మొబిన్​ అన్సారీ అనే వ్యక్తిని ఆమె ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.

వారిద్దరిదీ కులం, మతం ఒక్కటే అయినప్పటికీ.. వారి వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో తరచూ ఆ యువతి సోదరులు ఆమెను వేధిస్తుండేవారు. మంగళవారం.. నిందితులు ఆమెను కర్రతో చనిపోయేదాకా కొట్టారు. అనంతరం మృతదేహాన్ని శాలువాలో చుట్టి.. బైక్​పై పంటపొల్లోకి తీసుకెళ్లి పడేశారు. అదేరోజు ఆ యువతి మృతదేహం లభ్యమైందని ఆ జిల్లా ఎస్పీ తెలిపారు.

డెయిరీ షెడ్​లో అగ్ని ప్రమాదం..
ప్రమాదవశాత్తు డెయిరీ షెడ్​లో మంటలు వ్యాపించడం వల్ల యజమాని సహా 9 దూడలు చనిపోయాయి. ఈ ఘటన బుధవారం ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబద్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్​బిర్​ సింగ్​ అనే వ్యక్తికి డెయిరీ ఉంది. సుఖ్​బిర్ నిద్రలో ఉండగా.. డెయిరీ షెడ్​కు మంటలు అంటుకున్నాయి.

మంటలను గమనించిన డెయిరీలో పనిచేసే సంజయ్​ అనే వ్యక్తి కొన్ని పశువులను విడిచాడు. కానీ సుఖ్​బిర్​తో పాటు 9 దూడలు మంటల్లో చిక్కుకుని మరణించాయి. కాగా, ఈ ఘటనపై సబ్​ డివిజనల్​ మెజిస్ట్రేట్​ విచారణకు ఆదేశించారు. ఎన్​డీఆర్​ఎఫ్​ నిధుల నుంచి బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రమాదానికి షాట్​ సర్క్యూట్​ కారణమని స్థానికులు వెల్లడించారు.

Last Updated :Dec 9, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.