'ఉచిత హామీలు తీవ్రమైన అంశం.. వాటిపై ఓ వైఖరి తీసుకోరెందుకు?'

author img

By

Published : Jul 27, 2022, 4:42 AM IST

freebies

CJI Freebies: ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే అసంబద్ధమైన ఉచిత హామీలు తీవ్రమైనవని.. ఈ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోంది? దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

NV Ramana Freebies: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అసంబద్ధమైన హామీలు ఇవ్వడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఒక వైఖరి తీసుకునేందుకు కేంద్రం ఎందుకు సంకోచిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలను నియంత్రించలేమని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఆర్థిక సంఘం అభిప్రాయాన్ని తీసుకోవచ్చా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

'..ఈ విషయంలో మీరు చేసేదేమీ లేదనీ, ఈసీ ఒక నిర్ణయం తీసుకోవాలని ఎందుకు చెప్పరు? అసలు కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రమైన విషయంగా పరిగణిస్తోందా, లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరొక నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఈ ఉచితాలు కొనసాగాలా, వద్దా అనేది మేం నిర్ణయిస్తాం. దీనిపై సవివరంగా ప్రమాణపత్రం దాఖలు చేయండి' అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.

కేంద్రం ఆదేశిస్తే రాజకీయమవుతుంది: సిబల్‌
ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండడానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి హామీలు ఇచ్చే పార్టీల చిహ్నాలను స్తంభింపజేసి, నమోదును రద్దు చేసేందుకు ఉన్న అధికారాలను ఈసీ వాడేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. మరో కేసు విషయంలో కోర్టుకు వచ్చిన సీనియర్‌ న్యాయవాది, ఎంపీ కపిల్‌ సిబల్‌ అభిప్రాయాన్ని ధర్మాసనం తెలుసుకోగోరింది. ఉచితాలు నిజంగా తీవ్రమైన అంశమనీ, పరిష్కారాలు చాలా కష్టమని సిబల్‌ అభిప్రాయపడ్డారు.

"రాష్ట్రాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ఆర్థిక సంఘం. ఆయా రాష్ట్రాల రుణాలను, ఉచిత తాయిలాల భారాన్ని పరిగణనలో తీసుకుని ఆ సంఘమే ఈ అంశాన్ని తేల్చడం సబబు. ఆ మేరకు ఆ సంఘం అభిప్రాయాన్నీ ఆహ్వానించవచ్చు. అంతేగానీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని ఆశించలేం. అది సాధ్యమూ కాదు, పైగా రాజకీయ అంశాన్ని రేకెత్తిస్తుంది" అని ఆయన చెప్పారు. ఆర్థిక సంఘంతో మాట్లాడాలని కేంద్రానికి సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే వారం చేపడతామని ధర్మాసనం తెలిపింది. దీనిలో జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమాకొహ్లి కూడా ఉన్నారు. ఎడాపెడా ఉచిత హామీలిస్తూ పోతే మనం కూడా శ్రీలంకలా తయారవుతామని పిటిషనర్‌ ఉపాధ్యాయ తన పిల్‌లో ఆందోళన వ్యక్తంచేశారు. అధికారంలో కొనసాగడానికి ప్రజాధనంతో తాయితాలు ప్రకటించడం ఓటర్లకు లంచం ఇవ్వడం లాంటిదేనని, అది అనైతికమని పేర్కొన్నారు.

కాలాలకు అతీతం భగవద్గీత.. భగవద్గీత పఠనం అంటే అన్ని గ్రంథాలనూ చదవడంతో సమానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. దీన్నుంచి ఏ తరం వారైనా సమాధానాలు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. భగవద్గీతను మహాత్మాగాంధీ అమ్మగా భావించారంటే దానికున్న శక్తిని గుర్తించవచ్చని అన్నారు. ‘రాజస్థాన్‌ పత్రిక’ ప్రధాన సంపాదకులు గులాబ్‌చంద్‌ కొఠారీ రాసిన ‘ది గీత విజ్ఞాన ఉపనిషత్‌’ పుస్తకాన్ని సీజేఐ మంగళవారం సాయంత్రం దిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ స్వతంత్ర జర్నలిజం ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, పాత్రికేయులే ప్రజల కళ్లు, చెవులని అభివర్ణించారు. వాస్తవాలను బయటపెట్టడం మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు.

భారతీయ సామాజిక పరిస్థితుల్లో పత్రికల్లో ప్రచురితమైనదంతా నిజమేనని నమ్ముతారు కాబట్టి మీడియా నిజాయతీగా పాత్రికేయ వృత్తికే కట్టుబడి ఉండాలని అన్నారు. ‘‘భారత్‌ పురాణాలకు నిలయం. ఈ ఆధునిక యుగంలోనూ మన దేశం ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. భారత్‌ ఎంత గొప్పదో చెప్పడానికి భగవద్గీత ఒక్కటి చాలు. ‘అనుమానాలు వెంటాడినప్పుడు, నిరుత్సాహం అలుముకున్నప్పుడు, విశ్వాసంలో ఒక్క వెలుగురేఖ కూడా కనిపించనప్పుడు నేను భగవద్గీతలో నాకు సౌకర్యవంతమైన శ్లోకాన్ని చదివేవాడ్ని. మనసులో వెంటనే ఆనందం వికసించేది..’ అని మహాత్మాగాంధీయే చెప్పారు. గీత వెనుక ఉన్న సిద్ధాంతం కాలాలకు అతీతం. ధర్మ, కర్మమే గీతా సారాంశం. గీతా బోధన మతాలు, సమయం, వయసుకు అతీతం. నిజమైన మతానికి పునాది కరుణ, ధర్మమే. ఆధునిక ప్రపంచంలో మొత్తం సమాచారం మన ముందు ఉంటోంది. అయితే దాన్ని నైతిక విలువలతో ఉపయోగించుకోవాలి. ఆ విలువలే మనల్ని పరిస్థితులతో సంబంధం లేకుండా సరైన దారిలో నడిచేలా నిర్దేశం చేస్తాయి. అలాంటి విలువలను గీత నేర్పుతుంది. దాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు తప్పకుండా వర్తమాన అర్థాలను గ్రహిస్తారు. అందుకే ఎన్నో ఉద్యమాలకు, నాయకులకు భగవద్గీత స్ఫూర్తి. గీతలో చెప్పిన సేవా సిద్ధాంతం ద్వారానే మహాత్మాగాంధీ స్ఫూర్తి పొందారు. ఇది మానవజాతికి అందుబాటులో ఉన్న శాశ్వతజ్ఞానం.

.

మాతృభాషతోనే ఎదుగుదల
రాజస్థాన్‌ పత్రిక ప్రాంతీయ భాషలకే పరిమితం కావడాన్ని అభినందిస్తున్నా. భారతీయ భాషలను ప్రోత్సహించడం నా మనసుకు నచ్చిన అంశం. వాటికి తగిన గౌరవం ఇవ్వాలి. అలాగే యువతను మాతృభాషల్లోనే ఆలోచించి నేర్చుకొనేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారు అత్యున్నత స్థానానికి చేరడానికి వీలవుతుంది’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. భగవద్గీత మనకు స్ఫూర్తినిచ్చి సరైన మార్గంలో నడిపిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. మన పనితో ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదన్నదే ప్రతి ధర్మం సిద్ధాంతమని, రాజ్యాంగ నిర్మాతలు ధర్మం ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గులాబ్‌చంద్‌ కొఠారీ, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మీనాక్షి లేఖి, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోలీసుల దౌర్జన్యం.. జుట్టు పట్టుకొని లాగి..

సైన్యానికి కొత్త శక్తి... రూ.28,732 కోట్ల ఆయుధాల కొనుగోలుకు గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.