ETV Bharat / bharat

కొత్త ఐటీ నిబంధనలపై హైకోర్టుకు వాట్సాప్​

author img

By

Published : May 26, 2021, 10:58 AM IST

Updated : May 26, 2021, 6:47 PM IST

కేంద్రం బుధవారం నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలపై ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోర్టును కోరింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది.

whatsapp
హైకోర్టు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్​ను సవాలు చేస్తూ దిల్లీ హై కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది మెసేజింగ్​ యాప్​ వాట్సాప్. కొత్త డిజిటల్​ రూల్స్​లో ఎన్​క్రిప్టెడ్ సందేశాలను చదివేందుకు ప్రభుత్వం అనుమతి కోరుతున్నట్లు వివరించింది. అలా చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతను ఉల్లఘించినట్లేనని వాట్సాప్​ దాఖలు చేసిన పిటిషన్​లో పేర్కొంది.

నిబంధనలు నిలిపివేయాలి..

కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్‌ మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం.. ఇది వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లేనని వాట్సాప్‌ ఆరోపించింది. వాట్సాప్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్‌క్రిప్షన్‌ను పక్కన పెట్టాల్సి వస్తోందని వాదనలు వినిపించింది. అందువల్ల ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని పిటిషన్​లో పేర్కొంది. వాట్సాప్ అభ్యంతరం తెలిపినప్పటికీ.. కొత్త ఐటీ రూల్స్ అమలు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఫేస్​బుక్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. కొన్ని నిబంధనల విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా వివరించింది.

వాట్సాప్ ద్వంద్వ ప్రమాణాలు!

భారత ప్రభుత్వం, దేశ చట్టాలు వాట్సాప్​ వంటి కంపెనీలను కాకుండా.. పౌరుల గోప్యతను కాపాడుతూనే.. హద్దులు విధించాలని టెక్​ విశ్లేషకులు, ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​ఓ టి.వి. మోహన్​దాస్​ పాయ్​ పేర్కొన్నారు. వాట్సాప్ వంటి ప్లాట్​ఫామ్స్​ ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉన్నాయని ఆయన విమర్శించారు.

హై కోర్టులో వాట్సాప్​ ​ పిటిషన్​ దాఖలు చేయడంపై పాయ్ స్పందించారు​. గోప్యత దెబ్బతింటుందా లేదా అనేది కోర్టు స్పష్టం చేస్తుందని.. వాట్సాప్​ కాదని పేర్కొన్నారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్తుందని జోస్యం చెప్పారు.

దేశంలో కోట్లాది మంది ప్రజలు ఈ యాప్​లను వినియోగిస్తున్నారని.. వారందరి డేటాను అమెరికా చట్టాలు, సెక్యూరిటీ ఏజెన్సీలు యాక్సెస్ చేసేందుకు వీలుందని ఆరోపించారు పాయ్​. అలాంటప్పుడు యూజర్ల డేటాకు భద్రత లేనట్లేనని పేర్కొన్నారు.

కొత్త ఐటీ రూల్స్​ ఏమిటి?

సామాజిక మాధ్యమాలు సహా ఇతర డిజిటల్ ప్లాట్​ఫామ్స్ కొత్తగా​ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్​, నోడల్​, రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్​ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతరకర పోస్టులపైన వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి.

ఈ మార్గదర్శకాలను ఫిబ్రవరిలోనే విడుదల చేసింది కేంద్రం. 50లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సామాజిక మాధ్యమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిబంధనలను అమలు చేసేందుకు మే 25ను తుది గడువుగా ఉంచింది.

మరిన్ని వివరాలు..

పోస్టులపై ప్రభుత్వం లేదా కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత పోస్టులను 36 గంటల్లోగా తొలగించాలి. పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదు అందితే సంస్థలు వాటిని 24 గంటల్లోగా తొలగించాలి. తప్పుడు సమాచారాన్ని మొదట ప్రారంభించిన వారి వివరాలను కోర్టు లేదా ప్రభుత్వాలు కోరితే.. వాటిని అందించాలి.

ఇదీ చదవండి : టీకా తీసుకొని.. బ్లూషీల్డ్ పొందండి

Last Updated :May 26, 2021, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.