ETV Bharat / bharat

టికెట్ల వేటలో నేతల వలసలు- వేడెక్కిన పంజాబ్‌ రాజకీయాలు!

author img

By

Published : Feb 8, 2022, 7:54 AM IST

Punjab Election 2022
Punjab Election 2022

Punjab Election 2022: పంజాబ్​లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల తీరు మారుతోంది! టికెట్ల వేటలో ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. తామున్న పార్టీ ఈ దఫా ఎన్నికల్లో బలహీనంగా కనిపిస్తోందన్న ఆందోళన, టికెట్‌ దక్కకపోవడం, కోరుకున్న స్థానం నుంచి బరిలో దిగే అవకాశం చిక్కకపోవడం.. ఇలా ఒక్కొక్కరి ఫిరాయింపునకు ఒక్కో కారణముంది. వీరిలో కొందరు పార్టీ మారి టికెట్​ దక్కిించుకుంటే.. మరికొందరి పరిస్థితి అటూ.. ఇటూ కాకుండా పోతుంది.

Punjab Election 2022: అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌ రాజకీయాల్లో నేతల వలసలు వెల్లువెత్తాయి. అనేకమంది ప్రముఖ నాయకులు సొంత పార్టీలకు గుడ్‌బై చెప్పి ఇతర పక్షాల్లో చేరిపోయారు. తామున్న పార్టీ ఈ దఫా ఎన్నికల్లో బలహీనంగా కనిపిస్తోందన్న ఆందోళన, టికెట్‌ దక్కకపోవడం, కోరుకున్న స్థానం నుంచి బరిలో దిగే అవకాశం చిక్కకపోవడం.. ఇలా ఒక్కొక్కరి ఫిరాయింపునకు ఒక్కో కారణముంది. వీరిలో కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లి టికెట్‌ దక్కించుకున్నారు. మరికొంతమంది పరిస్థితి మాత్రం.. రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది! కొత్తగా చేరిన పార్టీలోనూ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికలు సమీపించినప్పటి నుంచి రాష్ట్రంలో కీలక నేతల ఫిరాయింపు వివరాలను పరిశీలిస్తే..

కాంగ్రెస్‌: అమరీందర్‌ సహా పలువురు సీనియర్లు..

మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ హస్తం పార్టీని వీడి.. పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) పేరుతో సొంత పార్టీని స్థాపించడం అత్యంత కీలక పరిణామం. మరికొందరు సీనియర్‌ నేతలు కమలదళం సహా ఇతర పార్టీల గూటికి చేరారు. వారిలో రాణా గుర్మీత్‌సింగ్‌ సోఢీ, ఫతేజంగ్‌సింగ్‌ బజ్వా ముఖ్యులు. వీరిద్దరూ కాషాయ కండువా కప్పుకొన్నారు. మరో బడా నాయకుడు బల్వీందర్‌సింగ్‌ లాడీ కూడా కమలం గూటికి వెళ్లినా, తిరిగి వెనక్కి వచ్చేశారు. అయితే కాంగ్రెస్‌లోనూ ఆయనకు టికెట్‌ దక్కలేదు. మరో ప్రముఖ నేత సుఖ్‌జిందర్‌రాజ్‌సింగ్‌ అలియాస్‌ లాలీ మజీఠియా, మాజీ మంత్రి జగ్‌మోహన్‌సింగ్‌ కాంగ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో గుర్మీత్‌సింగ్‌ సోఢీకి ఫిరోజ్‌పుర్‌ నగర, ఫతేజంగ్‌ బజ్వాకు బటాలా టికెట్‌ దక్కాయి. సుఖ్‌జిందర్‌రాజ్‌సింగ్‌ను ఆప్‌ మజీఠా స్థానం నుంచి బరిలో దింపింది. జగ్‌మోహన్‌సింగ్‌కు మొండిచేయి చూపింది. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన గాయకుడు బల్కర్‌ సిద్ధూకు రాంపుర ఫూల్‌, గుర్మీత్‌సింగ్‌ ఖుదైన్‌కు లంబీ టికెట్లను ఆప్‌ కేటాయించింది. హస్తం పార్టీ నుంచి ఫిరాయించిన హర్‌జిందర్‌సింగ్‌ టెకెదార్‌ పీఎల్‌సీ తరఫున అమృత్‌సర్‌ (దక్షిణ) సీటు నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు హెచ్‌ఎస్‌ హన్స్‌పాల్‌ కూడా ఆప్‌లో చేరడం గమనార్హం.

ఆమ్‌ ఆద్మీ పార్టీ : ఎమ్మెల్యేల ఫిరాయింపుతో కుదేలు

2017 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు దక్కించుకొని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన ఆప్‌.. ఆ తర్వాత వలసలతో కుదేలైంది. ఎమ్మెల్యేలు హెచ్‌ఎస్‌ ఫూల్కా, సుఖ్‌పాల్‌ ఖైరా, కన్వర్‌ సంధూ, నాజర్‌సింగ్‌ మానశాహియా, జగ్‌దేవ్‌సింగ్‌ జగ్గా హిసోవాల్‌, అమర్‌జీత్‌సింగ్‌ సందోవా, రూపిందర్‌కౌర్‌ రూబీ, పిర్మల్‌సింగ్‌ దౌలా, జగ్దేవ్‌సింగ్‌ కమాలూ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు గుర్‌ప్రీత్‌సింగ్‌ ఘుగ్గీ, మోహన్‌సింగ్‌ ఫలియాన్‌వాలా సహా మరికొందరు ప్రముఖులూ వెళ్లిపోయారు. ఆప్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో సుఖ్‌పాల్‌ ఖైరా, జగ్‌దేవ్‌సింగ్‌ జగ్గా, రూపిందర్‌కౌర్‌ రూబీ మాత్రమే ప్రస్తుతం హస్తం పార్టీ టికెట్లు దక్కించుకున్నారు. మోహన్‌సింగ్‌ ఫలియన్‌వాలాను జలాలాబాద్‌లో బరిలో దించింది కాంగ్రెస్‌.

శిరోమణి అకాలీదళ్‌: సీనియర్ల తిరుగుబాటు

సీనియర్‌ నాయకుల తిరుగుబాటుతో శిరోమణి అకాలీదళ్‌ తీవ్ర కుదుపులకు లోనైంది. సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా, ఆయన కుమారుడు పర్మిందర్‌సింగ్‌ ధిండ్సా, రంజిత్‌సింగ్‌ బ్రహ్మపుర, సేవాసింగ్‌ సెఖ్వాన్‌(ఇప్పుడు జీవించిలేరు), రంజిత్‌సింగ్‌ తల్వాండీ, హర్‌సుఖిందర్‌సింగ్‌ బబ్బీ బాదల్‌, బీర్‌ దావీందర్‌సింగ్‌, బల్వంత్‌సింగ్‌ రామువాలియా పార్టీని వీడారు. సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా, రంజిత్‌సింగ్‌ బ్రహ్మపుర చేతులు కలిపి శిరోమణి అకాలీదళ్‌ (యునైటెడ్‌) పార్టీని స్థాపించారు.

భాజపా: పెరిగిన బలం!

రాష్ట్రంలో నేతల వలసల కారణంగా ఎక్కువగా భాజపాకే ప్రయోజనం చేకూరినట్లు కనిపిస్తోంది. నిజానికి వివాదాస్పద సాగుచట్టాలపై పోరాటం జరిగినన్నాళ్లూ రాష్ట్రంలో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ చట్టాల రద్దు తర్వాత బాగానే పుంజుకుంది. అనేకమంది సిక్కు నేతలు పార్టీలో చేరారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.