ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ఝాన్సీ లక్ష్మీబాయి బాలుడేమయ్యాడు..?

author img

By

Published : Nov 17, 2021, 7:11 AM IST

రాణీ ఝాన్సీలక్ష్మీబాయి అనగానే.. వీపున చిన్నపిల్లాడితో.. గుర్రంపై దూసుకెళ్తూ కత్తి ఎత్తిన బొమ్మే అందరికీ గుర్తుకొస్తుంది. 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం తర్వాత మరి వీపునున్న ఆ పిల్లాడేమయ్యాడు? ఝాన్సీ వారసుడిని బ్రిటిష్‌ ప్రభుత్వం ఏం చేసింది?

Azadi Ka Amrit Mahotsav
వీరనారి ఝాన్సీ

ఝాన్సీలక్ష్మీబాయి వీపున బొమ్మగా నిల్చిపోయిన ఆ బాలుడి పేరు దామోదర్‌రావు. 1849 నవంబరు 15న జన్మించిన ఆ కుర్రాడిని మూడేళ్ల వయసులో ఝాన్సీ మహారాజు గంగాధర్‌రావు దత్తత తీసుకున్నారు. ఈ విషయమై బుందేల్‌ఖండ్‌లోని ఈస్టిండియా కంపెనీ ప్రతినిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమోదం లభించేలోపే గంగాధర్‌రావు మరణించారు.

దీంతో రాణీ లక్ష్మీబాయి.. దామోదర్‌రావును తన కొడుకుగా గుర్తించాలంటూ కోల్‌కతాలోని గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ డల్హౌసీకి లేఖ రాశారు. కానీ అప్పట్లో వారసుల్లేకుండా రాజు మరణిస్తే.. ఆ రాజ్యాన్ని బ్రిటిష్‌వారు స్వాధీనం చేసుకునేవారు. లక్ష్మీబాయి దరఖాస్తును తిరస్కరిస్తూ, ఝాన్సీని స్వాధీనం చేసుకోవటానికి రంగం సిద్ధమైంది. లక్ష్మీబాయికి ఏడాదికి రూ.5వేల(( పింఛను, వ్యక్తిగత ఆస్తులు ఇస్తామన్నారు. రాజు ఖజానాలోని రూ.7లక్షలను పిల్లవాడు పెద్దయ్యాక అప్పగిస్తామన్నారు. రాజ్యాన్ని బ్రిటిష్‌కు అప్పగించటానికి ఇష్టపడని లక్ష్మీబాయి యుద్ధానికి దిగటం.. గ్వాలియర్‌లో ఓ వంచకుడి మోసంతో వీరమరణం పొందటం అందరికీ తెలిసిందే.

యుద్ధంలో రాణి వీపున ఉన్న బాలుడిని ఆమె నమ్మినబంట్లు కాపాడారు. యుద్ధంలో బతికిన సుమారు 60 మంది బ్రిటిష్‌వారి కంటపడకుండా 9 ఏళ్ల దామోదర్‌రావును తీసుకొని రహస్యంగా బుందేల్‌ఖండ్‌ అడవుల్లోకి వెళ్లారు. సమీపగ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా బ్రిటిష్‌ గూఢచారులే ఉండేవారు. దాంతో.. ఎండలకు ఎండుతూ.. వానలకు తడుస్తూ.. అడవిలోని చెట్ల ఫలాలే తింటూ చాలాకాలం గడపాల్సి వచ్చింది. ఓ వానాకాలంలో దామోదర్‌రావు ఆరోగ్యం దెబ్బతింది. దగ్గర్లోని ఓ గ్రామపెద్ద రూ.500 తీసుకొని సాయం చేయటానికి అంగీకరించాడు. తన బంధువైన ఓ వైద్యుడిని రహస్యంగా పంపించి దామోదర్‌రావుకు వైద్యం చేయించారు. డబ్బులైపోవటంతో గ్రామపెద్ద సాయం నిరాకరించాడు. దాంతో గ్వాలియర్‌కు సమీపాన ఉన్న షిప్రికి చేరుకోగానే.. తిరుగుబాటుదారులని గుర్తించి పట్టుకున్నారు. అయితే.. స్థానిక ఆంగ్ల అధికారి ఫ్లింక్‌ వద్ద పనిచేస్తున్న వ్యక్తి అంతకుముందు లక్ష్మీబాయి సంస్థానంలో ఉండేవాడు. 'పదేళ్ల పిల్లాడు మిమ్మల్ని ఏం చేస్తాడు.

అడవుల్లో జంతువులా తిరగాల్సి వస్తోంది. క్షమాభిక్ష పెట్టండి' అని ఫ్లింక్‌కు చెప్పటం.. ఆయన పై అధికారులకు సూచించటంతో.. మూడునెలలు జైలులో పెట్టారు. ఆ తర్వాత ఇండోర్‌లో ఏడాదికి రూ.10వేల పింఛన్‌తో క్షమాభిక్ష ప్రసాదించారు. ఝాన్సీకి చెందిన సొమ్ములో ఏమాత్రం ఆయనకు ఇవ్వలేదు. ఖజానాలోని రూ.7 లక్షలను కూడా దామోదర్‌రావుకు పెద్దయ్యాక అందజేయలేదు. 1906 మే 28న తన 58వ ఏట దామోదర్‌రావు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఇండోర్‌లోనే మరణించారు.

ఇదీ చూడండి:- Azadi Ka Amrit Mahotsav: మాట వింటారనుకుంటే మంట పెట్టారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.