కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం, ఏ క్షణమైనా పార్టీ శిథిలం

author img

By

Published : Aug 29, 2022, 1:54 PM IST

Updated : Aug 29, 2022, 2:33 PM IST

Ghulam Nabi Azad

తాను బలవంతంగా కాంగ్రెస్​ పార్టీని వీడాల్సి వచ్చిందని గులాం నబీ ఆజాద్​ అన్నారు. సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచి తనను టార్గెట్​ చేశారని, రాజీనామాకు మోదీని సాకు చూపుతున్నారన్నారు. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు. మరోవైపు, ఆజాద్​ విమర్శలపై కాంగ్రెస్​ స్పందించింది. పార్టీని నిందించి తన విలువను మరింత తగ్గించుకుంటున్నారంటూ జైరామ్​ రమేశ్​ ట్వీట్​ చేశారు.

Ghulam Nabi Azad on Congress : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొన్నిరోజుల తర్వాత గులాం నబీ ఆజాద్.. గాంధీ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు. జీ-23 నేతల్లో ఉన్న తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీలో తనను టార్గెట్​ చేశారన్నారు. అయితే ఇప్పుడు తన రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.

మీడియాతో మాట్లాడుతున్న గులాం నబీ ఆజాద్​

'పార్టీకి డాక్టర్లు బదులు కాంపౌండర్లు చికిత్స చేస్తున్నారు'
కాంగ్రెస్‌ పార్టీకి అత్యవసరంగా ఔషధాలు అవసరమని గులాం నబీ ఆజాద్​ అన్నారు. అయితే పార్టీకి డాక్టర్లకు బదులుగా కాంపౌండర్లు వైద్యం అందిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయడానికి నాయకత్వానికి సమయం లేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులను ఏకం చేయకుండా, వారు పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు. అందుకే కొంతమంది నాయకులతో కలిసి పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

"కాంగ్రెస్‌ పార్టీలో కొందరు స్వార్థపరులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, ఎవ్వరూ ప్రశ్నించకూడదని వారు అనుకున్నారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయి. కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేదు. నేను భాజపాలో చేరను. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున త్వరలోనే జమ్ముకశ్మీర్​లో కొత్త పార్టీ పెడతాను."

-- గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్​ మాజీ నేత

ఆజాద్​ విమర్శలపై స్పందించిన కాంగ్రెస్​..
గులాం నబీ ఆజాద్‌ చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ స్పందించింది. పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్న నాయకుడు.. కాంగ్రెస్​ను నిందించి తన విలువను మరింత తగ్గించుకుంటున్నారని విమర్శించింది. ఆజాద్​ విమర్శలపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరామ్​ రమేశ్ ట్విట్టర్​లో స్పందించారు. "పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉండి పార్టీని నిందించడం ద్వారా మిస్టర్ ఆజాద్ తనను తాను మరింత తగ్గించుకుంటున్నారు. ప్రతి నిమిషానికి ఆయన చేసిన ద్రోహాన్ని సమర్థించుకునేంతగా ఎందుకు భయపడుతున్నారు? ఎంతటి స్థాయికి ఆయన దిగజారారో తెలుస్తోంది." అంటూ ట్వీట్​ చేశారు.

ఇవీ చదవండి: వరదలో బస్సు, లక్కీగా బయటపడ్డ ప్రయాణికులు, ఎంపీ ఇల్లు జలమయం

హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్​ స్కామ్​పై విచారణకు నో

Last Updated :Aug 29, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.