ETV Bharat / bharat

Vizianagaram Train Accident: పట్టాలపై బీభత్సం.. కొనసాగుతున్న సహాయ చర్యలు.. ప్రమాదం జరిగిన తీరు ఇలా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 7:04 AM IST

Vizianagaram Train Accident
Vizianagaram Train Accident

Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.. 14 మంది చనిపోయారు. 100 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకే ట్రాక్‌పై ముందున్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో ఆ బోగీలు.. పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లడంతో మరింత బీభత్సం సంభవించింది. ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం జగన్‌ సైతం సహాయ చర్యలకు ఆదేశించారు.

Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి,అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో ట్రైన్ ఢీకొన్న దుర్ఘటనలో.. మూడు బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలయ్యాయని అధికార వర్గాలు ప్రకటించాయి. క్షతగాత్రుల సంఖ్య 100 మందికిపైనే ఉంటుందని సంఘటన స్థలంలో పరిస్థితులనుబట్టి తెలుస్తోంది.

మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ ట్రైన్​లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి.

అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంటకాపల్లి-అలమండ వద్దకు రాగానే సిగ్నల్‌ కోసం పలాస ప్యాసింజర్‌ పట్టాలపై నెమ్మదిగా వెళుతూ 848 కిలోమీటర్ల వద్ద ట్రాక్‌పై నిలిచింది. ఆ టైమ్​లో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్లు అందులోని ప్రయాణికులు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్‌ రైలు ప్రమాద ఘటన మాదిరిగానే ప్రస్తుతం ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే ట్రైన్ ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది.

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి!.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

ప్రమాదం జరిగినప్పుడు రాయగడ ట్రైన్​కు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్‌, గూడ్స్ రైళ్లలో మొత్తంగా ఏడు బోగీలు నుజ్జయ్యాయి. ట్యాంకర్‌ గూడ్సుపైకి పలాస రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ రైలు ఇంజిన్ పైకి ఆ రైలు బోగీలే 3 పైకెక్కి, పక్కనే ఉన్న బొగ్గు రవాణా గూడ్స్ రైలును ఢీకొట్టాయి.

విశాఖ-రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాల తప్పడంతో పొలాల్లో పడింది. దాని వెనుక ఉన్న డీ-1 బోగి.. వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. దీంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందించడం సవాలుగా మారింది. రాయగడ, పలాస ప్యాసింజర్‌ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనా ప్రకారం మృతుల సంఖ్య 40నుంచి 50 వరకు ఉంటుందని సమాచారం. అర్ధరాత్రి వరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు.

వీరిలో కొందరినే గుర్తించారు. ప్రయాణికులతో ఉన్న బోగీలు అదుపుతప్పడం, రెండుగా అవి చీలిపోయి నుజ్జునుజ్జవ్వడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు, గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరీనాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఎస్‌పీఆర్‌ పురానికి చెందిన గిడిజాల లక్ష్మి మృతదేహాలను గుర్తించారు. పలాస రైలులో వెనుక బోగీ ఆనుకుని ఉన్న గార్డు ఎంఎస్‌ రావు, రాయగడ రైలు ఇంజిన్​లో ఉన్న లోకోపైలెట్లు ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

vizianagaram train accident రైలు ప్రమాదంపై నేతల దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలన్న సీఎం! బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన నేతలు..

విజయనగరం-కొత్తవలస ప్రధాన రహదారికి దుర్ఘటన స్థలి 5 కిలోమీటర్లకు పైగా దూరం ఉండటంతో అన్ని రకాల సహాయ చర్యలు కష్టమవుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాయి. నుజ్జుయిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి కట్టర్లు ఉపయోగించారు. క్షతగాత్రులను తరలించడానికి రైలు ట్రాక్‌పై కిలోమీటర్ల మేర దూరం నడిచి అంబులెన్సులలో ఎక్కించాల్సి వస్తోంది. క్షతగాత్రులు, మృతదేహాలతో ప్రమాదం జరిగిన ప్రాంతం మరుభూమిని తలపించింది.

తీవ్రగాయాలైనవారిని విశాఖ కేజీహెచ్‌కు, స్వల్పగాయాలైనవారిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలికి మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికలు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5గంటల45 నిమిషాలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుక విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్‌ ఆరు గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస ట్రైన్​కు సిగ్నల్‌ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు.

తన 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం ఇదే మొదటిసారి అని, ఒకే ట్రాక్‌లో సిగ్నల్‌ క్రాస్‌ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది అంతుపట్టడం లేదని ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించిన ఒక రైల్వే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన రైల్వే యంత్రాంగం.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు.

Odisha Train Accident : 'ఘోర'మాండల్​ రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగిందంటే?

ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌ ’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.

రైలు ప్రమాదంపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామని జగన్‌ తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు 10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి 2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే 2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్‌-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్‌, గుణుపూర్‌-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి.

Agra Train Accident : రైలులో ఒక్కసారిగా మంటలు.. రెండు బోగీలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.