ETV Bharat / bharat

నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్​లైన్!

author img

By

Published : Nov 9, 2022, 4:01 PM IST

పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ సమర్పించడంలో విఫలమైన కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా సవివర నివేదిక సమర్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది.

SC demonetisation hearing
SC demonetisation hearing

పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ దాఖలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. సవివర అఫిడవిట్ సమర్పించాలని అక్టోబర్ 11న కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దు సమయంలో ఆర్​బీఐకి కేంద్రం రాసిన లేఖలు, ఆర్​బీఐ బోర్డు నిర్ణయాలు, నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.

ఈ అంశం బుధవారం జస్టిస్ ఎస్ఏ నజీర్​తో సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాగా.. సమగ్ర అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి మరింత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అఫిడవిట్ సమర్పించడంలో జాప్యానికి క్షమాపణ చెప్పిన ఆయన.. మరో వారం గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన కోర్టు అటార్నీపై అసనహనం వ్యక్తం చేసింది. "సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం ఇలా వాయిదా పడదు. మేము ఇలా లేచి వెళ్లిపోలేము. ఇది కోర్టుకు చాలా అవమానకరం" అని వ్యాఖ్యానించింది. దీనికి స్పందించిన అటార్నీ.. తనకు కూడా ఇది ఇబ్బందికరంగానే ఉందని చెప్పారు.

ఈ నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించారు. 'రాజ్యాంగ ధర్మాసనాన్ని వాయిదా వేయాలని కోరడం అసాధారణం. మా వాదనలను కొనసాగించేందుకు అనుమతించండి. ఆర్​బీఐ, కేంద్రం తమ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు సమయం తీసుకోవచ్చు' అని సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ పేర్కొన్నారు. అయితే, న్యాయవాదుల వాదనలను విన్న ధర్మాసనం.. వారంలోగా అఫిడవిట్లు సమర్పించాల్సిందేనని కేంద్రం, ఆర్​బీఐకి స్పష్టం చేసింది. విచారణను నవంబర్ 24కు వాయిదా వేసింది.

58 పిటిషన్లు
2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.