ETV Bharat / bharat

'లాంగ్ టర్మ్ గెయిన్ కావాలంటే.. టెంపరరీ పెయిన్ ఉంటుంది'

author img

By

Published : Apr 12, 2023, 7:53 PM IST

Venkaiah Naidu launched the book written by Tummala Kishore
'లాంగ్ టర్మ్ గెయిన్ కావాలంటే.. టెంపరరీ పెయిన్ ఉంటుంది'

ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు, కాలమిస్టు తుమ్మల కిశోర్ రాసిన ‘దేశ ఆర్థిక ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు’ పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న, అధిగమించిన సవాళ్లను ఈ పుస్తకంలో చక్కగా వివరించారని తుమ్మల కిశోర్​ను వెంకయ్య అభినందించారు. అప్పటి ప్రధానులు చేసిన సంస్కరణల మూలంగా నేడు ప్రజలకు సౌకర్యవంతమైన జీవితం అందుబాటులోకి వచ్చిందన్నారు.

Venkaiah Naidu launched the book written by Tummala Kishore: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు తుమ్మల కిషోర్ రచించిన 'దేశ ఆర్థిక ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు - సంక్షోభాలు- సంస్కరణలు' పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. పుస్తక రచయిత కిషోర్ రచించిన గత వ్యాసాలను ఈనాడు దినపత్రికలో తరుచూ చదువుతుండేవాడినని గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు.... భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక మాంద్యమాన్నిఅధిగమించగలమని తెలిపారు. ఈ దిశగా కిషోర్ రచించిన పుస్తకం ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ ఆయనను అభినందించారు. బ్యాంకింగ్ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవంతో ఆర్థిక రంగంపై మంచి పట్టు సంపాదించుకున్న కిషోర్.... ఈనాడులో 800కుపైగా వ్యాసాలు రాశారు. 'సెక్యూరిటీల కుంభకోణం', 'పెద్దనోట్ల రద్దు', 'మాంద్యం ముంగిట దేశం' రచనలు కిషోర్​కు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈనాడు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ఎమ్మెస్కో పబ్లిషర్స్ అధినేత విజయ్ కుమార్, సంపాదకులు డాక్టర్ డి.చంద్రశేఖర్ రెడ్డి హాజరై తుమ్మల కిషోర్​కు అభినందనలు తెలిపారు.

Venkaiah Naidu launched the book written by Tummala Kishore
'లాంగ్ టర్మ్ గెయిన్ కావాలంటే.. టెంపరరీ పెయిన్ ఉంటుంది'

ప్రజోపయోగకరమైన పుస్తకం: తుమ్మల కిశోర్.. ప్రజోపయోగకరమైన పుస్తకం రాశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న, అధిగమించిన సవాళ్లను ఈ పుస్తకంలో చక్కగా విశదీకరించారని ప్రశంసించారు. దేశంలో ఆర్థిక సంస్కరణల వచ్చిన సానుకూల ఫలితాలు, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వెనక జరిగిన కృషి వంటి అంశాలను సావధానంగా విశ్లేషించడంతో పాటు, క్లిష్టమైన అంశాలపై సులభరీతిలో అవగాహన కల్పించే విధంగా పుస్తకాన్ని వెలువరించడం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి పుస్తకాలు ఆలోచనలను పెంచుతాయని, వాటిని అందరితోనూ పంచుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నవతరం ఇలాంటి పస్తకాలు చదవాలని సూచించారు. పత్రికాపఠనం, పుస్తక పఠనం ఎంతో ఎంతో అవసరమని, ప్రింట్​లో ఉండే విషయం అధికంగా ప్రభావం చూపిస్తుందని అన్నారు. మంచి పుస్తకాలు రాయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రచురించేవారు ముందుకు రావడమూ అంతే ముఖ్యమని చెప్పారు.

వారి సంస్కరణల ఫలితమే నేడు: ప్రస్తుతం ప్రపంచంలో ఇజాలకు కాలం చెల్లిందన్న వెంకయ్యనాయుడు.. రియలిజం అనేదే ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలను ఎంత మెరుగ్గా, చురుగ్గా అమలు చేస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. సంస్కరణలు, పరిశోధనల అంతిమ లక్ష్యం ప్రజలకు చక్కటి ప్రతిఫలాలు అందించడమేనని చెప్పారు. ప్రధాని పీవీ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.

ప్రజల సహకారం తప్పనిసరి: అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రధానిగా సంస్కరణలను వేగవంతంగా అమలు చేసి చూపించారన్నారు. ఫలితంగా దేశంలో రైల్వే అనుసంధానం, జాతీయ రహదారుల అనుసంధానం, ఓడరేవుల అనుసంధానం, డిజిటల్ అనుసంధానం వంటివి జరిగి ప్రజలకు సౌకర్యవంతమైన జీవితం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఆర్థిక సంస్కరణలను ప్రధాని మోదీ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. 'లాంగ్ టర్మ్ గెయిన్ కావాలంటే టెంపరరీ పెయిన్ ఉంటుందని' చెబుతూ సంస్కరణలు అలాంటివేనని పేర్కొన్నారు. సంస్కరణలను అమలు చేసి వాటి ఫలాలు అందుకోవాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు. ప్రస్తుతం అన్నిరకాల ఇజాలకు కాలం చెల్లిందని, వాస్తవాలకు తగ్గట్లు అనుభవాల ఆధారంగా మార్పులు, చేర్పులు అవసరమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.