ETV Bharat / bharat

అరుణాచల్ ​ప్రదేశ్​లో చైనా 'గ్రామం'.. అమెరికా నివేదిక

author img

By

Published : Nov 5, 2021, 5:27 PM IST

india china news
అరుణాచల్​ప్రదేశ్​లో చైనా 'గ్రామం'.. అమెరికా నివేదిక

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వాస్తవాధీనరేఖ వెంట డ్రాగన్‌ దురాక్రణమలను అమెరికా కూడా గుర్తించింది. ఈ మేరకు అగ్రరాజ్య రక్షణశాఖ తమ పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పించింది. సైనిక సామర్థ్యం పెంచుకోవటం సహా బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తున ఎల్​ఏసీ వెంట మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. ఎల్‌ఏసీ వెంట డ్రాగన్‌ దురాక్రమణ చర్యలపై అమెరికా రక్షణ శాఖ నివేదికలోని అంశాలపై ప్రత్యేక కథనం.

వాస్తవాధీనరేఖ వెంట చైనా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది డ్రాగన్‌ పరిస్థితి. భారత్‌-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా వంద ఇళ్లు నిర్మించినట్లు బయటపడింది. ఈ మేరకు అమెరికా ర‌క్షణ‌ శాఖ.. తమ పార్లమెంటుకు ఓ నివేదిక‌ సమర్పించింది. మెక్ మెహ‌న్ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో ఈ గ్రామం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అరుణాచ‌ల్‌లోని భారత భూభాగం పరిధిలో డ్రాగన్‌ ఓ గ్రామం నిర్మించిన విష‌యాన్ని ఉప‌గ్రహ ఛాయాచిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథ‌నం ప్రసారం చేసింది. టిబెట్ అటాన‌మ‌స్ రీజియ‌న్‌, భార‌త్‌లోని అరుణాచ‌ల్‌ ప్రదేశ్​ మ‌ధ్య ఈ గ్రామాన్ని చైనా 2020 మ‌ధ్యలో ఎప్పుడో నిర్మించి ఉంటుంద‌ని అమెరికా ర‌క్షణ‌ శాఖ పేర్కొంది.

అరుణాచ‌ల్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలోని సారిచు న‌ది ఒడ్డున ఈ గ్రామ నిర్మాణం చేప‌ట్టడం వివాదాస్పదంగా మారింది. 1962కు ముందు కూడా ఈ ప్రాంతంలోనే రెండు దేశాల సైనికుల మధ్య ఘ‌ర్షణలు జరిగాయి. దశాబ్దం క్రితం వరకు దీన్ని చిన్న మిలిటరీ ఔట్‌ పోస్టుగా పేర్కొంటూ వచ్చిన చైనా.. 2020నాటికల్లా చిన్న సైనిక పోస్టును ఏకంగా ఓ గ్రామంగా అభివృద్ధి చేసింది. అంతేకాదు భారత భూభాగంలోనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్నట్లు సమాచారం. సైనిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో భారత్‌తో చర్చలు జరుపుతున్న డ్రాగన్‌.. ఆ ప్రాంతం తమదేనని వ్యూహాత్మకంగా గట్టిగా వాదిస్తున్న విషయాన్ని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో పొందుపరిచింది. సైనిక పరంగా, బహుళ ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని.. ఎల్‌ఏసీ వెంట చైనా సరిహద్దు గ్రామాలను నిర్మిస్తున్నట్లు.. గతనెల అరుణాచ‌ల్‌లో పర్యటించిన తూర్పు సైనిక కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే తెలిపారు. టిబెట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా బిలియన్‌ డాలర్ల వ్యయ ప్రణాళికలో భాగంగా వాస్తవాధీన రేఖ వెంట నివాస ప్రాంతాల నిర్మాణం చైనా విధానంగా కనిపిస్తోంది. సరిహద్దు పట్టణాలను కలుపుతూ పెద్దఎత్తున రోడ్డు, రైలుమార్గాల అభివృద్ధితోపాటు సకల సదుపాయాలతో 600కుపైగా గ్రామాలను నిర్మించాలని డ్రాగన్‌ వ్యూహమని తెలుస్తోంది.

ఈ నివేదికలో గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణను ప్రస్తావించింది అమెరికా రక్షణ శాఖ. నలుగురు పీఎల్​ఏ సైనికులకు చైనా అవార్డులు ప్రకటించినట్లు పేర్కొంది. అయితే చైనా వైపు ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత లేదని తెలిపింది. భారత్‌ వైఖరి వల్లే తాము ఎల్‌ఏసీ వెంట సైనిక మోహరింపులు చేపట్టినట్లు చైనా అంటోందని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయటం సహా భారత్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకునే వరకు తాము వెనక్కి వెళ్లేదిలేదని చైనా పేర్కొన్నట్లు తెలిపింది. సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా విసురుతున్న సవాలును ఎదుర్కొవాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక గుర్తు చేసింది.

ఇదీ చూడండి:- చైనాకు దీటుగా సరిహద్దులో భారత్ యుద్ధ సన్నద్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.