ETV Bharat / bharat

35 ఏళ్ల చరిత్రను తిరగరాసేనా? 'మొదటి దశ' తేల్చేసేనా?

author img

By

Published : Feb 8, 2022, 5:00 PM IST

Updated : Feb 8, 2022, 6:04 PM IST

UP Polls 2022
ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలు

UP Polls 2022: 2007లో బీఎస్పీ.. 2012లో ఎస్పీ.. 2017లో భాజపా.. ఇలా ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో .. గత 35ఏళ్లలో అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. అయితే ఈ సారి గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. మరి ఆయన ఆశయం నెరవేరుతుందా? ఎలాగైనా అధికారంలోకి రావాలని చిన్నపార్టీలను కలుపుకొని రంగంలోకి దిగిన అఖిలేశ్ కల నెరవేరేనా? ఈ ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం చూపేనా? ప్రియాంకను నమ్ముకున్న కాంగ్రెస్​.. సంఖ్యను మెరుగుపరుచుకునేనా? మంగళవారం సాయంత్రం 5గంటలకు తొలిదశ ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. అఖిలేశ్​ చెప్పినట్లు మొదటి దశతోనే అంతా తేలిపోనుందా?

UP Polls 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మొదటి దఫా పోలింగ్​కు సమయం ఆసన్నమైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా ఏడు దఫాల్లో పోలింగ్​ నిర్వహించనుంది ఈసీ. ఈ నెల 10న మొదటి దఫా ఒక్క యూపీలో మాత్రమే జరగనుంది. ఈ ఎలక్షన్లను 2024 సాధారణ ఎన్నికలకు సెమీపైనల్​గా భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

గత 35 ఏళ్లలో ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈసారి గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఎలాగైనా అధికారంలోకి రావాలని చిన్నపార్టీలను కలుపుకొని రంగంలోకి దిగారు అఖిలేశ్​. అలాగే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాలని చూస్తోంది బీఎస్పీ. కాంగ్రెస్​ సైతం.. ప్రియాంక సాయంతో సంఖ్యను మెరుగుపరుచుకోవాలనే ఆశతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎవరి ఆశలు ఫలిస్తాయి, ఎవరికి రిక్తహస్తం మిగులుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే రాజకీయ పార్టీలు మాత్రం మొదటి దశతోనే భాజపా జాతకం తెలిసిపోతుందని చెబుతున్నాయి. అఖిలేశ్​ యాదవ్ కూడా ఈ మధ్య అలాంటి వ్యాఖ్యలే చేశారు. " తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరుచుకుంటాయి" అని అన్నారు.

అయితే యూపీలో తొలి దశ ఎన్నికల ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో.. పార్టీల పొత్తు ఎలా ఉన్నాయి. పార్టీల వారీగా సామాజిక సమీకరణాలు.. స్థితిగతులను తెలుసుకుందాం.

భారతీయ జనతా పార్టీ

  • ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని భాజపా భావిస్తోంది. ఒపీనియన్​ పోల్స్​ కూడా మిగతా పార్టీల కంటే భాజపా మెరుగైన స్థితిలో ఉన్నట్లు అంచనా వేశాయి.
  • 2017లో భాజపా తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 403 స్థానాలకు గానూ 312 సీట్లు గెలుచుకొని.. రాష్ట్రంలో 14 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది.
  • 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 40శాతం ఓట్లు.. ఎస్పీ, బీఎస్పీకి 22శాతం చొప్పున .. కాంగ్రెస్‌కు 6శాతం వచ్చాయి.
  • సీఎం యోగి రాష్ట్రంలో భాజపా నుంచి తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. దీనికితోడు.. ప్రధాని మోదీ ఇమేజ్​ కూడా తమకు ఊపయోగపడుతుందని కాషాయపార్టీ భావిస్తోంది.

సమాజ్​వాదీ పార్టీ

  • యూపీలో ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది.
  • ఎస్పీని 1992లో ములాయం సింగ్ యాదవ్ స్థాపించారు. ఇప్పుడు ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో పార్టీ నడుస్తోంది.
  • 2012 ఎన్నికల్లో బీఎస్పీపై సమాజ్‌వాదీ పార్టీ అద్భుత విజయాన్ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • అయితే ఈ ఎన్నికల్లో.. రాష్ట్రీయ లోక్‌దళ్( ఆర్​ఎల్​డీ)తో పాటు కొన్ని చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది ఎస్పీ.
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ పార్టీకి ఇది కొంత ఊరటనిచ్చే విషయం.
  • స్వామి ప్రసాద్ మౌర్య వంటి యాదవేతర ఓబీసీ నాయకులు ఎస్పీలో చేరడం వల్ల పార్టీకి కలిసొస్తుందని అఖిలేశ్​ భావిస్తున్నారు.
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు ఎస్పీకి ఆయుధాలు మారాయి.

బహుజన్ సమాజ్ పార్టీ

  • 2007 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసేందుకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే దళితుల ఐక్యతపై దృష్టి సారిస్తున్నారు.
  • 2007లో 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 206 సీట్లు గెలుచుకుంది బీఎస్పీ. దళిత-బ్రాహ్మణ ఐక్యతను పెంపొందించడం ద్వారా మాయావతికి ఈ విజయం దక్కింది.
  • అయితే గత రెండు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.
  • దీంతో ఈసారి పాత ఫార్ములా అయిన బ్రాహ్మణ- దళిత సోషల్​ ఇంజినీరింగ్​తో ముందుకెళ్తున్నారు మాయావతి.
  • అయితే ఈ ఎన్నికల్లో మాయావతి.. ప్రచారం విషయంలో వెనకబడ్డారనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్​ పార్టీ..

  • ఉత్తర్​ప్రదేశ్‌లో ఒకప్పుడు బలమైన పార్టీ కాంగ్రెస్​. ఇప్పుడు వరుస ఎన్నికల్లో భారీ ఓటములతో రోజురోజుకు దిగజారుతోంది.
  • ఒకప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పిన పార్టీ.. 2017లో మొత్తం 403 సీట్లలో కేవలం ఏడింటిని మాత్రమే గెలుచుకుంది.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80స్థానాల్లో ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. స్వయంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ అమేఠీ నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
  • అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ప్రియాంక గాంధీని ముందు పెట్టి నడిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. యూపీ రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చాక.. కాంగ్రెస్​ పరిస్థితి కాస్త మెరుగైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే గతంలో కంటే ఈసారి కాస్త ఎక్కువ సీట్లు గెలుకుంటామని ధీమాగా నాయకులు ఉన్నారు.

రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్​ఎల్​డీ)

  • తండ్రి అజిత్ సింగ్ మరణం తర్వాత.. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్​ఎల్​డీ) చీఫ్ జయంత్ చౌదరి తను సొంతంగా ఎదుర్కొంటున్న ఎన్నికలు ఇవే.
  • రైతు నాయకులు, మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడే జయంత్ చౌదరి. యూపీలో కీలకమై జాట్​ వర్గం మద్దతు ఈ పార్టీకి ఉంది.
  • అయితే 2014 ఎన్నికల్లో ఆ వర్గం ఓటర్లు ఆర్​ఎల్​డీ వైపు అంతగా మొగ్గు చూపలేదని అభిప్రాయం ఉంది. అందుకే ఆ సాధారణ ఎన్నికలతో పాటు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు పార్టీకి రాలేదు.
  • ఈ ఎన్నికలతో తిరిగి జాట్​ వర్గం ఓటు బ్యాంకును పొందాలని చౌదరి ఆశిస్తున్నారు.
  • ఈ ఎన్నికల్లో ఎస్పీతో జయంత్ పొత్తు పెట్టుకున్నారు.
  • 2012 ఎన్నికల్లో ఎస్పీ- ఆర్​ఎల్​డీ పొత్తు పెట్టుకొని ఘన విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో ఆ విజయాన్ని పునరావృతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

అప్నా దళ్ (సోనేలాల్)

  • రాష్ట్రంలో 5శాతం జనాభా ఉన్న కుర్మీ వర్గం మద్దతు ఉన్న పార్టీ అప్నా దళ్ (సోనేలాల్).
  • అప్నా దళ్ పార్టీ నుంచి బయటికి వచ్చి.. డాక్టర్ సోనే జవహర్ లాల్ పటేల్ 1995లో అప్నా దళ్ (సోనేలాల్)ను స్థాపించారు.
  • పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్​కు ఆయన మద్దతు ఉంది. ఈ ఎన్నికల్లో అప్నా దళ్ (సోనేలాల్) పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకుంది.
  • అప్నా దళ్ (సోనేలాల్) పార్టీ 2017 ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది స్థానాలను గెలుచుకుంది.

నిషాద్ పార్టీ

  • నిషాద్ పార్టీని 2016లో సంజయ్ నిషాద్ స్థాపించారు. ఆయన బీఎస్పీ నుంచి బయటికి వచ్చి ఈ పార్టీని ఏర్పాటు చేశారు.
  • నిషాద్, కేవత్స్, బింద్, మల్లా, కశ్యప్, మాంఝీ, గోండ్ తోపాటు ఇతర వర్గాలకు చెందిన పడవలు నడిపేవారు, మత్స్యకారుల సాధికారత కోసం దీని స్థాపించారు.
  • 2017లో నిషాద్ పార్టీ 72 స్థానాల్లో పోటీ చేసి జ్ఞాన్‌పుర్‌లో మాత్రమే విజయం సాధించింది.
  • ఈ ఏడాది నిషాద్​ పార్టీ.. భాజపాతో పొత్తు పెట్టుకుంది.

మహాన్ దళ్

  • 2008లో కేశవ్ దేవ్ మౌర్య.. మహాన్ దళ్ పార్టీని స్థాపించారు.
  • రోహిల్‌ఖండ్, పశ్చిమ యూపీలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.
  • మహాన్ దళ్ మౌర్యులు, శాక్యాలు, కుష్వాహాలు, సైనీలు, కాంబోజ్‌లు వంటి ఇతర వెనుకబడిన తరగతుల మద్దతు ఈ పార్టీకి ఉంది.
  • ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో మహాన్​ దళ్​ పొత్తు పెట్టుకుంది.

అప్నా దళ్(కె)

  • అప్నా దళ్(కె) పార్టీ కూడా ఈసారి ఎస్పీతో కలిసి పోటీ చేస్తోంది.
  • సీట్ల కేటాయింపు విషయంలో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.
  • అయితే కలిసి పోటీ చేసే విషయంలో వెనకడుగు వేయొద్దని ఇరు పార్టీలు మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాయి.

భాగీదారీ పరివర్తన్ మోర్చా..

  • అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎంఐఎం, భారత్ ముక్తి మోర్చా, జనతా క్రాంతి పార్టీ, భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ కలిసి 'భగీదారీ పరివర్తన్ మోర్చా' పేరుతో కూటమిని కట్టాయి.
  • ఈ కూటమి ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), దళితుల మద్దతుపై ఆశలు పెట్టుకుంది.
  • యూపీలో తమ ఫ్రంట్ గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారు అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నాయకులు.

ఒక దళితుడు, ఓబీసీ నాయకుడు సీఎంలు అవుతారని, ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఉంటారని వారిలో ఒకరు ముస్లిం ఉంటారని ఇటీవల ఒవైసీ ప్రకటించారు. అయితే కూటమి ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో కంటే.. ప్రధాన పార్టీల ఓట్లకు ఏ స్థాయిలో కోత పెడుతుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది.
58 స్థానాల్లో పోలింగ్

  • పశ్చిమ యూపీ.. 11జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్
  • మొత్తం జనాభా 2.27కోట్లు
  • 10,766 పోలింగ్​ కేంద్రాలు
  • 58స్థానాలకు గానూ 810 నామినేషన్ల దాఖలు
  • 152మంది అభ్యర్థుల నామినేషన్​ పత్రాలు తిరస్కరణ
  • 35మంది ఉపసంహరణ
  • రూ.59 కోట్ల నగదు, రూ.34 కోట్ల విలువైన అక్రమ మద్యం, రూ.32 కోట్ల మాదక ద్రవ్యాలు పట్టివేత
  • 8.43 లక్షల ఆయుధాలు స్వాధీనం
  • 1,632 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు
  • ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘనకు సంబంధించి.. 928 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
  • మొదటి దశలో పోలింగ్​ జరుగు జిల్లాలు షామిలీ, ముజఫర్​నగర్​, మేరఠ్​, బఘపత్​, గజియాబాద్​, హపుర్​, గౌతమ్​బుద్ధ నగర్​, బులందషాహ్హర్​, అలీఘర్​, మథుర, ఆగ్రా.
    తొలిదఫా పశ్చిమ యూపీలోని 58స్థానాల్లో పోలింగ్​ జరగనున్నాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో భాజపా 58స్థానాలకు 10 సీట్లు గెలుచుకుంది. 2017లో ఏకంగా 53 సీట్లను కొల్లగొట్టింది. 2013 అల్లర్లకు కేంద్రమైన ముజఫర్‌నగర్‌ కూడా తొలి దఫా కిందకే వస్తుంది. అయినా కూడా 2017లో ఎన్నికల్లో ఇక్కడ భాజపా ప్రభంజనం సృష్టించింది.

ఇవీ చూడండి:

'తొలి దశలోనే భాజపాకు కళ్లు, చెవులు తెరుచుకుంటాయి'

'రైతులకు ఉచిత కరెంట్.. 'లవ్ జిహాద్' దోషులకు పదేళ్లు జైలు'

యూపీలో వ్యూహం మార్చిన భాజపా.. వర్గ రాజకీయాలపై దృష్టి!

కర్షకుల తీర్పుపై భాజపాలో ఉత్కంఠ.. అన్నదాత ఓటు ఎటు?

Last Updated :Feb 8, 2022, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.