ETV Bharat / bharat

చనిపోయిందని శవపరీక్ష కోసం తీసుకెళ్తే కళ్లు తెరిచిన బాలిక.. వైద్యులే షాక్

author img

By

Published : Jun 19, 2023, 7:14 PM IST

up girl survied before post mortem
పోస్ట్​ మార్టంకు తీసుకెళ్తే బతికిన చిన్నారి.

ప్రాణాలు కోల్పోయిన బాలికను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె.. బతికి ఉందని తేలింది. నమ్మశక్యం కాని ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ మిర్జాపుర్​లో జరిగింది. మరోవైపు, కారు డోర్​ లాక్​ అవ్వడం వల్ల ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

కెనాల్​లో లభ్యమైన బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలిస్తే.. అక్కడ బాలిక ప్రాణం పోసుకుంది! ఈ సన్నివేశాన్ని చూసిన పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. బాలికి తిరిగి బతకడం వల్ల.. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది...
మీర్జాపుర్​ జిల్లా కలాన్ హద్వా గ్రామానికి చెందిన భోళా కుమార్తె రవీన మతిస్థిమితంలేని బాలిక. ఈ క్రమంలో చిన్నారి ఆదివారం కనిపించకుండా పోయింది. సుమారు రెండు గంటల పాటు బాలిక కోసం వెతికిన కుటుంబ సభ్యులు.. చిన్నారి తప్పిపోయిన విషయాన్ని మొదటగా గ్రామ పంచాయతీ సభ్యుడు మనీశ్​ అనే వ్యక్తికి తెలిపారు. పంచాయతీ సభ్యుడు మనీశ్​ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామస్థులు, కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులు.. బాలికను స్థానికంగా ఉన్న సిర్సీ కెనాల్​లో కనుగొన్నారు. కెనాల్​లో నిర్జీవంగా పడి ఉన్న బాలికను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతిచెందినట్లుగా నిర్ధరించిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం తీసుకెళ్లే సమయంలో.. కుటుంబ సభ్యులు చిన్నారి మానసిక స్థితి గురించి పోలీసులకు వివరించారు. ఆమెను చికిత్స కోసం తీసుకెళ్లవలసిందిగా వారు పోలీసులను కోరారు. వారి విజ్ఞప్తి మేరకు పోలీసులు చిన్నారిని స్థానికంగా ఉన్న పటెహ్రా హెల్త్​ కేర్ సెంటర్​కు తరలించారు.

ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్న సమయంలో.. ఆమె స్పృహలోకి వచ్చినట్లు వైద్యుడు గణేశ్​ శంకర్​ త్రిపాఠి తెలిపారు. చిన్నారి గుండెను పరిశీలించగా.. స్పందిస్తున్నట్లు డాక్టర్ స్పష్టం చేశారు. చికిత్స అనంతరం బాలిక పూర్తి ఆరోగ్యంగా బయటపడింది. మరణించిందనుకున్న బాలిక తిరిగి ప్రాణం పోసుకోవడం వల్ల ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నారి కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం విరబూసింది.

కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు మృతి..
ఆచూకీ లేకుండా పోయిన ముగ్గురు చిన్నారులు.. ఆదివారం రాత్రి నాగ్​పుర్​ జిల్లా పచ్​వాలి పోలీస్ స్టేషన్​ పరిధిలో ఓ కారులో విగతజీవులుగా కనిపించారు. కారులో ఉండిపోయిన చిన్నారులు ఊపిరాడక మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి కారణాలు దర్యాప్తులో తేలనున్నట్లు నగర పోలీసు కమిషనర్​ అమితేశ్​ కుమార్​ చెప్పారు. ​

శనివారం మధ్యాహ్నం నుంచి ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేలాది సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. చిన్నారులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేదని నిర్ధరించుకున్నారు. ముమ్మరంగా గాలించిన పోలీసులకు ముగ్గురు చిన్నారులు.. ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఓ కారులో కనిపించారు. పిల్లలు ఆడుకుంటుండగా కారులోకి ప్రవేశించారని.. డోర్​ లాక్​ అవ్వడం వల్ల అందులోనే చిక్కుకొని ఉండవచ్చని.. ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు మరణాలుగా భావిస్తూ.. తుదుపరి విచారణ జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.