ETV Bharat / crime

పాఠశాలకు వెళ్లి అదృశ్యమైన చిన్నారి.. చెరువులో శవమై తేలింది

author img

By

Published : Dec 16, 2022, 3:07 PM IST

చిన్నారి మృతి
చిన్నారి మృతి

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో అదృశ్యమైన బాలిక కథ విషాదాంతమయ్యింది. అనుమానాస్పద స్థితిలో చెరువులో చిన్నారి మృతదేహం లభ్యం అయ్యింది. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయంటూ.. తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా చెరువు వద్ద గంజాయి సేవించే వాళ్లపై... తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌ శివారు దమ్మాయిగూడలో దారుణం జరిగింది. నిన్న పాఠశాలకు వెళ్లిన చిన్నారి... ఇవాళ స్థానిక అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో శవమై తేలింది. స్థానిక ప్రభుత్వ పాఠశాల నుంచి నిన్న బయటకు వెళ్లిన బాలిక.. ఆచూకీ లభ్యం కాలేదు. నిన్ననే పాఠశాల సిబ్బంది, పోలీసుల తీరుకు నిరసనగా.. కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఇవాళ ఉదయం దమ్మాయిగూడ చౌరస్తాలో బైఠాయించి.. నిరసన చేపట్టారు.

ఈ పరిస్థితుల్లోనే చిన్నారి మృతదేహం చెరువులో లభ్యంకావడంతో.. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల అలసత్వం వళ్లే... బాలిక చనిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు... బాలికను చూపించకుండానే... తీసుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దమ్మాయిగూడలో బంధువులు, కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్‌నగర్‌ చెరువు వద్ద.. రక్షణ కల్పించాలని.. అక్కడ గంజాయి సేవిస్తూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దమ్మాయిగూడలో స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిందా లేక.. ఎవ్వరైనా దురాగతానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.