ETV Bharat / bharat

'యోగీ జీ.. 'బుల్డోజర్'​తో మా ఇల్లు కూల్చేయండి ప్లీజ్!'

author img

By

Published : Apr 3, 2022, 5:41 PM IST

UP Bulldozer news: ఉత్తర్​ప్రదేశ్​ ప్రజల్లో ప్రస్తుతం 'బుల్డోజర్ బాబా'​ భయం నెలకొంది. అధికారులు ఎక్కడ బుల్డోజర్లతో వచ్చిన తమ భవనాలు కూల్చేస్తారేమోనని నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మా ఇంటిని కూల్చేయండి ప్లీజ్​ అంటూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఇంతకీ అతను లేఖ రాసేందుకు కారణమేంటి? సొంత ఇంటినే ఎందుకు కూల్చేయాలని కోరుతున్నాడు?

UP Bulldozer news
బుల్డోజర్​తో ఇంటిని కూల్చేయండి ప్లీజ్​

UP Bulldozer news: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ బుల్డోజర్​ వ్యాఖ్యలు నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి. తప్పు చేస్తే ఏ క్షణంలో అధికారులు బుల్డోజర్​ను తమ ఇంటికి తీసుకొస్తారేమో అనే భయం నెలకొంది. ఇటీవల అత్యాచార నేరస్థుల ఇళ్ల ముందు బుల్డోజర్లు పెట్టగా.. కొన్ని గంటల్లోనే చాలా మంది నిందితులు లొంగిపోయారు. ఇప్పుడు ఓ వ్యక్తి తన ఇంటిని కూల్చేయాలంటూ ఏకంగా సీఎం యోగికే లేఖ రాశారు. ఈ సంఘటన రామ్​పుర్​ జిల్లాలో జరిగింది.

UP Bulldozer news
కూల్చేయాలని కోరిన ఇల్లు

రామ్​పుర్​లోని మిత్రపుర్​ అరేలాకు చెందిన ఎహ​సాన్​ అనే వ్యక్తి తన ఇంటిని కూల్చేయాలని కోరుతూ సబ్​ డివిజనల్​ మెజిస్ట్రేట్​కు దరఖాస్తు చేసుకున్నారు. సొంత ఇంటిని కూల్చమనటం చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ విషయంపై ఆరా తీయగా కొన్నేళ్ల క్రితం చెరువును పూడ్చి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తేలింది. సబ్​కలెక్టర్​తో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు ఆ వ్యక్తి. తన ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని, అక్రమంగా కట్టిన తన ఇంటిని కూల్చేయాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఎహ​సాన్​. ఆ ఇంటిని తన ముత్తాత నిర్మించాడని, భూమి పత్రాలను పరిశీలించగా అది చెరువులో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. ఆ కారణంగానే ఇంటిని కూల్చేయాని ఎస్​డీఎమ్​ను కోరినట్లు చెప్పారు.

UP Bulldozer news
లేఖ రాసిన ఎహసాన్​

గ్రామస్థుల ఆందోళన: ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఎహసాన్​ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ ఇంటిని కూల్చితే తమ ఇళ్లు కూడా ప్రభుత్వ చర్యల పరిధిలోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్​ ఇల్లు కూడా చెరువు భూమిలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో తనపై దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఎహసాన్​. తనకు భద్రత కల్పించాలని లేదా బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను కోరారు.

UP Bulldozer news
ఎహసాన్​ ఇంటి వద్ద అధికారుల విచారణ

ఈ అంశంపై వివరాలు వెల్లడించారు సబ్​ కలెక్టర్​ అశోక్​ చౌదరి. 'మిత్రపుర్​ అరేలా ప్రాంతానికి చెందిన వ్యక్తి తన ఇంటిని కూల్చేయాలని కోరారు. ఈ క్రమంలో ఇంటి వివరాలపై విచారణ చేపట్టాం. భూ సర్వే చేయగా ఆ ఇల్లు చెరువులో నిర్మించినట్లు తెలిసింది. దాదాపు సగం ఊరు ఆ చెరువు శిఖంలోనే ఉంది. చెరువును పూడ్చేసి ఇళ్లు నిర్మించుకున్నారు.' అని పేర్కొన్నారు సబ్​కలెక్టర్

ఇదీ చూడండి: రేప్​ కేస్ నిందితుల ఇళ్లకు బుల్డోజర్లు- పరారీలో ఉన్నవారు గంటల్లోనే సరెండర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.