'ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పవార్​ను బెదిరిస్తారా?'

author img

By

Published : Jun 24, 2022, 12:19 PM IST

Union minister threatened Pawar... says Raut, BJP responds

మహారాష్ట్రలో రాజకీయం కాకపుట్టిస్తోంది. అఘాడీ ప్రభుత్వం కూలకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఎన్సీపీ అధినేత పవార్​పై ఓ కేంద్రమంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు శివసేన నేత సంజయ్ రౌత్‌ మండిపడ్డారు. ఇదే భాజపా పనితీరా? అని ప్రధాని మోదీ, అమిత్​ షాను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. శిందే క్యాంప్‌లో ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ కేంద్రమంత్రిపై శివసేన నేత సంజయ్ రౌత్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ఒక కేంద్రమంత్రి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను బెదిరించారని, అందుకు ప్రధాని మోదీ, భాజపా అగ్రనేత అమిత్‌ షా మద్దతు ఇస్తారా..? అని ప్రశ్నించారు. అలాగే శిందే వర్గాన్ని ఉద్దేశించి.. అలలు వస్తాయి, పోతాయని వ్యాఖ్యలు చేశారు.

'ఆయన మహారాష్ట్ర బిడ్డ. వారు ఆయన్ను బెదిరిస్తున్నారు. మోదీజీ, అమిత్‌ షా.. వీటి గురించి మీరు విన్నారా..? మీ మంత్రి పవార్‌ను బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు మీరు మద్దతు ఇస్తున్నారా..? మీ వైఖరేంటో మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మహావికాస్‌ ఆఘాడీని కాపాడేందుకు పవార్‌ ప్రయత్నిస్తే.. ఆయన్ను ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటామని ఆ మంత్రి బెదిరించారు. రోడ్డు మీద నిలువరిస్తామని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదే భాజపా పనితీరు అయితే.. అదే విషయాన్ని మీరే ప్రకటించండి. ప్రభుత్వం ఉండొచ్చు లేక పడిపోవచ్చు.. కానీ పవార్‌తో వ్యవహరించిన తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు' అంటూ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు.

అలాగే శిందే వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వారి సంఖ్య కేవలం కాగితంపైనే ఉందన్నారు. 'శివసేన ఒక సముద్రం. అలలు వస్తాయి. పోతాయి. నిబంధనలు అంటూ కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ఇది ఒక న్యాయపోరాటం. కొంతమంది 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఇంకొకరు ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఏ రూపంలో పోరాటం జరిగినా చివరకు గెలిచేది మేమే' అంటూ సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. అసమ్మతి ఎమ్మెల్యేలు 24గంటల్లోగా ముంబయికి తిరిగివస్తే..సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సంజయ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకు శివసేన నేత ఈ ప్రకటన చేశారని పవార్ అన్నారు. ఈ అనూహ్య పరిణామం మధ్య ఇరువురు నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు.

శిందే క్యాంప్‌లో 50మంది ఎమ్మెల్యేలు..!
శివసేన రెబల్‌ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా శిందే క్యాంప్‌లో చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. వారిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే అని శిందే ఓ అంగ్లవార్త సంస్థకు స్వయంగా వెల్లడించారు. 'మాపై నమ్మకం ఉన్నవారు చేతులు కలపొచ్చు. మేము బాలా సాహెబ్‌ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తాం.' అని పిలుపునిచ్చారు.

తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని శిందే ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వారు నిన్న చేసింది చట్టవ్యతిరేకం. వారికి ఆ హక్కు లేదు. మేము మెజార్టీ ఉన్నవాళ్లం. ప్రజాస్వామ్యంలో అంకెలు చాలా కీలకం. వారికి సస్పెండ్‌ చేసే హక్కు కూడా లేదు' అని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు.. ఏక్‌నాథ్‌ శిందేను తమ నాయకుడిగా పేర్కొంటూ గవర్నర్‌, డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లడం గమనార్హం.

కీలక సమయంలో బలప్రదర్శనకు కూడా శిందే వర్గం సిద్ధమవుతోంది. ఆ వర్గంలోని ఎమ్మెల్యే దీపక్‌ కేసర్కర్‌ మాట్లాడుతూ.. తాము అవసరమైన సమయంలో పార్టీ ఛైర్మన్‌ (ఏక్‌నాథ్‌) చెప్పినప్పుడు గవర్నర్‌ ఎదుట లేదా స్పీకర్‌ వద్ద బలప్రదర్శనకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉంటే తమను ఒత్తిడికి గురిచేసి లొంగదీసుకొనే వ్యూహాలు పన్నుతారనే గువాహటిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్న ఉద్ధవ్‌..
శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ జిల్లా అధ్యక్షులతో నేడు భేటీ కానున్నారు. మరో వైపు శిందే వర్గం ఇప్పటికే 400 మాజీ కార్పొరేటర్లతో భేటీ అయిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఈ నిర్ణయం తీసుకోన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీలు కూడా ఉద్ధవ్‌ నుంచి చేజారవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడేందుకు ఉద్ధవ్‌ జిల్లా అధ్యక్షులతో భేటీ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: 'మహారాష్ట్రలో శివసేన లేకుండా చేయాలని ఎన్సీపీ, కాంగ్రెస్ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.