'మహారాష్ట్రలో శివసేన లేకుండా చేయాలని ఎన్సీపీ, కాంగ్రెస్ కుట్ర'

author img

By

Published : Jun 24, 2022, 11:22 AM IST

Cong, NCP trying to eliminate Shiv Sena in Maharashtra: Rebel MLA Shirsat

ఉద్ధవ్​ ఠాక్రేకు వ్యతిరేకంగా శివసేన ఎమ్మెల్యేలు కూటమి కట్టడానికి దారి తీసిన పరిస్థితులను ఓ వీడియో ద్వారా వివరించారు ఆ పార్టీ తిరుగుబాటు నేత.. ఔరంగాబాద్ (పశ్చిమ) శాసన సభ్యుడు సంజయ్ శిర్సత్. శివసేనలో కీలక నేత ఆయన.. కాంగ్రెస్​, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీపై ( ఎన్సీపీ) కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఠాక్రే పట్టించుకోకపవడం వల్లే.. తాము ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు శిర్సత్. ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారు?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో.. పార్టీ చీఫ్​ ఉద్ధవ్​ ఠాక్రేకు వ్యతిరేకంగా ఎందుకు కూటమి కట్టాల్సి వచ్చిందో వెల్లడించారు శివసేన కీలక నేత, తిరుగుబాటు ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్​, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గుహవాటి ఫైవ్​స్టార్​ హోటల్​ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. మహారాష్ట్ర రాజకీయాల నుంచి శివసేనను దూరం చేయాలని కాంగ్రెస్​, ఎన్సీపీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తెలియజేయడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొన్నారు.

"వీడియో కాన్ఫరెన్స్​లో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగాన్ని చూశాం. ఆ స్థాయిలో సీఎం భావోద్వేగానికి లోనవుతారని అనుకోలేదు. మేము కూడా బాధపడ్డాం. తిరుగుబాటుకు దారి తీసిన కారణాలు చాలా ఉన్నాయి. ఇది ఒక్క రోజలో జరిగింది కాదు."

-సంజయ్ శిర్సత్, తిరుగుబాటు ఎమ్మెల్యే

అఘాడీ కూటమిలో చేరాక.. శివసేన మరింత దిగజారిపోయినట్లు చెప్పుకొచ్చారు సంజయ్ శిర్సత్. అందుకు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. స్థానిక ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పడిపోయినట్లు వీడియోలో వివరించారు. రెండో స్థానంలో ఎన్సీపీ, మూడోస్థానంలో కాంగ్రెస్​ ఉన్నట్లు వెల్లడించారు. శివసేనను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్​, ఎన్సీపీ ప్రయత్నిస్తున్నాయనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం అన్నారు.

నియోజకవర్గం స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు సంజయ్ శిర్సత్. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా తహసీల్దార్​ నుంచి ఇతర అధికారుల నియామకాలు జరిగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక విషయాలపై ఉద్ధవ్​జీకి చెప్పడానికి అనేక సార్లు తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ వెళ్లినా.. ఆయన కలవలేదని చెప్పారు.

" ఉద్ధవ్​ జీ.. మిమ్మల్ని కలవడానికి మేము చాలా సార్లు వచ్చాం. కానీ మీరు మాకు సమయం ఇవ్వలేదు. మేము చెప్పాలనుకున్న విషయాన్ని సెక్రటరీకి చెప్పి పంపేవాళ్లం. సందేశం సీఎంకు చేరిందని సెక్రటరీ.. మాకు చెప్పేవారు. రాజకీయాలు ఇలాగే చేస్తారా? ఉద్ధవ్​ జీ."

-సంజయ్ శిర్సత్, తిరుగుబాటు ఎమ్మెల్యే

ఒక్కో ఎమ్మెల్యే 50లేఖలు..
అంతకు ముందు శిర్సత్ రాసిన ఒక బహిరంగ లేఖను.. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే విడుదల చేశారు. అందులో కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు శిర్సత్​. 'సీఎం సెక్రటేరియట్‌లో ఉండేవారు కాదు. మాతోశ్రీలో (ఠాక్రే నివాసం) ఉండేవారు. మమ్మల్ని కలిసేవారు కాదు. రెండున్నరేళ్లుగా మేము విసిగిపోయాం. శివసేన ఎమ్మేల్యేలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఉద్ధవ్​ జీ.. మీ కార్యాలయానికి మా నుంచి ఎన్ని కాల్స్​, ఎన్ని లేఖలు వచ్చాయో ఒక సారి పరిశీలించండి. ఒక్కో శివసేన ఎమ్మెల్యే నుంచి.. కనీసం యాభై ఉత్తరాలైనా వచ్చి ఉంటాయి. ఆ లేఖలపై ఎలాంటి స్పందన లేదు. మాకు పనులు చేయడానికి నిధులు ఇవ్వనప్పుడు ఏం చేయాలి.

మా ఫిర్యాదులు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సంబంధిత నిధులకు సంబంధించిన సమస్యలు వినేందుకు మంత్రి ఏక్​నాథ్​ షిండే.. ఇంటి తలుపులు మాకు ఎప్పుడూ తెరిచే ఉండేవి. అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మేమే ఏక్‌నాథ్​ను ఒప్పించాం.' అని లేఖలో పేర్కొన్నారు శిర్సత్.

ఇదీ చదవండి: విషం తాగి అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నం.. పోలీసుల తీరే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.