ETV Bharat / bharat

ఇద్దరు చిన్నారుల్ని 'బలి' ఇచ్చిన పెదనాన్న- 'ఎగ్జామ్ ఫెయిల్' భయంతో నాన్న హత్య!

author img

By

Published : Apr 7, 2022, 10:28 AM IST

balaghat human sacrifice
ఇద్దరు చిన్నారుల్ని 'బలి' ఇచ్చిన పెదనాన్న- క్షుద్రపూజలు చేసి..!

తమ్ముడి కుమార్తెలు ఇద్దరిని ఘోరంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఐదేళ్లు, మూడేళ్లు వయసున్న చిన్నారుల్ని చంపి.. కాల్వలో పడేశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తి.. ఆ బాధ నుంచి విముక్తి కోసం ఇద్దరు బాలికల్ని నరబలి ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ బాలాఘాట్​లో జరిగింది. గుణాలో జరిగిన మరో ఘటనలో తండ్రినే చంపేశాడు 15 ఏళ్ల బాలుడు.

ఇద్దరు చిన్నారుల్ని సొంత పెదనాన్నే మూఢనమ్మకాలతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్​ బాలాఘాట్ జిల్లాలో జరిగింది. క్షుద్రపూజల్లో భాగంగా బాలికలను అతడు బలి ఇచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

అలా చేస్తే తన బాధలు పోతాయని...: పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు గిర్​ధారీ సోన్​వానే.. బాలాఘాట్​ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని మహకేపుర్​ గ్రామవాసి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన కష్టాలకు ఎవరో క్షుద్రపూజలు చేయడమే కారణమన్నది అతడి నమ్మకం. అందుకే ఎప్పుడూ రకరాల పూజలు చేస్తుండేవాడు. కొంతకాలంగా కుటుంబానికీ దూరంగా ఉంటున్నాడు.

సోమవారం ఉదయం అనూహ్యంగా తన సోదరుడి ఇంటికి వచ్చాడు గిర్​ధారీ. ఎవరూ చూడకుండా.. తమ్ముడి కుమార్తెలు (ఒకరి వయసు ఐదేళ్లు, మరొకరి వయసు మూడేళ్లు) ఇద్దరినీ బైక్​పై ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు.. పిల్లల కోసం ఊరంతా వెతికారు. సాయంత్రానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయానికి.. గిర్​ధారీ బైక్​పై బాలికల్ని తీసుకెళ్లడం చూశామని గ్రామస్థులు కొందరు చెప్పారు. ఆ కోణంలో దర్యాప్తు సాగించిన పోలీసులు.. చివరకు ఇద్దరి మృతదేహాలను ఓ కాలువలో గుర్తించారు.

balaghat human sacrifice
ఇద్దరు చిన్నారుల్ని 'బలి' ఇచ్చిన పెదనాన్న- క్షుద్రపూజలు చేసి..!

గిర్​ధారీ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. క్షుద్రపూజలకు ఉపయోగించే సామగ్రిని గుర్తించారు. ఆ పూజల్లో భాగంగానే చిన్నారులు ఇద్దరినీ బలి ఇచ్చి ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పిల్లల మృతితో వారి కుటుంబం సహా ఊరంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

భయంతో నాన్ననే చంపేసిన బాలుడు: మరోవైపు.. మధ్యప్రదేశ్​ గుణాలో నిద్రపోతున్న తండ్రిని నరికి చంపేశాడు 15 ఏళ్ల బాలుడు. పదో తరగతి ఫెయిలైతే తనను తండ్రి తిడతాడన్న భయంతో ఈ పని చేశాడు. ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. తొలుత.. తన పక్కింటి వ్యక్తే మరొకరి సాయంతో ఈ హత్య చేశాడని, వారు పారిపోతుంటే చూశానని పోలీసులకు చెప్పాడు ఆ బాలుడు. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించారు. అయితే.. ఫోరెన్సిక్ విచారణలో లభించిన ఆధారాలను బట్టి వారికి మృతుడి కుమారుడిపైనే అనుమానం వచ్చింది. ఆ బాలుడ్ని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. ఏడ్చుకుంటూ నేరం ఒప్పుకున్నాడు. సరిగా చదవలేదని, పరీక్షల్లో ఫెయిల్​ అవుతానన్న భయంతోనే ఇలా చేశానని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.