ETV Bharat / bharat

చెరువులో ట్రాక్టర్ బోల్తా.. 10 మంది మృతి.. గుడికి వెళ్తుంటే...

author img

By

Published : Sep 26, 2022, 2:57 PM IST

Updated : Sep 26, 2022, 4:07 PM IST

tractor-trolley-overturned
tractor-trolley-overturned

గుడికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి, చెరువులో పడిపోయిన ఘటనలో 10 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ జిల్లాలో సోమవారం జరిగింది. ఇదే రాష్ట్రంలోని ముజఫర్​నగర్​లో జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. హిమాచల్​ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది గాయపడ్డారు. లఖ్​నవూ జిల్లా అసన్హా ప్రాంతంలో సోమవారం జరిగిందీ దుర్ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు 47 మంది కలిసి ట్రాక్టర్​లో గుడికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాక్టర్​ అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెరువులో పడిపోయింది. బాధితుల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు.. హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

tractor-trolley-overturned
ట్రాక్టర్ బోల్తా

మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మిగిలిన వారిని స్థానికులు రక్షించారు. గాయపడ్డ వారిని మందిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

tractor-trolley-overturned
సహాయక చర్యలు

డివైడర్​ను ఢీకొట్టి...
మరోవైపు, ముజఫర్​నగర్​ సమీపంలోని దిల్లీ-దెహ్రాదూన్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. ఓ కారు డివైడర్​ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అందులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ కుల్దీప్ మిశ్ర(30), మనీశ్ సింఘాల్(26), అమన్ గౌతమ్(25), మరో యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ మిశ్ర మీరట్​లో పనిచేసేవారని వివరించారు.

కుటుంబంలో విషాదం
హిమాచల్​ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మైనర్లు ఉన్నారు. సిర్మౌర్ జిల్లాలోని ఖిజ్​వాడీ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి తరువాత ఈ ఘటన జరిగింది. మమత(27), ఆమె కూతుళ్లు ఆరంగ్(2), అమీషా(6), ఇషిత(8), మేనకోడలు అకాంశిక(7) అక్కడికక్కడే చనిపోయారని అధికారులు తెలిపారు. మమత భర్తకు గాయాలయ్యాయని, ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు.

Last Updated :Sep 26, 2022, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.