ETV Bharat / bharat

టైమ్‌ మ్యాగజైన్‌పై 'మహిళా రైతులు'

author img

By

Published : Mar 6, 2021, 6:39 AM IST

నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతోన్న మహిళా రైతుల ఫొటోలను ప్రఖ్యాత టైమ్​ మ్యాగజైన్​ ప్రచురించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ సంచిక కవర్​ పేజీని ట్విట్టర్​లో విడుదల చేసింది.

time-magazine-covers-women-at-farmer-protest-in-india
టైమ్‌ మ్యాగజైన్‌పై 'మహిళా రైతులు'

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫొటోతో ఉన్న ఈ సంచిక కవర్‌పేజీని ఆ పత్రిక నేడు ట్విట్టర్‌లో విడుదల చేసింది. 'నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు' అనే శీర్షికతో టైమ్‌ ఈ కథనం ప్రచురించింది.

లింగ వివక్షకు వ్యతిరేకంగా..

ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా.. ముందుండి నడిపిస్తున్న పంజాబ్‌, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్‌కు చెందిన మహిళా రైతుల అనుభవాలు, బాధలను ఈ కవర్‌స్టోరీలో రాసుకొచ్చింది. నూతన సాగు చట్టాలపై మాత్రమే కాకుండా.. పితృస్వామ్యం, స్త్రీహత్య, లైంగిక హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఈ మహిళలు పోరాటం సాగిస్తున్నారని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది.

మహిళా కిసాన్​ దివస్..

కేంద్రం తీసుకొచ్చిన సూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత 100 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనేక మంది మహిళలు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వెన్నుచూపకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 'మహిళా కిసాన్‌ దివస్‌'గా నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు.

అన్నదాతల ఉద్యమానికి ఇప్పటికే అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం అప్పట్లో దుమారం రేపింది.

ఇదీ చదవండి: 100వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.