ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ్బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ విమర్శనాస్త్రాలు సంధించుకోగా.. తాజాగా యూపీ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించడంపై దీదీ మండిపడ్డారు. కరోనా వైరస్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా కట్టడి చేయగలిగిందంటూ ప్రధాని కితాబివ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. అంత అద్భుతంగా కట్టడి చేసినట్లయితే..గంగా నదిలో మృతదేహాలు ఎద్దుకు కొట్టుకొచ్చాయని ప్రశ్నించారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో గురువారం పర్యటించిన సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అభినందించారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తి కట్టడిలో యూపీ ప్రభుత్వం సఫలీకృతమైందని కొనియాడారు.
"కేవలం భాజపా పాలిత రాష్ట్రమైనందువల్లే ప్రధాని మోదీ యూపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చేశారు. బంగాల్ ప్రభుత్వం కూడా కొవిడ్ కట్టడికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. అందుకే గంగానదిలో నదిలో శవాలు తేలినట్లుగా ఇక్కడ తేలలేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొవిడ్ రెండో దశ వ్యాప్తిని ఎదుర్కోలేక పూర్తిగా విఫలమైంది"
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
యూపీ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించడంపై తృణమూల్ రాజ్యసభ ఎంపీ ఓబ్రియాన్ కూడా స్పందించారు. ఆయన జులై 15ని ఏప్రిల్ 1గా ఫీలయినట్లున్నారు అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:'బంగాల్ హింస' నివేదికపై మమత గుస్సా