ETV Bharat / bharat

ఆధారాల ధ్వంసంలో అవినాష్​ పాత్ర.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ

author img

By

Published : Mar 13, 2023, 2:25 PM IST

Updated : Mar 13, 2023, 7:32 PM IST

YS Viveka Murder Case: తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలంటూ వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. అవినాష్‌కు సంబంధించిన వివరాలను సీబీఐ సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించింది. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వొద్దని కోరింది. అయితే తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం.. తీర్పు వెల్లడించే వరకు అవినాష్‌ను అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఆదేశించింది.

అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

MP Avinash Reddy Petition: వివేకా హత్య కేసులో తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలంటూ వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై.. తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వెల్లడించే వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అవినాష్‌కు సంబంధించిన వివరాలను హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సీబీఐ సమర్పించింది. 10 డాక్యుమెంట్లు, 35 వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలు సీబీఐ సమర్పించింది.

అవినాష్‌ విచారణ ఆడియో, వీడియో రికార్డు చేస్తున్నామన్న సీబీఐ.. సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్​ పాత్ర ఉందని పేర్కొంది. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. సీబీఐ ఆఫీసు వద్ద అవినాష్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు జరుగుతుండగా సీబీఐ ఆఫీస్‌ వద్దే ప్రెస్‌మీట్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది.

రేపు సీబీఐ విచారణకు హాజరుకాకుండా అనుమతివ్వాలని అవినాష్‌ కోర్టును కోరారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున గైర్హాజరుకు అనుమతివ్వాలని అవినాష్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే సీబీఐనే కోరాలని అవినాష్‌కు హైకోర్టు సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది సీబీఐ. ఈ వివేకా హత్య కేసులో నిజనిజాలే లక్ష్యంగా సీబీఐ వ్యవహరిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ శుక్రవారం (రేపు) ఉదయం 11 గంటలకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

సీబీఐకి లేఖ: పార్లమెంటు సమావేశాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని ఎంపీ అవినాష్​ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. పార్లమెంట్​ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు విన్నవించగా.. సీబీఐనే కోరాలని కోర్టు సూచించింది. దీంతో అవినాష్​రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీనిపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

అవినాష్​ పిటిషన్​లో పేర్కొన్న అంశాలు.. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేయలేదు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించ లేదు. దస్తగిరి అక్కడ.. ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని, నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్‌ రెడ్డి అన్నారు. వివేకా హత్యకేసులో దర్యాప్తు అధికారి పని తీరు పక్షపాతంగా ఉందని, వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని.. అదే కోణంలో విచారణ చేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాష్‌ రెడ్డి పిటిషన్‌లో వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 13, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.