ETV Bharat / bharat

'సాగు చట్టాల రద్దు' బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

author img

By

Published : Nov 29, 2021, 12:36 PM IST

Updated : Nov 29, 2021, 3:39 PM IST

Parliament winter sessions
వ్యవసాయ శాఖ మంత్రి తోమర్​

విపక్షాల ఆందోళనల మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటు ద్వారా ముందుగా లోక్​సభలో ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు.. 12మంది రాజ్యసభ సభ్యులపై వేటు పడింది.

సాగు చట్టాల రద్దు బిల్లు- 2021కి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.

రోజు మొత్తం మీద విపక్షాల నిరసనలతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. పరిస్థితిలో మార్పులేకపోవడం వల్ల చివరికి మంగళవారానికి వాయిదా వేశారు.

లోక్​సభలో..

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు(Parliament winter sessions) ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్​సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్​ ఓం బిర్లా. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​.

ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ(Parliament winter sessions) విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) లోక్​సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్​ను తిరస్కరించిన స్పీకర్​ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం విపక్షాల ఆందోళనలు కొనసాగటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా పడింది.

తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించటం వల్ల సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

రాజ్యసభలో..

రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సమయానే గంట సేపు వాయిదా పండింది. విపక్షాల ఆందోళనలు సహా ఇటీవల మృతి చెందిన ప్రస్తుత సభ్యుడు ఆస్కార్​ ఫెర్నాండెజ్​పై గౌరవ సూచకంగా ఛైర్మన్​ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12.20 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. దీంతో సభ మరోసారి మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

సభ తిరిగి ప్రారంభం కాగానే.. సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. అందుకు అంగీకరించకపోవటం వల్ల ఆందోళనకు చేపట్టాయి. విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు వైస్​ ఛైర్మన్​. సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా మరోమారు అర్ధగంటపాటు వాయిదా పడింది.

తిరిగి ప్రారంభమైన క్రమంలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. పలు అంశాలపై కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. అనంతరం విపక్షాల ఆందోళనల కొనసాగింపుతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.

12 మందిపై వేటు..

12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు వేశారు ఛైర్మన్​. సభలో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్​ నుంచి ఫులో దేవి నేతమ్​, ఛయా వర్మ, ఆర్​ బోరా, రాజమణి పటేల్​, సైయద్​ నాసిర్​ హుస్సేన్​, అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్​, సీపీఎం నేత ఎలమరమ్​ కరీమ్​, సీపీఐ నేత బినోయ్​ విస్వమ్​, టీఎంసీ నేతలు దోలా సెన్​, శాంట ఛెత్రి, శివసేనా నుంచి ప్రియాంక ఛతుర్వేది, అనిల్​ దేశాయ్​లపై వేటు పడింది. వీరంతా మిగిలిన సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

కాంగ్రెస్​ ఆందోళన..

పార్లమెంట్​ సమావేశాల ప్రారంభానికి(Parliament winter sessions news) ముందు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగింది కాంగ్రెస్​. పార్లమెంట్​ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాసేపు నిరసన తెలిపారు ఆ పార్టీ ఎంపీలు. రాహుల్​ గాంధీ, సోనియా గాంధీ సహా కీలక నేతలు పాల్గొన్నారు.

ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాం..

పార్లమెంట్​ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్వాతంత్ర్యం, ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంట్​లో చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతు బలంగా ఉన్నా.. అది పార్లమెంట్​, సభాపతుల గౌరవాన్ని కాపాడేలా ఉండాలని సూచించారు.

సమావేశాల ప్రారంభానికి కొద్ద సమయం ముందు సీనియర్​ కేబినెట్​ మంత్రులతో సమావేశమయ్యారు మోదీ. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, హోంమంత్రి అమిత్​ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, పార్లమెంట్​ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషీ పాల్గొన్నారు.

మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్​పై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు మోదీ. గరీబ్​ కల్యాణ్​ యోజనను 2022, మార్చి వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్​ అందించిన్నట్లు చెప్పారు. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

Last Updated :Nov 29, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.