ETV Bharat / bharat

15 రోజుల్లో 16 మంది అనుమానాస్పద మృతి!

author img

By

Published : Jul 17, 2021, 10:48 AM IST

bihar 16 death
అనుమానాస్పద మృతి

బిహార్​లో 16 మంది అనుమానాస్పద రీతిలో మరణించారు. కల్తీ మద్యం వల్లే వీరు చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

బిహార్​లోని పశ్చిమ చంపారన్​లో అనుమానాస్పద మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బెతియా పట్టణంలోని లౌరియా గ్రామంలో 15 రోజుల వ్యవధిలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కల్తీ మద్యం వల్లే వీరంతా చనిపోయారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది మూడ్రోజుల క్రితమే మరణించారు.

కల్తీ మద్యమే దీనికి కారణమని మృతిచెందిన నలుగురి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇద్దరు మాత్రం దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు తెలుస్తోంది. మిగిలిన పది మంది మరణానికి కల్తీ మద్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు, కల్తీ మద్యం వల్ల అస్వస్థతకు గురై ముంతాజ్ మియాన్(36) అనే వ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. అతని సోదరుడి ఫిర్యాదు మేరకు గ్రామంలోని థగ్ షా అనే మద్యం వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశామని, మరో నలుగురిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

bihar police
లౌరియా గ్రామంలో పోలీసులు

ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం లౌరియాకు చేరుకుంది. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ, అదనపు కలెక్టర్.. ఇతర ఇంఛార్జి అధికారులు లౌరియాలోనే మకాం వేశారు. పరిస్థితిని అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

police vehicles
గ్రామంలో పోలీసుల వాహనాలు
bihar
యువకుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు

'విచ్చలవిడిగా వ్యాపారం'

కాగా, ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం నితీశ్ కుమార్ హయాంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ తివారీ ధ్వజమెత్తారు. బెతియాలో మరణాలకు కారణం ఇదేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ చౌరాసియా సైతం సర్కారుపై విమర్శలు గుప్పించారు. పరిస్థితులను చక్కదిద్దకపోతే.. ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.