Supreme Court On Bihar Caste Census : బిహార్లో నీతిశ్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు సంబంధించి తదుపరి వివరాలను ప్రచురించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు జారీచేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కులగణన సర్వే వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘిస్తోందని, దీనిపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషిన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి సెన్సెస్ డేటాను వెల్లడించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. పైగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం సరికాదని తెలిపింది. విధాన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం తప్పు అని పేర్కొంది. అయితే విచారణ సందర్భంగా కులగణన డేటాను ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది? అని నీతీశ్ సర్కార్ను సుప్రీం ప్రశ్నించింది.
విధాన రూపకల్పనకు కులగణన డేటా ఎంత అవసరమో పట్నా హైకోర్టు ఉత్తర్వుల్లో సవివరంగా స్పష్టం చేసిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లకు తెలియజేసింది. కాగా, కులగణన కోసం బిహార్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఏక్ సోచ్ ఏక్ పర్యాస్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు నలందాకు చెందిన అఖిలేష్ కుమార్ సహా పలువురు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఇక ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 2024 జనవరికి జాబితా చేసింది బెంచ్.
కులగణన సర్వే ఫలితాలను బిహార్ ప్రభుత్వం ఆక్టోబర్ 2న విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం రాష్ట్రంలో 13.07 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు ఉన్నట్లు తెలిపింది. 27 శాతం(మూడున్నర కోట్లు) ఓబీసీలు ఉన్నట్లు పేర్కొంది. 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీలు, ఓసీలు 15.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక రాష్ట్ర జనాభాలో హిందువులు 81.99 శాతం ఉండగా.. ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలకు చెందినవారు ఒక శాతంలోపే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
Caste Census In Bihar : కుల గణన చేపట్టడం ద్వారా రాష్ట్రంలోని వివిధ కులాల అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం అందుబాటులో ఉంటుందన్న అంచనాలతో బిహార్ ముఖమంత్రి నీతీశ్ కుమార్ ఈ ఏడాది జనవరి 7న సర్వే ప్రక్రియను ప్రారంభించారు. 2.9 కోట్ల కుటుంబాల్లోని 12.7 కోట్ల మంది వివరాలను ఆఫ్లైన్ ద్వారా, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందుపర్చేందుకు బిహార్ ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
బిహార్లో కుల గణనకు మార్గం సుగమం.. ఆ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు
Bihar Caste Census Supreme Court : 'కులగణన అధికారం కేంద్రానిదే! రాష్ట్రాలకు సంబంధం లేదు'