ETV Bharat / bharat

కల్తీ మద్యం కాటు.. ఆ పార్టీ నేత​ సహా 19 మంది బలి

author img

By

Published : Mar 20, 2022, 3:16 PM IST

Updated : Mar 20, 2022, 7:51 PM IST

spurious liquor
కల్తీ మద్యం కాటు

Spurious liquor Bihar: కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటన మరోమారు బిహార్​లో కలకలం సృష్టించింది. గత నాలుగైదు రోజుల్లోనే ఓ ఎల్​జేపీ బ్లాక్​ అధ్యక్షుడు సహా మొత్తం 19 మంది మృతి చెందారు. భాగల్​పుర్​, బాంకా, మధేపురా జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. కల్తీ మద్యం కారణంగానే తమవారు మృతి చెందారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు.

Spurious liquor Bihar: బిహార్​లో మరోమారు కల్తీ మద్యం కలకలం సృష్టించింది. లిక్కర్​ బ్యాన్​ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ మద్యం విక్రయాలు ఆగటం లేదు. ఆ మద్యం సేవించి అమాయకులు బలవుతున్నారు. బిహార్​లోని భాగల్​పుర్​, బాంకా, మధేపురా జిల్లాల్లో తాజాగా మరో 19 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందారు. కల్తీ మద్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భాగల్​పుర్​, బంకా జిల్లాల్లో..

భాగల్​పుర్​ జిల్లాలోని యూనివర్సిటీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనికి కల్తీ మద్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. పోస్ట్​మార్టం తర్వాత అసలు కారణం తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీపై దాడులు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని నారాయణ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గ్రామాల్లో మరో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా భాగల్​పుర్​ జిల్లాలో 8 మంది మృతి చెందారు.

బాంకా జిల్లాలో గత నాలుగైదు రోజుల్లో ఎనిమిది మంది మరణించారు. అయితే, కల్తీ మద్యం మరణాలుగా జిల్లా యంత్రాంగం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఎల్​జేపీ లీడర్​ సహా ముగ్గురు..

మెధేపురా జిల్లా, ముర్లిగంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని డిగ్గి గ్రామంలో కల్తీ మద్యం తాగి లోక్​ జనశక్తి పార్టీ బ్లాక్​ అధ్యక్షుడు సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, స్థానిక యంత్రాంగం ఎలాంటి ప్రకటన చేయలేదు. గత గురువారం గ్రామంలో మందు పార్టీ జరిగింది. ఆ మరుసటి రోజున పార్టీలో పాల్గొన్నవారు అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు మృతి చెందారు. మృతులు.. పురాకి సింగ్​(32), ఎల్​జేపీ బ్లాక్​ అధ్యక్షుడు నీరజ్​ నిశాంత్​ సింగ్​ బావూ, సంజీవ్​ కుమార్​ రమణి(25)గా గుర్తించారు.

3 లక్షలకుపైగా కేసులు​..

రాష్ట్రంలో మద్య నిషేధాన్ని 2016లో అమలు చేసింది బిహార్​ ప్రభుత్వం. మద్యం తయారీ, విక్రయం, సేవించటం నేరం. తొలినాళ్లలో నేరానికి పాల్పడితే ఆస్తుల స్వాధీనం, జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేశారు. అయితే, 2018లో లిక్కర్​ బ్యాన్​ చట్టానికి సవరణలు చేశారు. శిక్షల్లో ఉపశమనం కల్పించారు. 2016 నుంచి ఇప్పటి వరకు 3లక్షలకుపైగా నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు

Last Updated :Mar 20, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.