ETV Bharat / bharat

'కశ్మీర్ ప్రత్యేక దేశం' వ్యాఖ్యలపై రగడ- ఇరకాటంలో సిద్ధూ!

author img

By

Published : Aug 24, 2021, 5:22 AM IST

కశ్మీర్ ప్రత్యేక దేశం అంటూ పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్​లోని కీలక నేతలే సలహాదారుల వ్యాఖ్యల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక, ఈ వ్యవహారంపై మండిపడిన భాజపా.. సిద్ధూ నుంచే ఆయన సలహాదారులు ప్రేరణ పొందారా అని ఎద్దేవా చేసింది. ఘటనపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేసింది.

kashmir sidhu aides' remarks
'కశ్మీర్ ప్రత్యేక దేశం' వ్యాఖ్యలపై రగడ

జమ్ముకశ్మీర్‌ విషయంలో పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ(Navjot Singh Sidhu) సలహాదారులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కశ్మీర్‌ ప్రత్యేక దేశమంటూ(Sidhu advisers remarks on Kashmir) సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీలోనూ పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్ ఏంటంటే?

ఆర్టికల్ 370 గురించి మాట్లాడిన సిద్ధూ సలహాదారు మల్విందర్ సింగ్ మాలి(Malvinder Singh Mali).. ప్రత్యేక హోదా నిబంధన అవసరమే లేదని అన్నారు. 'కశ్మీర్ భారత్​లో అంతర్భాగమైతే.. ఆర్టికల్ 370, 35ఏ నిబంధనలు ఉండాల్సిన అవసరం ఏంటి? కశ్మీరీ ప్రజల దేశమే కశ్మీర్' అంటూ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరో సలహాదారుడు ప్యారేలాల్ గార్గ్(Pyare Lal Garg controversial remarks).. పాకిస్థాన్​పై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ విమర్శలు చేయడాన్ని ప్రశ్నించారు. దీనిపై వివాదం చెలరేగుతోంది.

కాంగ్రెస్​లో స్థానం అవసరమా?

భారత్‌లో జమ్ముకశ్మీర్‌ భాగం కాదనేవారు, పాకిస్థాన్ అనుకూల ధోరణి ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్ తివారీ(Manish Tewari) సూచించారు. అలాంటి వారికి పంజాబ్ పీసీసీలో స్థానం అవసరమా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌(Harish Rawat)ను కోరుతూ మనీశ్‌ తివారీ ట్వీట్‌ చేశారు.

కెప్టెన్ సీరియస్!

అంతకుముందు సీఎం కెప్టెన్ అమరిందర్‌ సింగ్‌(Amarinder Singh) ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధూ సలహాదారులు మల్విందర్‌సింగ్‌, ప్యారేలాల్‌ గార్గ్‌ వ్యాఖ్యలు దేశ శాంతి, సామరస్యతకు భంగం కలిగేలా ఉన్నాయని అమరిందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని నియంత్రించాలని సిద్ధూకు సూచించారు.

రాహుల్ మాట్లాడరా?

సిద్ధూ సలహాదారుల వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. దీనిపై రాహుల్‌గాంధీ స్పందించాలని డిమాండ్‌ చేసింది. 2019లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభించినపుడు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై సిద్ధూ ప్రశంసలు కురిపించిన వీడియోను... కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సిద్ధూ నుంచే ఆయన సలహాదారులు ప్రేరణ పొందారా అని ప్రశ్నించారు.

మల్విందర్‌ మాలీ, ప్యారేలాల్‌ గార్గ్‌ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ వద్ద సమాధానాలున్నాయా అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ప్రశ్నించారు.

వివాదం ముదరడం వల్ల దీనిపై చర్చించేందుకు తన నివాసానికి రావాలని సలహాదారులను సిద్ధూ పిలిచారు. వారితో భేటీ అయినప్పటికీ.. ఈ వ్యవహారంపై సిద్ధూ బహిరంగంగా మాట్లాడలేదు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.