సత్యపాల్​ మాలిక్ సహాయకుడి ఇంట్లో సీబీఐ సోదాలు.. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో..

author img

By

Published : May 17, 2023, 11:06 AM IST

Updated : May 17, 2023, 12:28 PM IST

satya pal malik cbi raid
satya pal malik cbi raid ()

Satya Pal Malik CBI Raid : బీమా కుంభకోణం కేసులో సీబీఐ జోరు పెంచింది. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్​ మాజీ సహాయకుడి ఇల్లు సహా దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మరోవైపు.. ఆరు రాష్ట్రాల్లోని వందకుపైగా ప్రాంతాల్లో పెద్దఎత్తున దాడులు జరుపుతోంది ఎన్​ఐఏ. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్‌, గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తోంది.

Satya Pal Malik CBI Raid : బీమా కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్​ మాజీ సహాయకుడి ఇల్లు సహా దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. బుధవారం ఉదయం నుంచే మాలిక్ మాజీ సహాయకుడి నివాసం, ఇతర ప్రదేశాల్లో దాడులు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. బీమా కుంభకోణం కేసులో ఏప్రిల్ 28న సత్యపాల్​ మాలిక్ సీబీఐ ప్రశ్నించింది. తాజాగా ఆయన సహాయకుడి ఇంట్లో దాడులు జరగడం గమనార్హం.

మాలిక్ స్పందన..
మరోవైపు.. తన మాజీ సహాయకుడి నివాసంపై సీబీఐ దాడుల జరపడంపై జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. బీమా కుంభకోణం కేసులో ఫిర్యాదుదారుడైన తనను వేధించడం దురదృష్టకరం అని అన్నారు. సునక్​ బాలి.. జీతం తీసుకోకుండానే జమ్ముకశ్మీర్​లో తన వద్ద సెక్రటరీగా పనిచేశారని మాలిక్ వెల్లడించారు.

Satya Pal Malik Political Career : సత్యపాల్ మాలిక్​ జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఆర్టికల్‌ 370 రద్దైంది. సత్యపాల్‌ మాలిక్‌ జమ్ముకశ్మీర్‌తో పాటు మేఘాలయా, గోవా గవర్నర్‌గానూ సేవలందించారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సమయంలో సత్యపాల్‌ మాలిక్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఆ చారిత్రక నిర్ణయం జరిగిన నెల రోజులకు ఆయన గోవా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. అక్టోబర్‌ 2022 వరకు ఆయన మేఘాలయ గవర్నర్‌గా సేవలందించారు.

ఇదీ కేసు..
Satya Pal Malik Insurance Case : సత్యపాల్‌ మాలిక్‌ 2018లో జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన వైద్య బీమా పథకంతోపాటు కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో సివిల్ వర్క్ కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు సత్యపాలిక్​ మాలిక్​కు​ రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని సీబీఐ పేర్కొంది. వీటిపై గతేడాది ఏప్రిల్‌లో సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది.

ఎన్ఐఏ సోదాలు..
మరోవైపు.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) బుధవారం ఆరు రాష్ట్రాల్లోని వందకుపైగా ప్రాంతాల్లో పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల స్మగ్లర్ల మధ్య లింకుల విషయంలో ఈ సోదాలు జరుపుతోంది. హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్​ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లోని పోలీసుల సహకారంతో.. అనుమానితుల నివాసాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే దాడులు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. గతేడాది ఎన్​ఐఏ నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Last Updated :May 17, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.