ETV Bharat / bharat

'జగన్​కు సాయపడే బదులు నేను ఆ పని చేయాల్సింది!'

author img

By

Published : Oct 30, 2022, 6:56 PM IST

Prashant Kishor on RSS
Prashant Kishor on RSS `

జగన్ మోహన్​ రెడ్డి, నీతీశ్​ కుమార్ వంటి వారు తమ లక్ష్యాల్ని నెరవేర్చుకునేందుకు సాయపడడం కన్నా.. కాంగ్రెస్​ పునరుజ్జీవానికి తాను కృషి చేసుంటే బాగుండేదని అన్నారు ప్రశాంత్ కిశోర్. గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే అదొక్కటే మార్గమని వ్యాఖ్యానించారు.

మహాత్మ గాంధీ 'కాంగ్రెస్​'కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని అన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్. నీతీశ్ కుమార్, జగన్​ మోహన్ రెడ్డి వంటి వారికి తమ లక్ష్యాల్ని సాధించేందుకు సాయపడడం కన్నా కాంగ్రెస్​ పునరుజ్జీవం కోసం పని చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బిహార్​లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే.. పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమలదళం విజయయాత్రను అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై ప్రశాంత్ కిశోర్ అనుమానాలు వ్యక్తం చేశారు. భాజపాను అర్థం చేసుకోలేనిదే ఆ పార్టీని ఓడించలేరంటూ తనదైన శైలిలో విశ్లేషించారు. "మీరు ఎప్పుడైనా కాఫీ కప్పును చూశారా? పైనంతా నురగ ఉంటుంది. భాజపా అలాంటిదే. కింద భాగంలో.. వేళ్లూనుకున్న ఆర్​ఎస్​ఎస్​ ఉంటుంది. సామాజిక వ్యవస్థలో రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్ భాగమైపోయింది. షార్ట్​కట్స్​తో దానిని ఓడించలేరు. గాడ్సే సిద్ధాంతాన్ని.. గాంధీజీ కాంగ్రెస్​కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే జయించగలం" అంటూ మహాత్ముడ్ని చంపిన గాడ్సేకు, ఆర్​ఎస్​ఎస్​కు సంబంధం ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు పీకే.

కాంగ్రెస్​ను ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి ఆయన గతేడాదే కాంగ్రెస్​లో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఆ చర్చలు ఫలించలేదు. పీకే కాంగ్రెస్​లో చేరలేదు. కాంగ్రెస్​పై ఇప్పటికీ తనకు అభిమానం ఉందని.. కానీ మహాత్మ గాంధీ నేతృత్వంలోని పార్టీ తరహా పరిస్థితి ఉండాలని వ్యాఖ్యానించారు.

నీతీశ్​తో అందుకే కటీఫ్​..
బిహార్​ సీఎం నీతీశ్ కుమార్​పైనా విమర్శల దాడి కొనసాగించారు ప్రశాంత్ కిశోర్. "సీఏఏ-ఎన్​పీఆర్​-ఎన్​ఆర్​సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో నేను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. పార్లమెంటు పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ ఎంపీలు అనుకూలంగా ఓటేశారని తెలిసి చాలా బాధపడ్డా. ఇదే విషయంపై అప్పటి జాతీయ అధ్యక్షుడు నీతీశ్​ కుమార్​ను నిలదీశా. తాను ఏదో పర్యటనలో ఉన్నానని, ఏం జరిగిందో తెలియదని ఆయన చెప్పారు. బిహార్​లో ఎన్​ఆర్​సీ అమలు కానివ్వనని హామీ ఇచ్చారు. ఆయనతో నేను కలిసి పని చేయలేనని ఆ రెండు నాల్కల ధోరణి చూశాకే నాకు అర్థమైంది" అని చెప్పారు ప్రశాంత్ కిశోర్.

ఇవీ చదవండి: 'అధ్యక్ష తరహా పాలన వైపు దేశం.. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి'

'సైన్యానికి కొత్త శక్తి'.. సీ295 విమానాల తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.