ETV Bharat / bharat

బీజేపీ ట్విస్ట్​.. రాబర్ట్ వాద్రాకు క్లీన్​చిట్.. ​ఆ ల్యాండ్​ స్కామ్​​ జరగలేదట!

author img

By

Published : Apr 21, 2023, 7:46 AM IST

Updated : Apr 21, 2023, 11:48 AM IST

భూమి అమ్మకం విషయంలో రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ భూమిని.. డీఎల్​ఎఫ్​కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హరియాణా ప్రభుత్వం.. హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది.

robert-vadra-dlf-haryana-says-no-violation-in-robert-vadra-dlf-land-deal
రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ హరియాణా

2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అప్పటి ముఖ్యమంత్రితో కలిసి రాబర్ట్​ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ మాటమార్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకు.. అధికారంలోకి వచ్చాక క్లీన్​చిట్ ఇచ్చింది​. కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్​ వాద్రా ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. పంజాబ్ హరియాణా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాబక్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ల్యాండ్​ను, డీఎల్​ఎఫ్​కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హరియాణా ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ జరిగింది..
2007లో రాబర్ట్​ వాద్రా.. స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థను లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. ఆ తరువాత 2008లో గుర్గావ్‌లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు సుమారు 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మరుసటి రోజే ఆ భూమి స్కైలైట్ హాస్పిటాలిటీకి ముటేషన్ అయింది. కేవలం 24 గంటల్లోనే రాబర్ట్​ వాద్రాకు భూమి బదలాయింపు పక్రియ జరిగింది. ఈ ప్రకియ మొత్తం పూర్తి కావడానికి సాధారణంగా అయితే మూడు నెలల సమయం పడుతుంది.

అనంతరం నెల తరువాత అక్కడ భవనం నిర్మాణం చేసేందుకు.. అప్పటి భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. దీంతో ఆ భూమి విలువ అమాంతంగా పెరిగిపోయింది. డీఎల్​ఫ్ సంస్థ 2002 జూన్​లో​​ ఈ ప్లాట్‌ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కదుర్చుకుంది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే వాద్రా ఆస్తి విలువ దాదాపు 700% పెరిగింది. 2012 అక్టోబర్​లో అప్పటి డైరెక్టర్ జనరల్​, కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్-కమ్-ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్​గా ఉన్న అశోక్ ఖేమ్​కా.. ఈ మ్యుటేషన్‌ను రద్దు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు 2012 అక్టోబరు 11న ఖేమ్​కా బదిలీ అయ్యారు.

భూ ఒప్పందం మ్యుటేషన్‌ను రద్దు చేస్తూ ఖేమ్​కా ఇచ్చిన ఉత్తర్వులు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో దీనిపై విచారణ చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది హుడా ప్రభుత్వం. ముగ్గురు సీనియర్ ఐఏఎస్​ అధికారులైన కృష్ణ మోహన్, రాజన్ గుప్తా, కేకే జలాన్‌తో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ.. 2013 ఏప్రిల్​లో.. ప్రభుత్వానికి, వాద్రా, డీఎల్​ఎఫ్​కు క్లీన్​చిట్ ఇచ్చింది. ఐఏఎస్​ అధికారి ఖేమ్కా తనపై ఉన్న అధికారానికి మించి పనిచేశారని ఆరోపించింది. అనంతరం 2014లో అధికారంలోని వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. 2018లో వాద్రా, హుడాపై.. భూముల విషయంలో కేసు నమోదుచేసింది.

ఈ భూమి కొనుగోలుకు సంబంధించి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాబర్ట్ వాద్రా, ఇతరులపై.. గురుగ్రామ్ పోలీసులు 2018 సెప్టెంబర్​ 1న క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. భూ లావాదేవీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వాద్రా భూముల వ్యవహారాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీ ప్రచారం చేయడం గమనార్హం.

"స్కైలైట్ హాస్పిటాలిటీ DLF యూనివర్సల్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలను విక్రయించినట్లు మానేసర్ తహసీల్దార్ నివేదించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ లావాదేవీలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘన జరగలేదని తేలింది." అని పంజాబ్ హరియాణా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది.

2012 అక్టోబర్‌లో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్​కా వాద్రా భూ ఒప్పందానికి సంబంధించిన మ్యుటేషన్‌ను రద్దు చేయడాన్ని బీజేపీ ఆయుధంగా చేసుకుంది. ఇదే అంశంమే ప్రధానంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లింది. అనంతరం 90 స్థానాల్లో 47 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.

Last Updated : Apr 21, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.