ETV Bharat / bharat

'కేంద్రంతో మరోసారి చర్చలకు సిద్ధం.. కానీ'

author img

By

Published : May 24, 2021, 10:24 AM IST

Rakesh Tikait, Bharatiya Kisan Union leader
రాకేశ్​ టికాయిత్​, భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు

కొత్త సాగు చట్టాలపై కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయిత్​ తెలిపారు. అయితే.. అది కేంద్రం ఈ చట్టాలను వెనక్కి తీసుకునే అంశమే అయి ఉండాలని ఆయన నొక్కిచెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో మళ్లీ చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​ చెప్పారు. అయితే.. కేంద్రం ఈ చట్టాలను రద్దు చేసే అంశం గురించి మాత్రమే చర్చిస్తామని పునరుద్ఘాటించారాయన. ఇటీవల మృతిచెందిన అభయ్​ సింగ్​ సంధు(భగత్​సింగ్​ మేనల్లుడు) కుటుంబానికి సంతాపం తెలిపేందుకు మొహాలి(ఛత్తీస్​గఢ్​)కి వెళ్లిన ఆయన.. ఈ మేరకు అక్కడి విలేకర్లతో సంభాషించారు. కేంద్రం.. రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసన స్థలాల నుంచి స్వస్థాలకు తిరిగొచ్చే ప్రసక్తే లేదని టికాయిత్​ స్పష్టం చేశారు. కేంద్రం ఏదైనా మాట్లాడితే.. సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం)తోనే చర్చించాలన్నారు.

ఆ రోజున 'బ్లాక్​ డే'

అన్నదాతలు నిరసన చేపట్టి ఈ నెల 26 నాటికి ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా.. ఆ రోజున 'బ్లాక్​ డే'గా పాటించనున్నారు. అదే రోజున దేశవ్యాప్త నిరసన చేపట్టాలని ఎస్​కేఎం పిలుపునిచ్చింది. దానికి రైతు సంఘాలు మద్దతు తెలిపాయి.

కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ.. గతేడాది నవంబర్​ నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు అన్నదాతలు. వీటిపై కేంద్రం మళ్లీ చర్చలు జరపాలని కోరుతూ.. ఎస్​కేఎం అధ్వర్యంలో 40కిపైగా రైతు సంఘాలు గత శుక్రవారం.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశాయి.

కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిష్ఠంభనను తొలగించేందుకు.. కేంద్రం ఇప్పటికే రైతులతో పలుదఫాలుగా చర్చలు జరిపింది. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టడం వల్ల ఆ చర్చలు విఫలమయ్యాయి.

ఇదీ చదవండి: పాల డెయిరీల్లో నిర్వహణ లోపాలే శాపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.