ETV Bharat / bharat

రోగి కంటిని కొరికిన ఎలుక.. కుటుంబ సభ్యులదే బాధ్యత అని వైద్యుడి వాదన!

author img

By

Published : May 17, 2022, 9:40 PM IST

rat bite paralysed woman: రాజస్థాన్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. పక్షవాతంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళను ఎలుక కరవగా.. వైద్యుల స్పందనపై రోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు కుటుంబ సభ్యులది సైతం బాధ్యతే అని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు.

rat bite paralysed woman
rat bite paralysed woman

rat bite paralysed woman: రాజస్థాన్​లో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసినా.. నిర్వహణ మాత్రం అంతంతేనని తేటతెల్లమయ్యే ఘటన జరిగింది. కోటాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఎలుకలు కరిచాయి. ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.

వివరాల్లోకి వెళితే...: మహారావ్ భీమ్​సింగ్ వైద్య కళాశాలలో రూపవతి అనే ఓ మహిళా రోగి ఐసీయూలో చికిత్స పొందుతోంది. పక్షవాతం వ్యాధితో ఆమె ఆస్పత్రిలో చేరింది. శరీరంలోని ఏ భాగాన్నీ ఆమె స్వయంగా కదిలించలేదు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె కంటిని ఎలుక కొరికింది. ఆ సమయంలో ఆమె భర్త.. పక్కనే ఉన్నారు. కంటి నుంచి రక్తం కారడాన్ని గమనించిన రూపవతి భర్త.. వైద్యులను సంప్రదించాడు. రోగిని పరిశీలించిన వైద్యులు.. ఆమెకు చికిత్స అందించారు. అవసరమైతే కంటి సర్జరీ నిర్వహిస్తామని తెలిపారు.

rat-eats-up-paralysed-woman
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ

అయితే, అసలు ఎలుక కొరికిందో లేదో అన్న విషయంపై విచారణ జరుపుతున్నామని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సమీర్ టాండన్ చెప్పడం గమనార్హం. ఈ ఘటనకు కారకులు ఎవరన్నది దర్యాప్తు చేస్తామన్న ఆయన.. రోగి కుటుంబ సభ్యులు సైతం ఐసీయూలో ఉన్నారని.. వారు కూడా ఈ ఘటనకు బాధ్యులేనని వితండ వాదన చేశారు. వార్డు ఇంఛార్జి నుంచి నివేదిక కోరామని.. దాని ప్రకారం విచారణ జరుపుతామని చెప్పుకొచ్చారు.

rat-eats-up-paralysed-woman
ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగుల బంధువులు సైతం ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. ఐసీయూలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఎలుకలు తిరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఆస్పత్రిలో క్రిమిసంహారకాలు ఎప్పటికప్పుడు జల్లుతున్నామని సూపరింటెండెంట్ డా. నవీన్ సక్సేనా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పెంపుడు శునకంపై చిరుత దాడి.. కాపాడేందుకు యజమాని సాహసం

చేయని నేరానికి 12 ఏళ్లుగా జైల్లో.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.