మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అప్పటివరకు మనకు ఉన్న ఆలోచనా ధోరణినే మార్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అవే సంఘటనలు.. సాటి మనిషికి సాయపడాలని నేర్పిస్తాయి. హరియాణాలోని ఓ వ్యక్తి జీవితంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఆ విషాద ఘటన.. పేదల కోసం ఓ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పి ఉచిత సేవలు అందించేలా చేసింది. ఆయనే పానిపట్లోని నూర్వా కాలనీకి చెందిన రామ్స్వరూప్ చావ్లా. ఆయన నెలకొల్పిన ఆ మినీ ఆసుపత్రికి రోజూ దాదాపు 200 నుంచి 250 మంది చికిత్స కోసం వస్తుంటారు.
అలా నిర్మాణం..
కొన్నేళ్ల క్రితం.. విలియమ్స్ అనే వ్యాధితో రామ్స్వరూప్ కుమారుడు బాధపడేవాడు. ఆ సమయంలో ఆయన తన కుమారుడి చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు. అయినప్పటికీ.. ఫలితం దక్కలేదు. కుమారుడు మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకున్న అనంతరం.. తనలా మరెవరూ బాధపడుకూడదని నిర్ణయించుకున్నారు. శ్రీరామ్ దేవ్ సేవా దల్ సంస్థ సహకారంతో ఓ ఉచిత వైద్య చికిత్స కేంద్రాన్ని పదేళ్ల క్రితం ఆయన స్థాపించారు. ఇప్పటికీ ఆ సంస్థకు చెందిన దాదాపు 95మంది.. ఈ ఆరోగ్య కేంద్రానికి ప్రతినెలా రూ.500 విరాళం ఇస్తున్నారు. ఈ మినీ ఆసుపత్రిలో నిత్యం ఇద్దరు వైద్యులు సేవలు అందిస్తున్నారు.
బయట ఆసుపత్రులకు వెళ్తే.. వేలల్లో ఖర్చు అవతుండగా ఈ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా వైద్య సేవలు అందుతుండటం పట్ల స్థానికులు ఎంతో సంతోషిస్తున్నారు.