ETV Bharat / bharat

పార్లమెంటులో మళ్లీ అదే సీన్- వెంకయ్య ఆందోళన

author img

By

Published : Jul 27, 2021, 7:04 PM IST

Parliament
పార్లమెంట్​

పార్లమెంటు ఉభయ సభల్లోనూ పెగాసస్​ వ్యవహారం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. అయితే ఈ గందరగోళం మధ్యే మెరైన్‌ ఎయిడ్స్‌ టు నావిగేషన్‌ బిల్లు-2021ను రాజ్యసభ ఆమోదించింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంపై రాజ్యసభ ఛైర్మన్​ ఎం వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభల్లో మంగళవారం కూడా వాయిదా పర్వం కొనసాగింది. పెగాసస్​ వ్యవహారంపై, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. చర్చ జరపాలని ఉభయ సభల్లోనూ పట్టుబట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయ సభలు చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకలాపాలు సాగించకుండానే బుధవారానికి వాయిదా పడ్డాయి.

గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం

విపక్షాల ఆందోళన మధ్యే మెరైన్‌ ఎయిడ్స్‌ టు నావిగేషన్‌ బిల్లు-2021ను రాజ్యసభ ఆమోదించింది. అయితే సభలో విపక్ష సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు తమ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.

"సభలోని కొన్ని వర్గాలు ఈ సమావేశాల్లో కార్యకలాపాలు సజావుగా జరగకూడదని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడం ఆందోళనకరం. చట్టాలు తయారు చేయడానికి, చర్చలు జరపడానికే పార్లమెంట్ అనేది ఉంది. ఈ దుస్థితిపై కొన్ని పార్టీల నేతలు నాతో ఆందోళన వ్యక్తం చేశారు. సభను ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడంపై ఫిర్యాదు చేశారు. సభ్యులంతా తమ ఆలోచనను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా."

- ఎం వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్

అంతకుముందు.. ఇటీవల మరణించిన సభ్యులకు వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. అనంతరం రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం పట్ల రాజ్యసభ అభినందనలు తెలిపింది. ఆ తర్వాత పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలపై విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన చేపట్టారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని ఛైర్మన్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగించారు. దీంతో సభ నాలుగు సార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైంది. విపక్షాల నిరసన మధ్యే సభ చివరి సారిగా నాలుగు గంటలకు ప్రారంభమైనా, విపక్ష సభ్యులు ఆందోళన ఆపకపోవడం వల్ల సభను బుధవారానికి వాయిదా వేశారు.

దిగువసభలోనూ వాయిదాల పర్వమే

లోక్‌సభలోనూ వాయిదా పర్వం కొనసాగింది. దిగువసభ సమావేశం కాగానే పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన చేపట్టారు. సభ్యులు వెనక్కి వెళ్లాలని స్పీకర్‌ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా విపక్షాలు శాంతించలేదు. విపక్షాలు నినాదాలు చేయడంలో కాకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ఒకరినొకరు పోటీ పడాలని స్పీకర్‌ సూచించారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభ సాయంత్రం నాలుగు గంటల లోపు 8 సార్లు వాయిదా పడింది. 4.30 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన వీడకపోవడం వల్ల సభను బుధవారానికి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: 'పెగాసస్​ను కేంద్రం ఉపయోగించిందా? లేదా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.