ETV Bharat / bharat

రాజస్థాన్​ అసెంబ్లీలో హైడ్రామా... పాత బడ్జెట్​ను చదివిన సీఎం అశోక్​ గహ్లోత్!

author img

By

Published : Feb 10, 2023, 12:08 PM IST

Updated : Feb 10, 2023, 1:13 PM IST

rajasthan cm ashok gehlot
rajasthan cm ashok gehlot

రాజస్థాన్​ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ చేసిన ఓ తప్పిదం వల్ల సభ అరగంట పాటు వాయిదా పడింది. 2023-24 బడ్జెట్‌కు బదులుగా గతేడాది బడ్జెట్‌ సారాంశాన్ని సీఎం చదివారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

రాజస్థాన్​ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ 2023-24 బడ్జెట్​కు బదులుగా గతేడాది బడ్జెట్​ సారాంశం చదివారని ప్రతిపక్షాలు అరోపించాయి. విపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్​లోకి దూసుకొచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.
ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు మొట్టమొదటి సారిగా సీఎం శాసనసభలో బడ్జెన్​ను చదవడం ప్రారంభించారు. పాఠశాల విద్య, ఉపాధి హామీ పథకం, పేద కుటుంబాలకు రేషన్ వంటి అనేక ప్రకటనలను గహ్లోత్ దాదాపు 8 నిమిషాల పాటు చదివారు. అయితే ఇది గతేడాది బడ్జెట్​ కాపీ అని గుర్తించిన ఛీప్​ విప్​ మహేష్ జోషీ.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే సీఎం బడ్జెట్​ కాపీని చదవడం ఆపేశారు.

ముఖ్యమంత్రి పాత బడ్జెట్‌ను సభలో చదివిన విషయం తెలిసిన వెంటనే విపక్షాలు సభలో నినాదాలు ప్రారంభించాయి. దాదాపు 5 నిమిషాల పాటు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేతలు వెల్​లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. వెంటనే స్పీకర్​ సీపీ జోషీ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

"8 నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదువుతూనే ఉన్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు పదే పదే పరిశీలించి చదివాను. పాత బడ్జెట్ చదివిన సీఎం చేతిలో రాష్ట్రం ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చు"
-- వసుంధర రాజే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

'బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు సభ్యులకు ఇచ్చిన కాపీలో ఏమైనా తప్పులు ఉంటే.. ప్రతిపక్షం వారు దాన్ని గుర్తించగలరు. పొరపాటున నేను చదివిన బడ్జెట్​ కాపీలో వేరే పేజీ చేరి ఉంటే.. అది వారికి ఎలా తెలుస్తుంది..? అలా అయితే బడ్జెట్ ముందుగానే లీకైందా..?' అని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

అరంగట తర్వాత శాసనసభలో సభ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. సీఎం అశోక్​ గహ్లోత్ ' నన్ను క్షమించండి. తప్పు జరిగింది' అని చెప్పిన తర్వాత 2023-24 బడ్జెట్​ను సమర్పించారు.

Last Updated :Feb 10, 2023, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.