ETV Bharat / bharat

మరోసారి జీ23 నేతల సమావేశం.. హుడాతో రాహుల్​ భేటీ

author img

By

Published : Mar 18, 2022, 5:00 AM IST

కాంగ్రెస్​ జీ23 నేతలు గురువారం మరోసారి భేటీ అయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు. పార్టీలో సంస్కరణల అమలు కోసం పోరాడతామని పలువురు జీ23 నేతలు పేర్కొన్నారు. మరోవైపు అగ్రనేత రాహుల్​ గాంధీతో జీ23 నేత భూపీందర్ సింగ్​ హుడా సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వైఫల్యంపై రాహుల్​ హుడాతో చర్చించారు.

g23 meeting
కాంగ్రెస్

G23 Leaders: కాంగ్రెస్​లో సమష్టి నాయకత్వం కోసం డిమాండ్​ చేస్తున్న జీ23 నేతలు గురువారం మరోసారి సమావేశమయ్యారు. సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కపిల్​ సిబల్, ఆనంద్​ శర్మ, భూపీందర్​ సింగ్​ హుడా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల నాటికి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. కాంగ్రెస్​కు విధేయులుగా ఉంటూనే పార్టీలో సంస్కరణల అమలు కోసం పోరాడతామని పలువురు నేతలు పేర్కొన్నారు.

అంతకుముందు.. బుధవారం జరిగిన మొదటి సమావేశంలో పార్టీ బలోపేతానికి సమష్టి, సమ్మిళిత నాయకత్వం అవసరమని జీ23 నేతలు స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ.. ఆజాద్​ను సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు.

జీ23 నేతల ప్రతిపాదనలపై ఆజాద్​.. సోనియాతో శుక్రవారం భేటీ అయ్యే అవకాశం ఉంది.

రాహుల్​తో భేటీ

మరోవైపు జీ23 నేతల్లో ఒకరైన భూపీందర్​ సింగ్​ హుడాతో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలల్లో కాంగ్రెస్​ ఓటమికి గల కారణాలపై చర్చించారు. జీ23 నేతలు ఎలాంటి పదవులను ఆశించట్లేదని.. పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా హుడా రాహుల్​కు చెప్పినట్లు సమాచారం.

రాహుల్​తో భేటీ అనంతరం హుడా.. ఆజాద్​తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మరో జీ23 నేత ఆనంద్​ శర్మ కూడా హాజరయ్యారు. రాహుల్​తో భేటీపై వీరు చర్చించారు.

జీ23 నేతలతో నెలకొన్న విభేదాలను తొలగించుకోవాలని కాంగ్రెస్​ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆజాద్​ సహా పలువురు సీనియర్లు మధ్యవర్తిత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : పంజాబ్​ సీఎం సంచలన ప్రకటన.. చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.