ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్.. మధ్యాహ్నం 2గంటల వరకే పని.. తర్వాత ఇంటికే!

author img

By

Published : Apr 8, 2023, 6:39 PM IST

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా ఉదయం 9 లేదా 10 నుంచి.. సాయంత్రం వరకు ఉంటుంది. కానీ, ఇకపై వారు మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటికి వెళ్లిపోవచ్చు! ఒంటిపూట బడుల్లా.. ఒంటిపూట పని అన్నమాట! మరి రూల్స్ ఏంటి? ఎవరికి ఇది వర్తిస్తుందో తెలుసా?

punjab-government-new-announcement-punjab-government-changed-govt-office-timings
ప్రభుత్వ కార్యాలయాల వేళలు మార్చిన పంజాబ్ ప్రభుత్వం

పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చుతూ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ప్రజాసంఘాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు.. మధ్యాహ్నమే ఇంటికి వెళ్లిపోయి కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపొచ్చని చెప్పారు. అయితే, ఉద్యోగులంతా ఉదయం 7.30 గంటలకే కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ పనివేళలు మే 2 నుంచి జులై 15 వరకు అమలులో ఉండనున్నాయి. పనివేళలు మార్చడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఏదైనా ఉద్యోగం చేసుకునే వారు ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే.. ఉదయమే పూర్తి చేసుకోవచ్చని అన్నారు. సెలవు పెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని చెప్పుకొచ్చారు. వేసవిలో ఎండ తీవ్రం కాకముందే.. ప్రజలు తమ పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. తాను కూడా 7.30 గంటలకే ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తానని స్పష్టం చేశారు మాన్. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సైతం ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దేశంలో ఇలాంటి విధానం ప్రవేశపెట్టడం పంజాబ్​లోనే తొలిసారని మాన్ వివరించారు. విదేశాల్లో మాత్రం ఈ విధానాన్ని అమలు చేశారని చెప్పారు.

ఎందుకో తెలుసా?
వేసవి సీజన్​ను దృష్టిలో పెట్టుకొనే భగవంత్ మాన్ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్​ను తగ్గించేందుకు ఇలా చేసింది. పంజాబ్​లో విద్యుత్ వినియోగం మధ్యాహ్నం 2 నుంచి 5 మధ్యే అధికంగా ఉంటోందని ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు ముఖ్యమంత్రికి వివరించింది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వడం వల్ల ఆ సమయాల్లో వినియోగం తగ్గుతుందని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల 300 నుంచి 350 మెగా వాట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తోంది.

'రైతులను ఆదుకోండి'
ఇదిలా ఉంటే.. పంజాబ్​లో అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. మార్చి 24 నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా 14 లక్షల హెక్టార్లలో పంట నష్టమైందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.