ETV Bharat / bharat

అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు!

author img

By

Published : May 29, 2021, 6:18 PM IST

Updated : May 29, 2021, 8:50 PM IST

pm cares help for orphans
అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు!

18:16 May 29

అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు!

ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న క్రమంలో కొవిడ్​తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో పాటు పైచదువులకు హామీ ఇచ్చారు. 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్​ ' పథకం ద్వారా సాయం అందిస్తామని ప్రకటించారు.  

చిన్నారులకు సాయంపై ఓ ప్రకటన జారీ చేసింది ప్రధాన మంత్రి కార్యాలయం. అనాథ చిన్నారుల పేరుపై ఫిక్స్​డ్​ డిపాజిట్లు తెరుస్తామని తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షలు అందేలా ప్రత్యేకంగా రూపొందించిన పథకానికి పీఎం కేర్స్​ ద్వారా నిధులు సమకూర్చుతామని పేర్కొంది.  

"చిన్నారులు  దేశ భవిష్యత్తును సూచిస్తారు. దృఢమైన పౌరులుగా, మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వారికి మద్దతుగా, రక్షణగా అన్ని విధాల సాయంగా ఉంటాం. ప్రస్తుత సమయంలో ఒక సమాజంగా చిన్నారుల భద్రత మా బాధ్యత. తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్స్​ పథకం ద్వారా మద్దతు అందిస్తాం"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.  

పీఎం కేర్స్​ ద్వారా అందే సాయం వివరాలు ఇలా..

  • 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్స్​' పథకం ద్వారా కొవిడ్​తో అనాథలైన చిన్నారులకు కేంద్రం సాయం
  • 10 ఏళ్లలోపు పిల్లలను సమీపంలోని కేంద్రీయ విద్యాలయాలు లేదా ప్రైవేట్​ పాఠశాల్లలో చేరిక
  • 11-18 ఏళ్ల వారికి సైనిక్​ స్కూల్​, నవోదయా విద్యాలయ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్​ పాఠశాలల్లో ప్రవేశం.
  • సంరక్షకులు, బంధువులు ఉన్న చిన్నారులకు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం లేదా ప్రైవేటు స్కూల్స్​లో ప్రవేశం. ప్రైవేటు పాఠశాలల్లో చేరే పిల్లలకు పీఎం కేర్స్​ నిధి నుంచి ఫీజుల చెల్లింపు. అలాగే వసతి, యూనిఫాం, పుస్తకాలు, నోట్స్​బుక్స్​కు కూడా అందజేత
  • చిన్నారుల పేరుపై ఫిక్స్​డ్​ డిపాజిట్లు తెరిచి 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షలు అందేలా పీఎం కేర్స్​ ద్వారా నిధుల ఏర్పాటు
  • 18 ఏళ్ల తర్వాత ఉన్నత చదువుల కోసం ప్రతి నెల స్టైఫండ్​ లేదా నెల వారి ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు కొనసాగింపు
  • 23 ఏళ్లు నిండిన తర్వాత ఏక మొత్తంలో పీఎం కేర్స్​ నిధి ఫిక్స్​డ్​ డిపాజిట్​ నుంచి రూ.10 లక్షలు అందజేత.
  • దేశంలో ఉన్నత చదువుల కోసం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విద్యా రుణం. అలాంటి రుణాలకు పీఎం కేర్స్​ ద్వారా వడ్డీ చెల్లింపు.
  • అండర్​ గ్రాడ్యూయెట్​, వొకేషనల్​ కోర్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా స్కాలర్​షిప్స్​ అందజేత. ఈ పథకాలకు అర్హులు కాని వారికి పీఎం కేర్స్​ ద్వారా వాటికి సమానంగా ఉపకారవేతనాలు.
  • అనాథలైన చిన్నారులందరినీ ఆయుష్మాన్​ భారత్​ స్కీం లేదా ప్రధాన మంత్రి జన్​ ఆరోగ్య యోజన కింద నమోదు. రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. బీమా ప్రీమియం 18 ఏళ్లు నిండేవరకు పీఎం కేర్స్​ నుంచి చెల్లింపు.

అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ప్రకటించిన ఈ పథకాలు పీఎం కేర్స్​కు ప్రజలు అందించిన విరాళాలతోనే సాధ్యమవుతోందన్నారు ప్రధాని మోదీ. మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ తెలిపిన వివరాల ప్రకారం కొవిడ్​ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు 577 మంది ఉన్నారు. ఏప్రిల్​ 1 నుంచి మే 25 వరకు అలాంటి వారు ఉంటే గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.  

ఫించను..

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి కరోనా కారణంగా మరణించినట్లైతే ఫించను అందించనుంది. ఫించనుతో పాటు ఈడీఎల్​ఐ(ఎంప్లాయిస్ డిపాజిట్​- లింక్డ్​ ఇన్ష్యూరెన్స్​​) కింద బీమా ప్రయోజనాలను కూడా ప్రకటించింది. ప్రజలకు భాజపా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

ఇది గతేడాది మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు అమల్లో ఉండనుంది.

Last Updated :May 29, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.