ETV Bharat / bharat

Singer Saichand passed Away : రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతి

author img

By

Published : Jun 29, 2023, 6:14 AM IST

Updated : Jun 29, 2023, 9:50 AM IST

Singer Saichand passed away
Singer Saichand passed away

06:12 June 29

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ మృతి.. ప్రముఖుల సంతాపం

Singer Saichand passed Away : తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్ వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాడి కొట్టుకోకపోవడంతో అక్కడి వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించినట్లుగా ధ్రువీకరించామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దినేశ్ వెల్లడించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయిచంద్‌ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Singer Saichand Death News : సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపం ప్రకటించారు. ఇంత చిన్న వయసులో అతడి మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుడిని, మంచి కళాకారుడిని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని గుర్తు చేసుకున్నారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం అన్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను, చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆటపాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. సాయిచంద్ కుటుంబసభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

KTR Condolence to Singer Saichand : సాయిచంద్ మరణం.. తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం పార్టీకి తీరని లోటన్నారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు.. సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి స్మరించుకున్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Harish Rao Condolence to Singer Saichand : సాయిచంద్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు.. అతడి అకాల మరణం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని.. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని హరీశ్ రావు అన్నారు. సాయిచంద్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారన్నారు.

విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్‌ పాత్ర విస్మరించలేనిదన్న ఆయన.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. సాయిచంద్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించిన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నాయకులు సాయిచంద్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇవీ చూడండి..

సేవకులారా వందనం అంటూ.. కరోనాపై సాయిచంద్​ పాట

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌పై దాడి

Last Updated :Jun 29, 2023, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.