ETV Bharat / bharat

'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'

author img

By

Published : Oct 31, 2021, 10:50 AM IST

Updated : Oct 31, 2021, 11:43 AM IST

దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్​ ఎల్లప్పుడూ సమ్మిళితంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని సర్దార్ పటేల్ కోరుకున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే దేశం ఇప్పుడు అన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.

MODI SARDAR
MODI SARDAR patel news

'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' కోసం సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. చరిత్రలోనే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి హృదయాల్లో సర్దార్ పటేల్ చిరస్థాయిగా నిలిచి ఉన్నారని చెప్పారు. దేశం మొత్తం ఆయనకు ఈరోజు నివాళులు అర్పిస్తోందని అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా.. ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు.

భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదని.. ఎన్నో ఆదర్శాలు, నాగరికత, సంస్కృతికి ప్రతిరూపమని మోదీ ఉద్ఘాటించారు. 135 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు. దేశప్రజలంతా ఐక్యంగా ఉంటేనే.. దేశం తన లక్ష్యాలను సాధించగలుగుతుందని పేర్కొన్నారు.

"పడవలో ప్రయాణించే ప్రతిఒక్కరూ దాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. అందరూ కలసికట్టుగా ఉంటేనే ముందుకు వెళ్లగలం. ఐక్యమత్యంగానే ఉంటే.. లక్ష్యాలను సాధించగలం. భారత్​ ఎల్లప్పుడూ సమ్మిళితంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని సర్దార్ పటేల్ కోరుకున్నారు. జాతి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన ప్రేరణతోనే భారత్.. అంతర్గత, బహిర్గత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటోంది. దేశ ఐక్యతను చాటే ఆదర్శాలను సమున్నత శిఖరాలకు తీసుకెళ్లాం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

భారతీయ సమాజం, సంస్కృతి నుంచే దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది పడిందని మోదీ పేర్కొన్నారు. గడిచిన ఏడేళ్లలో దశాబ్దాల కాలం నాటి పనికిరాని చట్టాలను తొలగించినట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ సానువుల్లోని గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో దేశంలోని భౌగోళిక ప్రాంతాల మధ్య దూరం తగ్గుతోందని చెప్పారు.

షా నివాళి

మరోవైపు, గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాళులర్పించారు. దేశ సేవకు మహా నేత చేసిన కృషిని స్మరించుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు.

ఇదీ చదవండి:

Last Updated :Oct 31, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.