కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నగరం గొప్ప ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే.. పీటీ రాజన్ మిశ్రా ఆస్పత్రిని నెలకొల్పడం సహా నగరవ్యాప్తంగా ఆక్సిజన్, ఐసీయూ పడకలను ఇక్కడి అధికారులు ఏర్పాటు చేశారని ప్రశంసించారు. వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు.
ఇప్పటికే.. కరోనా ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. కరోనాపై పోరాడుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ రూపంలో మరో కొత్త సవాలు మనకు ఎదురైంది. ఈ వ్యాధి బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలి, సమర్థంగా ఎదుర్కోవాలి.
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
కరోనా రెండో దశ విజృంభణతో ఆరోగ్య వ్యవస్థపై అధిక భారం పడిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు, ఫ్రంట్లైన్ వర్కర్లు ధన్యవాదాలు చెబుతూ.. మోదీ ఈ సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కరోనాకు వ్యతిరేకంగా మనమంతా ఇంకా చాలా కాలం పాటు పోరాడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.