ETV Bharat / bharat

కాంగ్రెస్​ నా సమాధి కడుతోంది.. నేను దేశ నిర్మాణం చేస్తున్నా: మోదీ

author img

By

Published : Mar 12, 2023, 4:17 PM IST

తాను దేశ నిర్మాణం చేస్తుంటే.. కాంగ్రెస్​ పార్టీ తన సమాధి కట్టాలని కలలు కంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదాలే రక్షణ కవచాలని తెలిపారు. పేదల డబ్బును కాంగ్రెస్​ ప్రభుత్వం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. మైసూరు-బెంగళూరు ఎక్స్​ప్రెస్​ వేను ఆదివారం ప్రారంభించిన మోదీ.. జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

PM Modi holds grand road show in Mandya
PM Modi holds grand road show in Mandya

తాను దేశ అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం కష్టపడున్నానని.. కాంగ్రెస్​, ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం తన సమాధి కట్టడంలో బిజీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదాలే తనకు రక్షణ కవచాలని చెప్పారు. మైసూరు-బెంగళూరు మధ్య నిర్మించిన ఎక్స్​ప్రెస్​ వేను కర్ణాటకలోని మండ్యలో ప్రధాన మంత్రి ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

"దేశ అభివృద్ధి కోసం, ప్రజల జీవనం మెరుగుపడడం కోసం, మైసూరు-బెంగళూరు రహదారి కట్టడానికి డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? మోదీకి సమాధి కట్టాలని కాంగ్రెస్​ కలలు కంటోంది. నా సమాధి కట్టాలనుకునే కాంగ్రెస్​ నేతలకు తెలియదు.. నాకు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదముందని. ఆ ఆశీర్వాదమే నాకు రక్షణ కవచం. పేదలను ఇబ్బందులకు గురి చేసే వారిని నేను వదిలిపెట్టను.పేదల అభివృద్ధికి కావాల్సిన రూ.కోట్ల డబ్బును కాంగ్రెస్​ లూటీ చేసింది. మిమ్మల్ని(ప్రజలను ఉద్దేశించి) కాపాడటానికి 2014 నాకు అవకాశమిచ్చారు. దానివల్లే మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం పేదల బాధల్ని, ఇబ్బందులను అర్థం చేసుకుంటుంది. వాటి నుంచి విముక్తి పొందేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది"
-- ప్రధాని నరేంద్ర మోదీ

ఎక్స్​ప్రెస్​ వే ప్రారంభోత్సవానికి ముందు.. మండ్యలో రోడ్​ షోలో మోదీ పాల్గొన్నారు. రోడ్​ షోలో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మోదీపై పూల వర్షం కురిపించారు. ఆనంతరం ఆ పూల రేకులను మోదీ అభిమానులపై చల్లి కృతజ్ఞత తెలుపుకున్నారు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

'కాంగ్రెస్​ నా గోరీ కడుతోంది.. నేను దేశ నిర్మాణం చేస్తున్నా..'
Mandya PM Modis roadshow
మోదీ రోడ్​ షో

మైసూరు-బెంగళూరు ఎక్స్​ప్రెస్​ వే..
బెంగళూరు-మైసూరు నగరాల మధ్య ఎక్స్​ప్రెస్​ వేను (ఎన్​హెచ్​ 275) రూ.8,478 కోట్లతో నిర్మించారు. భారతమాల పరియోజన స్కీమ్​లో భాగంగా నిర్మించిన ఈ 118 కిలోమీటర్ల మార్గంలో.. ఆరు వరసల ప్రధాన రహదారితోపాటు ఇరువైపులా నాలుగు వరుసల సర్వీసు రోడ్డు కూడా నిర్మించారు. ఈ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చగా, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటివరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు పట్టేది. కాగా ఇప్పుడు అది 90 నిమిషాలకు తగ్గనుంది. అత్యవరస సమయాల్లో ఈ రహదారిపై హెలికాప్టర్లను కూడా దింపవచ్చని అధికారులు తెలిపారు. ఇక, మధ్యలో వచ్చే నగరాలు, పట్టణాలకు వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రహదారిలో 40 చిన్న వంతెనలు, 89 అండర్‌పాస్‌, ఓవర్‌పాస్‌లు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.