ETV Bharat / bharat

సభ్యుల సస్పెన్షన్​పై రగడ- రెండో రోజూ సాగని సభ

author img

By

Published : Nov 30, 2021, 4:39 PM IST

parliament winter session, పార్లమెంటు శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Parliament Winter Session: పార్లమెంటు ఉభయసభల్లో వరుసగా రెండో రోజు వాయిదాల పర్వం కొనసాగింది. 12 మంది సభ్యులపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇందుకు ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిరాకరించగా.. వారు సభ నుంచి వాకౌట్ చేశారు. మధ్యాహ్నం కూడా తిరిగి సభలోకి రాలేదు. దీంతో సభ బుధవారానికి వాయిదా పడింది. లోక్​సభలోనూ విపక్షాలు మధ్యాహ్నం కూడా నిరసనలు చేపట్టడం వల్ల స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.

Parliament Winter Session: శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన పార్లమెంట్​ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పెద్ద ఎత్తన నినాదాలు చేశాయి.​ దీంతో లోక్​సభ, రాజ్యసభలో మంగళవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే రెండు సభలు బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.

మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్​సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. రాజ్యసభలో సస్పెండ్ అయిన సభ్యులకు మద్దతుగా నినాదాలు చేశారు. కాసేపటికే సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు స్పీకర్​ ఓంబిర్లా. సభ తరిగి ప్రారంభమైనా.. విపక్షాలు ఆందోళనలు విరమించలేదు. దీంతో మరోసారి మధ్యాహ్నం 3గంటల వరకు సభ వాయిదా పడింది. అనంతరం మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. స్పీకర్ పదే పదే చెప్పినా విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్​ బుధవారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

విపక్షాలకు స్పీకర్ పిలుపు..

Lok Sabha live: విపక్షాలు తరచూ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. నిరసనలు ఆపి సభా కార్యకాలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారికి సూచించారు. సభ విరామ సమయంలో ఈ భేటీ జరిగింది.

వెనక్కి తగ్గని వెంకయ్య..

Rajya Sabha Live: ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే 12 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు ఉపసంహరించుకోవాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడును ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. గత సెషనల్​లో జరిగిన విషయాలకు వారిని ఇప్పుడు బహిష్కరించడం సరికాదని, వారి సస్పెన్షన్ సభా నిబంధనలకు విరుద్ధమన్నారు. ఛైర్మన్​ వెంకయ్యనాయుడు మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సభ్యులపై సస్పెన్షన్​ను ఎత్తివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గత సెషన్​లో ఆ సభ్యులు చేసిన విధ్వంసం సభా మర్యాదలను మసకబార్చిందని, అలాంటి వారిని బహిష్కరించడం న్యాయమే అని పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్​ చేసే అధికారం ఛైర్మన్​గా తనకు ఉందని స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉభయసభల ఎంపీలు నిరసనకు దిగారు. తమను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం అని ఆరోపించారు. నిర్ణయాన్ని ఛైర్మన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాము చేసింది తప్పేం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాత మంగళవారం రెండోసారి విపక్ష నేతలు సమావేశమయ్యారు. ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా విపక్ష సభ్యులు సభలోకి రాలేదు. దీంతో సభ బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడింది.

రాజ్యసభలో మంగళవారం ఆనకట్ట భద్రత బిల్లు, 2019పై చర్చ జరపాలనుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం వల్ల చర్చ జరగలేదని, ఒకవేళ వారు బుధవారం సభకు హాజరైతే ఈ బిల్లుపై చర్చిస్తామని చెప్పారు.

Cryptocurrency Bill

సమావేశంలో భాగంగా క్రిప్టో కరెన్సీపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత త్వరలో సంబంధిత బిల్లును తీసుకువస్తామని చెప్పారు. ఇంకా పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించలేదని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ ప్రకటనలపై నిషేధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆర్​బీఐ, సెబీ ద్వారా.. క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

Omicron India

భారత్​తో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.

దేవెగౌడతో మోదీ భేటీ..

Modi met Devegowda, దేవెగౌడతో మోదీ భేటీ
దేవెగౌడతో మోదీ భేటీ..

జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడతో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. కాసేపు ఆయనతో పలు విషయాలపై మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ ట్విట్టర్​ వేదికగా షేర్ చేశారు.

Modi met Devegowda, దేవెగౌడతో మోదీ భేటీ
దేవెగౌడతో మోదీ భేటీ..
Modi met Devegowda, దేవెగౌడతో మోదీ భేటీ
దేవెగౌడతో మోదీ భేటీ..

పార్లమెంటు సమావేశాల బహిష్కరణ!

రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. 12మంది సభ్యుల సస్పెన్షన్​ అంశంపై చర్చించాయి. ఒకవేళ ఛైర్మన్​ ఈ సభ్యులపై సస్పెన్షన్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మొత్తం సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ భేటీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. టీఎంసీ మినహా 16 పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. డీఎంకే, శివసేన, ఎన్​సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్​, ఆర్​జేడీ, ఐయూఎంఎల్​, ఎండీఎంకే, ఎల్​జేడీ, ఎన్​సీ, ఆర్ఎస్​పీ, టీఆర్​ఎస్​, కేరళ కాంగ్రెస్​, వీసీకే పార్టీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. సస్పెన్షన్​కు గురైన వారిలో తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికీ టీఎంసీ.. విపక్షాల సమావేశానికి హాజరు కాలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు కూడా విపక్షాలు నిర్వహించిన సమావేశానికి టీఎంసీ నేతలు దూరంగా ఉండటం గమనార్హం.

సభ్యుల సస్పెన్షన్​పై టీఎంసీ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది. తమ ఇద్దరు ఎంపీలు సమావేశాలు జరిగే డిసెంబర్​ 23వరకు ప్రతిరోజు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిరసన వ్యక్తం చేశారని తెలిపింది. ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రయిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి: Omicron variant in India: 'ఒమిక్రాన్​ భయాలొద్దు- యాంటీబాడీలే రక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.