ETV Bharat / bharat

జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగం!

author img

By

Published : Jan 3, 2023, 8:59 AM IST

parliament budget sessions
parliament budget sessions

2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. ​

పార్లమెంటు బడ్జెట్‌ (2023-24) సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా (జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 6 వరకు) జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న తిరిగి ప్రారంభమై ఏప్రిల్‌ 6న ముగియనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల తొలి రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారని వెల్లడించారు.

ఇకపోతే, రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్‌ విస్టా పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలను సెంట్రల్‌ విస్టా హాలులోనే నిర్వహించేందుకు భవనాన్ని సిద్ధం చేస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.