ETV Bharat / bharat

ఉల్లి సంక్షోభం.. రాబోయే రోజుల్లో రైతులకు కన్నీరు తెప్పించడం ఖాయం

author img

By

Published : Mar 1, 2023, 1:14 PM IST

onions
onions

Onion Farmers Struggles For Price : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. ఉల్లిలోని చక్కని పోషక విలువల వల్ల ఆ గుర్తింపు వచ్చినా దాన్ని పండించే రైతులకు, విక్రయించే హోల్‌సేల్‌ వ్యాపారులకు ఉల్లి ఇప్పుడు మేలు కాదు, కీడు చేస్తోంది. దేశంలో అత్యధికంగా ఉల్లి పండించే మహారాష్ట్రలో దాని ధరలు ఒక్కసారిగా సగానికి సగం పడిపోయాయి. ధరల తగ్గుదలతో వ్యాపారులు విక్రయాలు కూడా నిలిపివేశారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఏ కారణాల వల్ల ఉల్లిధరలు తగ్గిపోయాయి. వీటి ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఎందుకు. దేశంలో రాబోయే రోజుల్లో ఉల్లిధరలపై ఈ ప్రభావం ఏ విధంగా ఉండనుంది. రైతులు, వ్యాపారులను అదుకునేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి.

ఉల్లి సంక్షోభం.. రాబోయే రోజుల్లో కన్నీరు తెప్పించే ప్రమాదం

Onion Farmers Struggles For Price: వంటకాల్లో తప్పక వాడే పదార్థం ఉల్లి. వంటకానికి రుచిని ఆపాదించడమే కాకుండా, పోషక విలువలు అందిస్తుంది కనుకే ఉల్లి.. వంటకాల్లో తప్పనిసరి పదార్థమై నిలుస్తోంది. అలాంటి ఉల్లిని అత్యధికంగా పండించే రాష్ట్రం మహారాష్ట్ర. దేశంలో పండే ఉల్లిలో 40% మహారాష్ట్రదే. ఏటా మహారాష్ట్ర 25 నుంచి 26 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉల్లి పండిస్తోంది. అంతగా ఈ పంటపై ఆధారపడ్డ రైతులు, వ్యాపారులకు ఇప్పుడు కష్టం వచ్చింది.

ఉల్లి ధర 20 రోజుల వ్యవధిలో సగానికి సగం పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌గా పేరుగాంచిన మహారాష్ట్ర లాసల్‌గావ్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి 9వరకు క్వింటాలు ఉల్లి ధర రూ.1000 నుంచి రూ.1100 మధ్య పలకగా, ఈ నెల 27న అది సగటున రూ.500 నుంచి రూ.550కి పడిపోయింది. ఒక దశలో కిలో ఉల్లి ధర రూ.4 నుంచి రూ.2కు కూడా పడిపోయింది. ఒక్కసారిగా పడిపోయిన ధరల ప్రభావంతో ఇక్కడి ఉల్లి వ్యాపారులు లబోదిబో అంటున్నారు. లాసల్‌గావ్‌ మార్కెట్‌లో సోమవారం తమ వ్యాపారాలను బలవంతంగా నిలిపివేశారు. ఇతర మార్కెట్‌లలో కూడా ఉల్లి వేలం ప్రక్రియను నిలిపివేస్తామని మహారాష్ట్ర ఉల్లి పెంపకందారుల సంఘం తెలిపింది.

మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిపోవడానికి కారణాలు అనేకం: మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిపోవడానికి కారణాలు అనేకం. ఇందులో ముఖ్యమైనది వాతావరణంలో వచ్చే మార్పులు. సాధారణంగా అక్కడ రైతులు ఉల్లికి సంబంధించి ఏడాదిలో 3 పంటలు పండిస్తారు. ఖరీఫ్‌లో జూన్‌-జులై మధ్యలో పంట నాట్లు వేసి, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కోతలు జరుపుతారు. ఖరీఫ్‌ తర్వాత సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో నాట్లు వేసి, జనవరి, ఫిబ్రవరిలో.., రబీ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ లేదా జనవరిలో నాట్లు వేసి, మార్చి, ఏప్రిల్‌లో కోతలు చేపడతారు. పండించిన పంటను ఒకే సారి విక్రయించరు. ఎక్కువగా నగదుకేవిక్రయిస్తారు.

ఉల్లి నాణ్యత ఆధారంగా మార్కెట్​లో ధర: ఖరీఫ్‌ పంటను ఫిబ్రవరి వరకు, తర్వాత వచ్చిన పంట మే మాసం, జూన్‌ వరకు మార్కెట్‌కు పంపిస్తారు. ఖరీఫ్‌, ఆ తర్వాత పండే పంటలో తేమ అధికంగా ఉంటుంది. అందువల్ల ఖరీఫ్‌ ఉల్లిని గరిష్ఠంగా 4 నెలల పాటు నిల్వ చేస్తారు. అయితే దీనికి భిన్నంగా శీతాకాలంలో పండే రబీ ఉల్లిలో తక్కువ తేమ ఉంటుంది. అందువల్ల దీనిని కనీసం 6 నెలలు నిల్వ చేస్తారు. రబీ ఉల్లి మార్కెట్‌కు రావడం వేసవి నుంచి శీతాకాలం వరకు మార్కెట్‌కు తీసుకువస్తారు. అయితే మార్కెట్‌లో ధర ఉల్లి నాణ్యతపై ఆధారపడి నిర్ణయం అవుతూ ఉంటుంది.

ఉష్ణోగ్రతలు పెరగడం: మార్కెట్‌లో నిల్వ ఉండే ఉల్లి నాణ్యత.. వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధరలను నిర్ణయిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో అది ఉల్లి నాణ్యతపై ప్రభావం చూపించడం ఆరంభించింది. సాధారణంగా రైతులు ఫిబ్రవరిలోనే ఖరీఫ్‌ పంట విక్రయిస్తూ ఉంటారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఖరీఫ్ అనంతర పంట కూడా రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు.

అధిక తేమ కల్గిన ఈ 2 ఉల్లి రకాలు ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల దెబ్బతింటున్నాయి. వేడి కారణంగా ఇవి త్వరగా ఎండిపోయి కుంచించుకుపోతున్నాయి. అలా ఉల్లి పెద్ద ఎత్తున మార్కెట్‌లను ముంచెత్తుతోంది. ఖరీఫ్‌, దాని అనంతర ఉల్లి కూడా ఒకే సారి మార్కెట్‌లను ముంచెత్తడంతోనే ధరలు తగ్గిపోతున్నా యని వ్యాపారులు అంటున్నారు. పెరిగే ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత.. ఉల్లి ధర మరింత తగ్గిపోవడానికి కారణం అవుతోందని వ్యాపారులు అంటున్నారు.

ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం ఉల్లి వ్యాపారులకు మాత్రమే కాదు, రైతులకు కూడా కన్నీళ్లు మిగులుస్తోంది. మార్కెట్‌లో నిల్వలు పెరిగి, ధరలు భారీగా తగ్గిపోవడంతో వ్యాపారులు రైతులకు కూడా తక్కువ ధరలే చెల్లిస్తున్నారు. ఇటీవల షోలాపూర్‌లో ఓ రైతు 512 కేజీల ఉల్లిని మార్కెట్‌కు విక్రయం కోసం తీసుకురాగా, అన్ని ఖర్చులూ పోనూ వ్యాపారి రైతుకు కేవలం 2రూపాయల చెక్కు చేతిలో పెట్టాడు. ఇలాంటి అనుభవాలు అనేక మంది రైతులకు ఎదురవుతున్నాయి.

రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుంటున్న దళారులు, వ్యాపారులు: ఎండల కారణంగా ఉల్లి మరింత పాడయ్యే ప్రమాదం ఉండడంతో రైతులు తమ ఇంట్లో నిల్వ ఉన్న పంట ఎంత తక్కువ లాభం వచ్చినా ఫర్వాలేదు అనుకుంటూ మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. అయితే రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుంటున్న దళారులు, వ్యాపారులు ధరలను మరింత తగ్గించి నామమాత్రం మొత్తాన్ని రైతు చేతిలో పెడుతున్నారు. రైతులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధను దిగమింగుకుంటూ వ్యాపారులు ఇచ్చిన మొత్తాన్ని తీసుకుంటున్నారు.

ఉల్లి పంట సాగు ఎప్పుడూ సున్నితమైన అంశమే: ఉల్లి పంట సాగు ఎప్పుడూ సున్నితమైన అంశమే. వాతావరణం, మార్కెటింగ్‌ సహా అనేక అంశాలు ఉల్లి ధరను నిర్ణయిస్తాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించని సందర్భాలే అనేకం. ఇది ఒక్క భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న సమస్యే. ఉల్లి ధరలు అమాంతం పెరగడం, అంతే అమాంతం తగ్గాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. ద్రవ్యోల్బణం 14ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో అసలు ఎవరి ఊహకు అందని విధంగా అక్కడ కేజీ ఉల్లి ధర రూ.1200లకు చేరింది. అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఏడాదికి ఒకసారి మాత్రమే ఉల్లి పంటను వేసేందుకు అవకాశం ఉండడం కూడా వాటి ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం.

ఫిలిప్పీన్స్‌లో చికెన్‌, మటన్‌, పోర్క్‌ కంటే కూడా ఉల్లి ధరే ఎక్కువగా ఉంది. అక్కడి హోటళ్లు ఉల్లి వాడకాన్ని తగ్గించడమో, నిలిపివేయడమో చేస్తున్నాయి. సాధారణ ప్రజలు సైతం ఉల్లి వాడకాన్ని పూర్తిగా నిలిపి వేస్తున్నారు. ధరల పెరుగుదలతో ఉల్లికి డిమాండ్‌ కూడా ఎగబాకిన నేపథ్యంలో అక్కడి రైతులు పంట పూర్తిగా ఎదగకముందే దాన్ని కోసి మార్కెట్లకు తీసుకువస్తున్నారు.

ప్రభుత్వాలను కూడా పడగొట్టే స్థాయి ఉల్లిది: భారతదేశంలో ఉల్లి ధరలు రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలను కూడా పడగొట్టే స్థాయి ఉల్లిది. 1998లో దేశ రాజధాని దిల్లీలో ఉల్లి ధరల పెరుగుదలతో అప్పడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. దిల్లీలో బీజేపీకి అప్పుడు చేజారిన అధికారం మళ్లీ ఇంకా దక్కలేదు. ఇక ఉల్లి పంట అధికంగా పండే మహారాష్ట్రలోనూ పలు మార్లు ఉల్లి ధరలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.

ధరలు తగ్గినా, పెరిగినా, అది పాలక పక్షాలకు ఇబ్బందిగా, విపక్షాలకు అస్త్రంగా మారుతూ వస్తోంది. తాజాగా ఉల్లి ధరల తగ్గుదల అంశం మంగళవారం కూడా మహారాష్ట్ర శాసనసభను కుదిపివేసింది. ఉల్లి రైతుల సమస్యలను తెలిపేందుకు ఎన్​సీపీ-ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలకు ఉల్లిపాయ బుట్టలతో హాజరయ్యారు. ఉల్లి ధరలు పడిపోతుండటం దీనిపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

దేశంలోని కోట్లాది మంది రైతులు ఉల్లి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. అనేక మంది వ్యాపారులు, దళారులకు కూడా ఉల్లి వ్యాపారం జీవనాధారం. దేశంలో ఏటా పండే ఉల్లి పంటలో 40% అంటే 25 నుంచి 26 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులను పండిస్తున్న మహారాష్ట్ర దేశ అవసరాలను గణనీయంగా తీరుస్తోంది. దీనిలో కొంత విదేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. మహారాష్ట్ర తర్వాత దేశ ఉల్లిసాగులో.. మధ్యప్రదేశ్‌ 16 నుంచి 17శాతం, కర్ణాటక 9నుంచి 10 శాతం, గుజరాత్‌ 6నుంచి 7శాతం, రాజస్థాన్‌, బిహార్‌ 5నుంచి 6శాతం చొప్పున పండిస్తున్నాయి.

ఉల్లికి గిట్టుబాటు ధరలే పెద్ద సమస్య: అలా అనేక రాష్ట్రాల రైతులకు జీవనాధారమైన ఉల్లికి గిట్టుబాటు ధరలే పెద్ద సమస్యగా మారాయి. ఎరువులు, కూలీల రేట్లు పెరగడంతో సాధారణంగా ఎకరా ఉల్లి సాగుకు 25వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. దిగుబడి సగటున 50క్వింటాళ్లు రావాల్సి ఉండగా, 30 నుంచి 35 క్వింటాళ్లు కూడా దాటడం లేదు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత రైతులకు దేశంలోని అనేక ప్రాంతాల్లో నిల్వ సౌకర్యాలు లేవు. అందువల్ల రైతులు పండించిన పంటను చాలా సందర్భాల్లో ఒకే సారి మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు సిండికేటుగా మారి ధరలను తగ్గిస్తున్నారు. ప్రజలకు విక్రయిస్తున్న ధరకు రైతుకు అందుతున్న గిట్టుబాటు ధరకు చాలా తేడా ఉంటోంది.

ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిన నేపథ్యంలో అక్కడి హోల్‌సేల్‌ వ్యాపారులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్వింటాలుకు కనీసం రూ.1000 కచ్చితమైన ధర ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ ధరకు తక్కువగా ఎవరూ కొనుగోలు చేయకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నాఫెడ్‌ కూడా పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీనిపై నాఫెడ్‌ కూడా స్పందించింది.

నాసిక్‌ జిల్లాలో ఈ వారంలోనే కొనుగోలు కేంద్రాలను తెరుస్తామని తెలిపింది. అయితే మంచి ధర లభించాలంటే రైతులు నాణ్యమైన ఉల్లిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని హితవు పలుకుతున్నారు. ఉల్లి ధరలను నియంత్రించడానికి ప్రభుత్వాలు కూడా పూనుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్‌ తర్వాత పండే ఉల్లిని ఎక్కువ కాలం నిల్వ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల దాని విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలోని ఉల్లి పంటలో 70శాతం ఉండే రబీ పంట విషయంలోనే ఏమైనా చర్యలకు ఆస్కారం ఉంది.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు 20% అధికంగా ఉల్లి సాగు: ప్రస్తుతం ఉల్లి పంట పరిస్థితి బాగానే ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు 20% అధికంగా పంట వేశారు. అందువల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లకు మరింత పంట వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఉల్లి ధరల విషయంలో గత అనుభవాల నేపథ్యంలో ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలనే వాదన వినిపిస్తోంది. దేశంలో 40% ఉల్లిపంట పండే మహారాష్ట్రలో ధరలు పడిపోవడం అంటే ఆ ప్రభావం దేశమంతా ఉండే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పుడే చర్యలు చేపట్టాలి. నాఫెడ్‌ కొనుగోలు చేసే రబీ ఉల్లి పంట నుంచి బఫర్‌ స్టాక్‌ను ఏర్పాటు చేయాలి. గిట్టుబాటు ధరను నిర్ణయించి రైతుకు, వ్యాపారులకు తగిన లాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తగిన నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. లేకుంటే ఇప్పుడు మహారాష్ట్రకే పరిమితమైన ఉల్లి సంక్షోభం, రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు కన్నీరు తెప్పించే ప్రమాదం ఉంది.

ఇవీ చదవండి: పది నెలల్లో బడ్జెట్ అంచనాల్లో 80శాతం పెరిగిన రాష్ట్ర పన్ను ఆదాయం

కేజ్రీవాల్​ కేబినెట్​లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు.. ముర్ము వద్దకు మంత్రుల రాజీనామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.