ETV Bharat / bharat

అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై 'ఒమిక్రాన్​' ఎఫెక్ట్​!

author img

By

Published : Nov 28, 2021, 5:28 PM IST

Updated : Nov 28, 2021, 5:39 PM IST

Omicron Variant News: కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా అధ్యక్షత అత్యవసర సమావేశం జరిగింది. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు. అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

omicron news in India, ఒమిక్రాన్​ వేరియంట్​
అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై 'ఒమిక్రాన్​' ఎఫెక్ట్​!

Mha omicron: డిసెంబర్​ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలన్న ప్రభుత్వ ప్రణాళికపై ఒమిక్రాన్​ ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో.. విమాన సేవల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు చేయాల్సిన పరీక్షలు, నిఘాకు సంబంధించిన ఎస్​ఓపీని కూడా సమీక్షించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఈ భేటీలో చర్చించారు(omicron variant). దేశంలో వైరస్​ కట్టడి చర్యలను ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశం చర్చకు వచ్చింది. టెస్టింగ్​ ప్రోటోకాల్​ను కచ్చితంగా అమలు చేసేలా చూసుకోవాలని విమానాశ్రయాలు, ఓడరేవుల్లోని ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎమ్​హెచ్​ఏ.

ఈ భేటీలో నీతి ఆయోగ్​ సభ్యుడు వీకే పాల్​, ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ అడ్వైజర్​ విజయ్​ రాఘవన్​తో పాటు ఆరోగ్య, విమానయాన, ఇతర మంత్రిత్వశాఖ సీనియర్​ అధికారులు పాల్గొన్నారు.

'సిద్ధంగా ఉండండి'

దేశానికి కరోనా కొత్త వేరియంట్​ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది(omicron news in India). ఒమిక్రాన్​​ నియంత్రణ కోసం విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేసింది.

వైరస్​ కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు శనివారం లేఖ రాశారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టాలని, కొవిడ్​ నమూనాలను వేగంగా ల్యాబ్​లకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వైరస్​ కట్టడికి ప్రజలు.. నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్​ కేసులు బయటపడిన దేశాలను ముప్పు ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడి నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై మరిన్ని నిబంధనలు విధించే అవకాశముందని లేఖలో భూషణ్​ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని, కొత్త వేరియంట్​ను గుర్తించేందుకు టెస్టింగ్​ను ఉద్ధృతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఇదీ చూడండి:-

Last Updated : Nov 28, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.